మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
విశాఖ ఏజెన్సీలో 22వ తేదీ జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను ఖండించండి
ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వ కూబింగ్, అణచివేత చర్యలపై ఉద్యమించండి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. మృతులు ఐదుగురని మొదట ప్రచారం జరిగింది. తర్వాత ముగ్గురని, కాదు ఇద్దరని అంటున్నారు. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత కామ్రేడ్ అరుణ ఉన్నారని, అలాగే గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి కా. హరి అలియాస్ గెమ్మలి కామేష్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవ సభలు ఏవోబీ అంతటా వేలాది మంది ప్రజలతో జరుగుతున్నాయని, ఆ సభలకు వెళ్లి వస్తున్న ఆదివాసులను పట్టుకొని కాల్చేశారనే వాదన కూడా ప్రసార మాధ్యమాల్లో వినిపిస్తోంది. మృతులు ఎవరైనప్పటికీ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఇప్పటికి పత్రికా కథనాలను బట్టి అర్థమవుతోంది.
నిజానికి ఈ ఒక్క ఎన్కౌంటర్ అనే కాదు, గత కొద్దికాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతక ముందటి అణచివేత విధానాలే మరింతగా ఏవోబీ అంతటా అమలవుతున్నాయి. ముఖ్యంగా గత పదిరోజులనుంచి వస్తున్న ఏజెన్సీ వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎప్పటిలాగే పోలీసులు తమ అణచివేతకు సమర్థనగా ఏవోబీలో మావోయిస్టు యాక్షన్ దళాలు తిరుగుతున్నాయని చెబుతూ భారీ ఎత్తున కూంబింగ్ జరుపుతున్నారు. విశాఖ మన్నెం ప్రాంతం నుంచి ఆంధ్రా ఒడిషా విప్లవోద్యమ ప్రాంతంలోని ఆదివాసీ గూడేలపై దాడులు చేస్తున్నారు. అక్రమంగా ఆదివాసులను అరెస్టు చేసి వేధిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 13న చిత్రకొండ కటాఫ్ ఏరియాలో బిఎస్ఎఫ్ జవానులు సంతకు వెళ్లిన అర్జున్ఖిలో అనే ఆదివాసీ యువకుడిని అక్రమంగా విచారణ పేరుతో ఆదుపులోకి తీసుకున్నారు. తమ వెంట తీసుకువెళ్లి 3 రోజుల తర్వాత చంపేశారు. ఈ ఘటనలో ఆదివాసులు ఆగ్రహించారు. అక్రమంగా అదుపులోకి తీసుకోవడమే కాకుండా హత్య చేయడం ఏమిటని ఆందోళన చేపట్టారు. వాళ్లను చెదరగొట్టడానికి పోలీసులు, జవానులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. అయినా ఆదివాసులు ఆందోళనలు విరమించుకోకపోవడంతో కటాఫ్ ఏరియాలో 144 సెక్షన్ ప్రకటించారు. కటాఫ్ ఏరియాలో 144 సెక్షన్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం.
ఇటీవలి కాలంలో ఏవోబీలో జరుగుతున్న అణచివేత పరంపరను అర్థం చేసుకోడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. జగన్ ప్రభుత్వం, పోలీసులు అనేక మంది సాధారణ ఆదివాసులను మావోయిస్టుల పేరుతో తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. కొందరు ʹసరెండర్ʹ అయ్యారని చూపిస్తున్నారు. దీనికి ఒప్పుకోని వాళ్ల మీద అనేక దొంగ కేసులను బనాయించి వేధిస్తున్నారు. జైళ్లపాలు చేస్తున్నారు. ఇప్పుటికి ఇలా సుమారు 20 మందికి పైగా ఆదివాసులను జెయిళ్లలో తోసేశారు. అనేక సంవత్సరాల నుంచి తమ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసులు బలమైన ప్రజాస్వామిక ఉద్యమం నిర్వహించారు. అయితే ఇప్పుడు జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. చంద్రబాబు పాలనతో తాను చేసిన పోరాట ఫలితంగానే బాక్సైట్ తవ్వకాలు ఆగిపోయాయని ప్రచారం చేసుకుంటున్నాడు. వాస్తవానికి కంపెనీల కోసం పని చేసే ప్రభుత్వాలు, ఓట్ల పార్టీలు తాత్కాలికంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా అంతిమంగా ప్రజా వ్యతిరేక వైఖరే తీసుకుంటాయి. అలాంటి విధానాలే అమలు చేస్తాయి. ఈ సంగతి ఆదివాసులకు స్పష్టంగా తెలుసు. వాళ్లలోని ఈ చైతన్యాన్ని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఏవోబీలో దారుణమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది.
ఈ అణచివేత వ్యూహానికి తాజాగా ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే అనే పేరు పెట్టింది. సీపీఐ మావోయిస్టు అగ్రనేత ఆర్కేను టార్గెట్ చేసి ఈ అభియాన్ను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ అణచివేత మరింత ముమ్మరమైంది. కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడిలో భాగమయ్యాయి. తన హిందుత్వ సాంఘిక సాంస్కృతిక విధానాలను, కార్పొరేట్లకు సంపదను దోచి పెట్టే రాజకీయార్థిక విధానాలకు యథేచ్ఛగా ముందుకు తీసికెళ్లడానికి దేశంలోని ప్రజాస్వామిక, సాంఘిక, విప్లవ శక్తుల అణచివేతను మోదీ తీవ్రం చేశాడు. 370 రద్దు, ఉపా చట్ట సవరణ, అనేక కార్మిక చట్టాల సవరణ మొదలైనవన్నీ దేశవ్యాప్తంగా పీడిత కులాల, మతాల, వర్గాల, జాతుల మీద దాడుల మీద జరుగుతున్న దాడుల్లో భాగమే.
ముఖ్యంగా తన విధానాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్పెషల్ ఆపరేషన్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర పోలీసులు కలిసి మధ్య భారత దేశంలోని విప్లవోద్యమంపై దాడి చేయడానికి గత నాలుగేళ్లుగా ఆపరేషన్ సమాధాