నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...

నీ

నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు వైహెచ్ కే మోహన్ రావు రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక జూన్, 2019 సంచికలో ప్రచురించబడినది

సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే! ఈ ఇద్దరు మాతలూ మన కుటుంబీకులు కారు, మన పూర్వ దాయాదులూ కారు. మనమెందుకు వీరికి జరిగిన అవమానాల పట్ల నిరసిస్తున్నాం! విశ్లేషిస్తే పరాయి వ్యక్తులకు జరిగే అన్యాయాల పట్ల కూడా మానవ సమాజం స్పందిస్తుందని స్పష్టమౌతుంది. ఇతరుల ఇక్కట్ల పట్ల జాలి ప్రదర్శించడం దాని సహజ గుణం. ఇట్లాంటి పరిణామాన్ని ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 11న జరిగిన ఉభయ ఎన్నికల్లో తమ వ్యతిరేకతను ఆకాశమంత ఎత్తున చాటుకున్నారు. ప్రజలను, ఉద్యోగ అధికారులనూ పీడించి, ముప్పుతిప్పలు పెట్టి ప్రజాస్వామ్యం పీక నొక్కిన
తెలుగుదేశం పాలకులను ఓటర్లు తరిమి తరిమి కొట్టి తమ కసిని ప్రదర్శించారు. ఓటు పోటుతో చావగొట్టి చెవులు మూశారు.

2014లో చంద్రబాబు టక్కరితనంవల్లే టిడిపి గెలిచి పాలన అందుకుంది. 2019లో ఆయనపై సడలిపోయిన విశ్వాసాలతోనే అధికారాన్ని కోల్పోయి ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. అలవికాని వాగ్దానాలు, బురిడీ పథకాలు, డొల్ల హామీలతో గెలిచి పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాయుడు అమలులో చతికిలబడి 2019 ఎన్నికలలో కుర్చీని కోల్పోయి, నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచాడు. మోసాన్నీ, ద్రోహాన్నీ సహించేదిలేదని ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు మరోమారు రుజువు పరిచారు. సర్వే సంస్థలూ, మాధ్యమాలూ, ఎనలిస్టులూ, సెఫాలజిస్టుల ఊహలకందని విధంగా 23 స్థానాలతో ఆయన పార్టీ కురచబారింది. రాజకీయ పార్టీలకు ఓటమి సహజ పరిణామమే కాకపోతే ఇంత హీనమైన ఓటమినే ఆ పార్టీ నేతలే గాకుండా మధ్యస్థులు కూడా నిబిడాశ్చర్యంతో విస్తుపోతున్నారు. ప్రతిపక్షం బలంగా వుంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విశ్వసించే వారంతా చంద్రబాబునే దోషిగా ఎంచుకున్నారు. అధికారముందని ఇష్టారాజ్యంగా కన్నూమిన్నూకానని చేష్టలకు వడిగట్టే అన్ని రాజకీయ పార్టీలకూ 2019 ఎన్నికల ఫలితం చెంపపెట్టు.

ప్రజాస్వామ్యానికి పసుపు నీళ్లొదిలి

ఐదేళ్లలో చంద్రబాబు అరాచక పాలనను వ్యక్తం చేయడానికి భయకల్పిత వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై పెదవి కదలాలంటే వణుకు, పలుకు రాలాలంటే బెరుకుతో ప్రజాస్వామ్య వాదులు స్తంభించిపోయారు. గడప దాటితే సంకెళ్లు, నినాదాలిస్తే కేసు, రోడ్డు మీదకు వస్తే జైలు, అంతెందుకు ఆలోచిస్తేనే అదుపులోనికి తీసుకునే పోలీసు మార్కు పాలనతో నియంతృత్వం రాజ్యమేలింది. అనధికార కర్ఫ్యూ అమలు జరిగింది.

సిపిఐ, సిపిఎం, జనసేన, వైసిపి వంటి విపక్ష పార్టీల వారు ఎవరు కదిలినా అరెస్టుల మీద అరెస్టులు జరిగాయి. వాకిలి దాటకుండానే గృహనిర్బంధాలు సాధారణమయ్యాయి. ప్రత్యేక హోదా సాధన ఆందోళనలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న జగన్మోహన్‌ రెడ్డి, ఆయన అనుచర నాయకులను విమానాశ్రయం నుండి వెలుపలికి రాకుండానే నిర్బంధించి తిరుగు ప్రయాణానికి నిర్బంధంగా విమాన మెక్కించి హైదరాబాదుకు చేర్చారు. మహిళా సాధికార సదస్సుకు శాసనసభ్యురాలు ఆర్‌.కె. రోజాను ఆహ్వానించి విజయవాడ విమానాశ్రయంలోనే అడ్డుకుని బలవంతంగా రోడ్డు మార్గం ద్వారా హైదరాబాదు తీసుకెళ్లి, పగలంతా నగరం అంతటా తిప్పి ఇంట్లో వదలివెళ్లారు.

ప్రత్యేక హోదా అని ఉచ్ఛరిస్తే జైలుకెళతారని బెదిరించిన చంద్రబాబు తగుదునమ్మా అంటూ 2019 ఎన్నికలకు కొద్ది నెలలముందు తానే ప్రత్యేక హోదా సాధన ఉద్యమ బ్రాండ్‌నంటూ ఫోజులు పెట్టి ధర్మపోరాట దీక్షల పేరున ప్రభుత్వ సొమ్మంతా సభలూ సమావేశాలు నడిపి ప్రజలు వెర్రివాళ్లని భ్రమ పడ్డాడు. ఎన్నికల ప్రణాళికతో తానే ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండు చేస్తూ కాపు ఉద్యమాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభాన్ని అడుగు కదలనీయకుండా అరెస్టుల మీద అరెస్టులు సాగించారు. వందల మంది పోలీసులను కాపు నాయకుని గృహం వద్ద కాపు కాయించారు. రహదారి ముఖం దర్శించకుండా పలుపర్యాయాలు నిలువరించారు.

పనికిరాని ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ

సిపిఎస్‌ అమలుపై చంద్రబాబు మనోగతం ఇప్పటికీ డోలాయ మానమే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఈ విషయంలో ప్రశ్నార్థకంగా నిలుస్తుంది. అసలు చంద్రబాబు సమగ్రంగా ఆలోచన చేయరా? లేక ఇతరులు చెప్పినా చెవికెక్కించుకోరా అనే సందేహం ఈ వ్యవహారంలో తలెత్తుతుంది. బహుశా ఆయనకు చెప్పగలిగే సాహసం వున్న వారు కూడా ఎవరు లేరా? అని కూడా సంశయం ఉదయిస్తుంది. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఆందోళన చేస్తున్న వైటు కాలర్‌ శ్రామికులను ఈడ్చి పడేసి చుక్కలు చూపించారు. ఆడపిల్లల డ్రస్సులు చించి పడేశారు. చున్నీలు లాగి అవమానపరిచారు.

ఈ హింస ఊరికే పోతుందా? 6 లక్షల మంది ఉద్యోగులూ, వారి కుటుంబ సభ్యులూ కలసి ఈ ఎన్నికలలో బాబుకు కళ్లు బైర్లు కమ్మించారు. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగుల పోస్టల్‌ ఓట్ల ఫలితాలే ఇందుకు దర్పణం పట్టాయి. ఐనా! సిపిఎస్‌ రద్దు చేస్తే చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు పోయేదేమిటి. రాష్ట్ర ప్రభుత్వంపై భారమేమీ కాదుగా! 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి రాష్ట్రం కూడా అమలు పరుస్తుంది.

పెన్షన్‌ ప్రారంభమయ్యేది 60 సంవత్సరాల వయసు అనంతరం వచ్చే రిటైర్మెంటు తరువాతనే. అంటే 2005లో 30 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగంలోకి వస్తే, అక్కడి నుండి 30 ఏళ్ల తదుపరి మాత్రమే పెన్షన్‌ ఇవ్వవలసి ఉంటుంది. స్కీం ప్రారంభమై గడిచిన 13 ఏళ్లను మినహాయిస్తే, ఇంకా 17 ఏళ్ల తదుపరి ఈ స్కీం వాళ్లకు నిరంతర పెన్షన్‌ పథకం అమలు జరపాలన్నది ఖచ్చితమైన మూల్యాంకనమే. అంటే సిపిఎస్‌ రద్దు ప్రభావం 17 ఏండ్ల తరువాత మాత్రమే రాష్ట్ర ఖజానాపై చూపుతుంది. ఐతే చంద్రబాబు ఇట్లా ఎందుకు ఆలోచించలేదో బోధపడదు. ఇదే క్రమంలో జగన్మోహన్‌రెడ్డి తెలివిగా ముందుచూపుతో, పాదయాత్ర ప్రారంభించగానే తనను తొలిసారిగా కలిసిన ఉద్యోగ బృందానికి, తాను అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేస్తానని నిఖార్సైన హామీ ఇచ్చారు. అదే హామీని పదేపదే వల్లెవేశారు. ఉద్యోగులను బలంగా నమ్మించారు. గంపగుత్తగా ఉద్యోగులూ వారి కుటుంబసభ్యుల ఓట్లనుపొందారు. 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం 46 ఏళ్ల వయసున్న జగన్మోహన్‌రెడ్డి ఆలోచన ఎదుట వెలవెల బోయింది. పై సంఘటనలన్నీ బాబు మితిమీరిన నియంతృత్వ వైఖరులకూ, ఆకాశమంత అహంకార భావాలకూ మచ్చుతునకలుగా దర్శనమిస్తాయి.

అమాయకులపై అక్రమ కేసులు

సాధారణంగా అశ్రిత పక్షపాతంతో తమవారు దోషులైనా కేసులు నమోదు చేయకుండా వదలడమో, లేకపోతే కేసు బలహీనపరుస్తూ చట్టాలను నీరు గార్చడమో జరిగేది. అందుకు భిన్నంగా, అక్రమాల పరాకాష్టగా ఫిర్యాదుదారులను బెదిరించడం, బాధితులను వేధించడం, వారిపైనే కేసులు నమోదు చేసే ఘనత టిడిపి ప్రభుత్వం దక్కించుకుంది.

ఇదొక విపరీత, విపత్కర పోయే పరిణామం. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అదుపులోకి తీసుకుని లాఠీలతో దారికి తెచ్చుకోవడం, తోటలను తగులపెట్టించి సంబంధం లేని వారిపై దమనకాండ జరపడం, శాసనసభ్యుల దోపిడీని న్యాయస్థానాల ఎదుటకు తీసుకవెళ్లిన వారిపై దౌర్జన్యం చేయడమేగాకుండా, దారికాచి మూకుమ్మడిగా దాడి చేయడం, తిరిగి ఫిర్యాదిపైనే కేసులు నమోదు చేసి, కుటుంబ సభ్యులకూ, విపక్ష పార్టీ వారికీ, ప్రజలకు తెలియకుండా స్టేషన్లు మార్చి మార్చి వారాలకు తరబడి కుళ్లబొడవడం వంటి అమానుషాలను తలకెక్కించుకున్న ఓటర్లు సమయం కోసం ఎదురు చూసి పోలింగు నాడు ఒక్కమారుగా ఆ పార్టీని బలి తీసుకున్నారు.

ఇనిమెట్లలో తాజా శాసన సభాపతిని ఆ గ్రామ స్త్రీపురుషులంతా ఏకమై చేసిన మర్యాదే ఇందుకు ప్రబల నిదర్శనం. ఎదురు చూసిచూసి అదను చిక్కగానే ఒక్కసారిగా విరుచుకపడ్డారు. మాదాల రంగారావు చిత్రాలలో చివరగా సీన్లలో ప్రజలంతా కలిసి ప్రతి నాయకుని పైకి కర్రలూ, కట్టెలు, చీపుర్లూ, చాటలు తీసుకుని గ్రామం నుండి తరిమే సన్నివేశాలే గుర్తుకొచ్చాయి. అందరూ ఐక్యంగా మారి ఆయనా, తనయుడు, తనయల రాక్షస క్రీడను అంతమొందించారు.

తుని రైలు దుర్ఘటన రాయలసీమ వాసులపైకి నెట్టి ప్రచారం చేసిన బాబు వక్రభాష్యాలు అక్కడి ప్రజల మనోభావాలపై తీవ్ర ప్రతికూల ముద్రవేశాయి. చెఱుకు తోట దహనం ఘటనను జగన్మోహన్‌రెడ్డిపై నెట్టి ప్రయోజనం పొందాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుకు అష్టదరిద్రాలను తెచ్చిపెట్టింది. అందుకే రాయలసీమ జిల్లాల్లోనూ, రాజధాని స్థానాల్లోనూ ʹదేశంʹ పార్టీని ఉతికి పారేశారు ఓటర్లు.

ఇది ఇట్లా వుంటే విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం టిడిపిని ప్రజల ముంగిట దోషిగా నిలబెట్టింది. సానుబూతి చూపాల్సిన టిడిపి పెద్దలు జగన్మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం, ఆయన వైపే వేలెత్తి చూపడం, ప్రచారం కోసం, సానుబూతి కోసం చేయించుకున్నాడని మాట్లాడటం వంటి దిగజారుడుతనం ʹదేశంʹ పార్టీకి చేటుతెచ్చి పెట్టింది. ఈ హత్యాయత్నంపై బాబు అతని అనుచరగణం ఎంత అవహేళన చేసిందో అంత అప్రదిష్ట మూటగట్టుకుంది. ఆఖరికి వైసిపిని కోడికత్తి పార్టీ అంటూ హీనమైన వాఖ్యలు చేసీ చేసీ, జగన్మోహన్‌రెడ్డికీ, ఆయన పార్టీకి సానుభూతిని మూటగట్టి అందించారు. జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను సైతం జగన్‌ కుటుంబానికే ఆపాదించి వారినే ముద్దాయిలుగా ప్రచారం చేసిన అనైతికతను రాష్ట్ర ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. ఇతరులు బాధితులైనా వదలని బాబు తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలూ ఎంతటి నేరం చేసినా తెలియనట్లు నటించడం, రాజీలు పెట్టడం, కొన్ని సందర్భాల్లో బాధితులపైనే ఆగ్రహాన్ని ప్రకటించడం వంటి వినోదాలు మొత్తం పార్టీనే కురచబరిచాయి. ఇటువంటి సంఘటనలన్నీ ఏతావాతా ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకతనే కూడగట్టాయి.

వాగ్దానాలు తుంగలో తొక్కి

2014 ఎన్నికల సమయంలో ఏదోవిధంగా అధికారాన్ని చేజిక్కించు కోవాలనే కపట ఆలోచనతో ఇచ్చిన హామీలను గంగలో కుక్కినబాబు, వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఏ ఒక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా అమలు పరిచిన దాఖలా లేనేలేదు. 89 వేల కోట్లుగా వున్న రైతు రుణాలనూ, 18 వేల కోట్లుగా వున్న డ్వాక్రా మహిళల రుణాలనూ నూతన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకున్న జగన్మోహన్‌రెడ్డి మాఫీ చేయడం సాధ్యం కాదని పదే పదే చెప్పుకొచ్చారు. ఆయన పార్టీలోని అనేకమంది రుణమాఫీ ప్రకటన కోసం ఎంత వత్తిడి తెచ్చినప్పటికీ విశ్వసనీయత, వాస్తవికత ప్రాతిపదికగా జగన్మోహన్‌రెడ్డి సమ్మతించలేదు.

ఈ విషయంపై ఆ పార్టీలోని కొందరు నాయకులు జగన్‌తో విభేదించారు, కినుక వహించారు. అయితే ఇదే కోవలో అడ్డ దోవలో తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పైన చెప్పుకున్న రుణాలు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ఊదరగొట్టారు. రుణాలెవరూ చెల్లించవలదని, బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన గృహిణుల మంగళసూత్రాలు ఇంటికే వచ్చేస్తాయని ఎన్నికల సభల్లో స్వరం పెంచి చెప్పుకొచ్చారు. ఈ వంచనను ప్రజలు నమ్మి టిడిపికి అధికారమిచ్చారు. అధికారంలోకి వచ్చినవెంటనే వాగ్దానభంగం చేస్తూ బాబు కోటయ్య కమిటీని నియమించి మాఫీని 24 వేల కోట్లకు పరిమితం చేశారు.

ఒక్కోరైతు కుటుంబానికి లక్షా యాభై వేలకు కుదించి, 30 వేల చొప్పున ఐదేళ్లపాటు 5 కిస్తీలుగా మాఫీని ప్రకటించి రుణ విమోచన పత్రాలు విడుదల చేశారు. ఈ మాఫీని ఒక నానుడితో పోల్చితే ʹʹపంచపాండవులు అరచేతి వేళ్ల వలే నలుగురని, మూడువేళ్లు చూపించి, రెండు అంకెతో పోల్చి, ఒకటి వేయబోయి, సున్నాచుట్టాడటʹʹ ఓ ప్రబుద్ధుడు. అట్లావుంది బాబు మాఫీల కథనం. ఐతే ఆమాత్రమన్నా చేశాడా! అంటే అదీనూ లేదు. ముచ్చటగా మూడు కిస్తీలు మాఫీ చేసిన తరిమిలా నాలుగైదు కిస్తీలను రైతులకు పంగనామమే పెట్టేశాడు. ఆనాడే ఎనలిస్టులూ, ఎకనమిస్టులూ ఎట్లా చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా, తనకు 9 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం వుందీ, చేసే చూపిస్తానంటూ బెదరగొట్టి నోరు మూయించాడు. పాపం ప్రజలు అమాయకులు కదా! నమ్మేశారు. ఇంకేం మన బాబు ఇక్కడ నుండే ప్రారంభించాడు తన యూటర్న్‌ జర్నీ. డ్వాక్రా మహిళలకు ఒక్కో స‌భ్యురాలికి లక్ష రూపాయలు మాఫీ కావలసి వుండగా ఒక పర్యాయం పదివేలూ, ఎన్నికలకు ముందుగా చెక్కుల్లో పదివేలిచ్చి ఓట్లు కొల్లగొట్టే కుటిల యత్నం చేశారు. ఇక సుమారు 600 హామీల ఎన్నికల టిడిపి ప్రణాళిక అమలు గురించి మాట్లాడు కోవడం అవివేకమే అవుతుంది.

జన వ్యతిరేక కమిటీలు

చంద్రబాబు ఎప్పుడు అధికారానికి వచ్చినా జన్మభూమి కమిటీలతో అనధికార పాలనకు తెరతీస్తారు. ఏ ఉద్యోగీ, అధికారీ పని చేయాలన్నా ఈ కమిటీలే కీలకంగా వుంటాయి. రేషన్‌ కార్డు దగ్గర నుండి ఓటర్‌ కార్డు వరకూ అన్ని ప్రభుత్వ అధికారాలూ ఈ కమిటీలకే దారాదత్తం అయ్యాయి. ఈ దళారి కమిటీలే ఆ పార్టీ కొంప ముంచాయి. టిడిపికి ఓటేసిన వారెవరు? వైసిపి ఎవరు? అని వర్గీకరించి తమ పార్టీకి అనుకూలం కాదనుకున్న వారికి ప్రభుత్వ పథకాలనూ, ప్రయోజనాలను అందకుండా నిర్భయంగా ప్రవర్తించారు. అంతేగాక ఈ కమిటీలోని సభ్యుల అవినీతి విశృంఖలమై అవినీతి గ్రామాలలోని క్షేత్రస్థాయికి చేరుకుని ʹదేశంʹ పార్టీ వెన్ను విరిచింది.

చెయ్యి బరువెక్కకుండా పెన్షన్‌, రేషన్‌ కార్డు ఇతర పథకాలూ లబ్దిదారులకు అందలేదు. తారాస్థాయికి చేరుకున్న ఈ అవినీతి ప్రజలను అత్యంత చికాకు పరిచింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పోలీసు స్టేషన్ల నుండి లంచగొండితనం ఏరులైపారింది. ముఖ్యంగా రెవెన్యూశాఖ అవినీతిలో రికార్డు సృష్టించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పని రావడం ప్రజలంతా దురదృష్టంగా భావించారు. పోలీసు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ శాసనసభ్యుల జాగీర్లుగా, వాటిలో పనిచేసే సిబ్బంది తమ జాగీర్దార్లుగా, అనుంగు సైన్యంగా దున్నిపడేశారు. అంతంలేని అవినీతి, ఆద్యంతం అక్రమాలతో దుష్టపాలనే అందించారు.

ʹʹఅగ్రీగోల్డుʹʹ ఒక మానని గాయం

ఐదేళ్లుగా అగ్రిగోల్డు డిపాజిట్‌ దారులూ, ఏజెంట్లు ఆర్తనాదాలు పక్షులు ఆలకించాయి. మదుపుదారుల అవస్థలు ఏమాత్రం ఆలకించని ప్రభుత్వ పెద్దలు ఆగ్రిగోల్డు ఆస్తులు కొట్టేయాలని కుట్రలు చేశారని బాధితులూ, ప్రజలూ గగ్గోలు పెట్టారు. వేలకోట్ల విలువైన హాయ్‌లాండ్‌ను కాజేయడానికి చినబాబు ప్రణాళిక వేసుకున్నాడు, కొందరు మంత్రులు కూడా భాగస్వాములుగా పథకం వేసుకున్నారని గట్టిగా విశ్వసించారు. బహుశా ఇది ఆరోపణే కావచ్చు. ఐతే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే నిర్దిష్టమైన కార్యాచరణ ప్రభుత్వం వైపు నుండి రాని కారణంగా ఈ నింద బలపడింది. వెయ్యి కోట్లు ఇస్తే 80 శాతం మదుపుదారులకు విమోచన లభిస్తుందని అగ్రిగోల్డు ఉద్యమకారుల కమిటీ నాయకులు నెత్తీనోరూ బాదుకున్నా బాబు ఏమాత్రం ఆ దిశగా స్పందించనేలేదు. ఎన్ని లక్షల మంది ఉంటారు! ఈ అగ్రీగోల్డు బాధితులూ, ఏజెంట్లూ, వారి కుటుంబాల సభ్యులూ! వత్తిడి అధికమై మదుపుదారులూ, ఏజెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా స్పందించాల్సిన ప్రభుత్వం ఉలకనూ లేదు, పలకనూ లేదు. పర్యవసానం గా టిడిపినే అనుభవించింది.

సాగునీటి ప్రాజెస్టుల మొద్దు నిద్ర

కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమయ్యే జాతీయ ప్రాజెక్టు పోలవరం మినహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పూర్తిగావలసిన ఇతర ప్రాజెక్టులన్నింటినీ గాఢ నిద్రలోకి పంపిన బాబు కమీషన్లు వరద పారించే వట్టిసీమను పట్టిసీమగా మార్చాడు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డుతుందన్న నిరంతర కీచులాట మినహా, వివిధ దశలలో వున్న రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పట్ల తన బాధ్యతను ఏనాడూ గుర్తుకు తెచ్చుకోలేదు. తెలంగాణా ప్రాంతంలో ముంపుకు లోనయ్యే గ్రామాల ప్రజలకు నష్టపరిహారం కేవలం వందకోట్లు ఇస్తే 42 టియంసిల నీటి నిల్వ
సామర్థ్యం కలిగిన పులిచింతల ప్రాజెక్టు పూర్తి అవుతుంది. పరాయి రాష్ట్రాలతో ఎప్పుడు గొడవ పడదామా! అంటూ కాచుకు కూర్చోడం తప్ప, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామని బాబు ఏనాడు ఆలోచించి ఎరుగడు. వెలిగొండను వెలివేశాడు. ఇతర ప్రాజెక్టులను అటకెక్కించాడు. తెల్లవారి పొద్దు పొడిస్తే చాలు పోలవరం, కేంద్రం, మోడీ అడ్డు అంటూ మీడియా ఎదుట రభస సృష్టించి, గంటల తరబడి సమావేశాలతో జర్నలిస్టుల సహనాన్ని పరీక్షిస్తాడు. పోలవరం, పట్టిసీమల అవినీతి కూడా చంద్రబాబు పుట్టిముంచాయి.

రెండు కొమ్మలు కొడితే

తిరుమల నారాయణగిరిపై రెండు ఎర్రచందనం కొమ్మలు కొట్టిన కారణానికే తమిళ కూలీలను దారుణంగా, నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వాస్తవానికి వారంతా పొట్టకూటికోసం వచ్చిన పనివారే. వారేమీ స్మగ్లర్లు కాదు. అసలు స్మగ్లర్లను నేటికీ పట్టుకుందీ లేదు. ఆధారం కోల్పోయిన ఆయా కూలీల కుటుంబాలు మొత్తం నేడు దిక్కులేక అలమటిస్తున్నాయి. అదే! తెలుగు తమ్ముళ్లు, నాయకులూ, శాసన సభ్యులూ లక్షల టన్నుల సున్నపురాయి, బాక్సైట్‌, మట్టీ, ఇసుక కొట్టిన వాళ్లను ఏమి చెయ్యాలి? వీరందరినీ బాబు సమున్నత గౌరవంతో లాలించారు.
నదులను, నేలనూ, నింగిని సైతం కోట్లాది రూపాయల మేర కొల్లగొట్టి సహజ వనరు లన్నింటినీ గుల్ల చేశారు. కొమ్మలు కొట్టిన వారు దొంగలైతే, క్వారీలను కొట్టినవారు దొరలుగా చలామణి అయ్యారు. ఇది ఇట్లావుంటే తాత్కాలిక రాజధాని నిర్మాణానికి చదరపు అడుగుకి 11 వేలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ధనాగారాన్ని డొల్లచేశాడు. ఈ మొత్తంలో అధిక భాగం పాలకుల జేబుకే చేరిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సిటీలో కూడా చదరపు గజం 3 వేల నుండి 4 వేలకు మించదనే విషయం జగమెరిగిన సత్యం. 7 నుండి 8 వేలు ఏకంతకు చేరాయి. రాజధాని భూసేకరణలో భూయజమానులను కంట తడిపెట్టించిన బాబు, వారి నుండి స్వాధీన పరుచుకున్న భూ విక్రయాల్లోనూ అవినీతి రాజ్యమేలింది. కేంద్ర ప్రభుత్వ రిజర్వుబ్యాంకు, ఎల్‌ఐసి వంటి సంస్థల కార్యాలయాల నిమిత్తం ఎకరం 4.5 కోట్లకు విక్రయిస్తే, కొన్ని తస్మదీయ ప్రైవేటు సంస్థలకు ఉద్యోగ కల్పన సాకుతో ఎకరం ఒక్క రూపాయికే స్వాధీన పరచిన వైనం బాబు ప్రభుత్వ అవినీతి
పరాకాష్టకు గీటురాయి.

నిర్మూలనా ఫార్ములా

నంద్యాల ఉపఎన్నిక సందర్భంలో పోలింగుకు కొద్దిరోజుల ముందుగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్మును జమ చేయించి ఓట్లు కొల్లగొట్టిన విధంగా 2019 ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలనే పన్నాగాన్ని అమలు పరిచారు. కానీ ప్రజలూ, లబ్ధిదారులు బాబు బండారాన్ని
క‌నిపెట్టి ఆ దుష్టక్రియను తుత్తునియలు చేశారు. ఆయన ఆశలను అడియాశలుగానే మిగిల్చారు. 2014 ఎన్నికల ప్రణాళికను మడిచి ప్రజల చంకలో పెట్టిన బాబు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ప్రసాదం పెట్టి అధికార మకుటాన్ని కాజేయాలని అత్యాశకు పోయాడు. గత ఎన్నికల్లో మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన రుణాల విషయంలో రైతులను, డ్వాక్రా మహిళలను, వెన్నుపోటు పొడిచి ఎన్నికల ముందు ఇచ్చిన చెక్కులూ, బ్యాంకు ఖాతాల చిన్న మొత్తాల జమలను, బాబు ఓట్ల జిమ్మిక్కులుగా తేల్చిపారేసిన ఓటర్లు బాబుకే పసుపు కుంకుమ నిలువెల్లా పూసి ఇంటికి సాగనంపారు.

వేటుకు రావాలని

ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటం గమనించిన బాబు మధ్యాహ్నం గంటల సమయంలో మీడియా ముందుకు వచ్చి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, మహిళలంతా పసుపు కుంకుమ లిచ్చిన అన్నయ్య విజ్ఞప్తి నందుకుని తండోపతండాలుగా పరుగు పరుగున పోలింగ్‌ కేంద్రాలకు చేరి సైకిల్‌ గుర్తుపై ఎడాపెడా నొక్కారని ʹʹదేశంʹʹ గళాలన్నీ విస్తృత ప్రచారం గావించాయి. ఐతే విజ్ఞప్తితో బాబు తమ పార్టీకే ఓటేయమని కోరని కారణంగా బహుశా మహిళామణులంతా గాలి కోసం ఫ్యాన్‌కు వేసినట్లుగా ఫలితాలు వెల్లడి చేశాయి. ఇదేంటండీ! ఓటు వేయమంటే! చంద్రబాబుకు వేటు వేయడం అన్యాయం కదా! ప్రజలను మభ్యపెట్టడంలోనూ, నమ్మించడంలోనూ, ఎట్లాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మలుచుకోగలిగిన తమ్ముళ్లు విస్తృత ప్రచారం గావించడంలోనూ, ఎంత సిద్ధహస్తులో ఈ ఒక్క సంఘటనతోనే మనం అర్థం
చేసుకోగలుగుతాము.

ముంచిన స్వంత సర్వేలు

చంద్రబాబు మీడియాను నమ్ముకున్నంతగా ప్రజలను విశ్వసించి నట్లుగా కనిపించదు. తన పాలనపై ప్రజల అభిప్రాయాలను ఆయన మీడియా కథనాల ద్వారానే తెలుసుకోవడానికి ఇష్టపడి ఆనందించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రింటు మీడియా, ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి, ఈ టివి, మహా టివి,
టివి 5, టివి 9 భజంత్రీలై ఊదిన బాకాలకూ, భజనకీర్తనలకూ పొంగిపోయిన బాబుకు ప్రజల దీననాదాలు వినిపించ కుండానే ఫ్యాన్‌ గాలిలో కలిసిపోయాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి చేసిన ఫోను కాల్స్‌ కూడా బాబును ఇంటికి పంపాయి. ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజల
అభిప్రాయాలను తెలుసుకున్న క్రమం కూడా అపహాస్యమే. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు సమాధానంగా సంతృప్తిగా వున్నామని తెలిపే ఒకటో నెంబరునే ప్రతి ఒక్కరూ నొక్కారు. ఒకటి మినహా మరొక నంబరు నొక్కితే ఎక్కడ తమకు లభిస్తున్న ప్రభుత్వ పథకం తీసివేస్తారో, రేషన్‌ కార్డో, ఓటరు కార్డో మాయమౌతుందనే భయంతో పౌరులంతా పాలన భేష్‌ అంటూ ఒకటో నెంబరు నొక్కి పడేశారు. ఈ పరిణామమే బాబు పాలనపై ప్రజాభిప్రాయం 80 శాతం మేర సంతృప్తి గుట్టలుపడింది. వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని మనం ఫలితాలను బట్టి తెలుసుకోగలిగాం. ఒకటో నంబరు నొక్కి నొక్కి చేతులు నొప్పులు వేసిన ఏపి ఓటర్లు తడబాటుతో పోలింగులో తెలుగుదేశం పార్టీ పీకనే నొక్కారు.

ఫ్రీ వెర్స్‌ పొలిటీషీయన్‌

చంద్రబాబు శాస్త్రంలో చెయ్యదగినవీ, చెయ్యకూడనివీ అంటూ లేనేలేవు. ఆయన ప్రయోజనం కోసం, అవసరం మేరకు అన్ని ధర్మాలనూ పరిత్యజించగలరు. స్వార్థమే పరిమావధిగా ఎంతకైనా దిగజారగలరు. ఒక విధంగా విశ్లేషించాలంటే బాబు ఫ్రీవెర్స్‌ థింకర్‌. విపక్ష వైసిపికి చెందిన ముగ్గురు ఎంపిలను, 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకుని, ప్రపంచం తప్పు పడుతుందేమోననే సంశయం ఏ కోశానా లేకుండా పార్టీ కండువాలు కప్పి, నలుగురిని మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. ఏమాత్రం చాటుమాటు, తెరచాటు లేకుండా ఇట్లాంటి అకృత్యానికి పాల్పడి
రాజకీయాలను తనకు మించి ఎవరూ భ్రష్టు పట్టించలేరని ఛాలెంజ్‌ విసిరారు.

2014కు ముందుగానీ, 2019 తరువాతా ఈ స్థాయిలో రాజకీయాలను ఇంకొకరు కలుషితం చేయలేరేమో! ఈయన దుష్ట కార్యక్రమాలకు దన్ను మన గౌరవనీయ శాసన సభాపతి ʹʹకోడెలʹʹ. అందుకే ఆయన అపూర్వ సన్మానం అందుకున్నారు. రెండు నియోజక వర్గాలలో కోడెల, తనయుడూ, తనయ ఇష్టారీతిన సాగించిన రాక్షసక్రీడకు అంతం పలికారు. ఇనిమెట్ల గ్రామంలో కోడెలకు జరిగిన పరాభవం, మాదాల రంగారావు ఎఱ్ఱ చలన చిత్రాలలో ముగింపులో విలన్‌ని గ్రామస్థులంతా ఆడామగా ఏకమై కర్ఱలూ, బడితెలూ, చీపుర్లు, చాటలు, కొడవళ్లూ చేపట్టి గ్రామం నుండి తరిమిన సీన్లు గుర్తుకు తెస్తుంది. ప్రజాగ్రహమంటే అట్లాగే వుంటుంది మరి. సాధు జంతువులన్నీ ఏకమైతే పులి, సింహమైనా పరారే! ʹʹబలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతిʹʹ.

గడిచిన ఐదేళ్ల బాబు పాలనను ఎపి ప్రజలు దుష్ట, దుర్మార్గ పాలన గానే భావించారు. రాజకీయ ఉద్దండులు సైతం గమనించని విధంగా తెలుగుదేశం తీవ్ర ప్రజావ్యతిరేకత ను చవిచూడడమే ఇందుకు దర్పణం పడుతుంది. 175 శాసనసభ్యుల స్థానాలకు గాను, 23 స్థానాలతోనూ, 25 పార్లమెంటు స్థానాలకు 3 స్థానాలనూ ఇచ్చి ఓటర్లు చిత్తుగా ఓడించారు. గెలిచిన వారు కూడా చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా అత్యల్ప ఆధిక్యతలతోనే నెగ్గుకొచ్చారు. 2019 ఎపి ఎన్నికల ఫలితాలు టిడిపికే కాదు, అధికారం ఉందికదా అని విర్రవీగుతూ ప్రజలనూ, ప్రజాస్వామ్యాన్ని విస్మరించే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ వీపు చరిచి జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరికగా భావించాలి.ప్రస్తుతం బాబు దీనావస్థ జాలిగొలుపుతుంది. ప్రజలను ఇంత స్థాయిలో బాధకు గురిచేశామా! అనే ప్రశ్నతో ఆయన అంతర్మథనం చేసుకుంటున్నారు. ఈ హీన ఫలితాలపై కారణాలను ఆయనకు ఆయన ప్రశ్నించుకుంటూ బేలచూపులు చూస్తున్నారు. అయితే ఈ పరిస్థితులను ఆయనకు ఆయనే కొనితెచ్చుకున్నారు. స్వయంకృతాపరాధంగానే భావించాలి. దృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో అమితమైన దుర్భరాన్ని అనుభవించిన విధంగా శాసనసభ్యులూ, పార్టీ వర్గాల ఆగడాలను ఆమోదించిన సందర్భంగానే బాబు ఇంతటి దారుణ దుర్భర పరిస్థితిని కౌగిలించుకున్నారు.

- వైహెచ్ కే మోహన్ రావురచయిత అధ్యక్షులు, నవ్యాంధ్ర రచయితల సంఘం

Keywords : andhrapradesh, chandrababu, ysrcp, tdp, jagan
(2024-04-24 18:21:02)



No. of visitors : 1293

Suggested Posts


లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపు

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల

తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?

ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో

మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్‌ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు.

గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట‌...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట‌ !

గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.

విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు

12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై

డేటా చౌర్యంలో దోషులెవరు ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్‌ (6) ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌ (మార్చ్‌ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది.

రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌

ప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది

రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ‌

కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది.

Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల‌ పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నీ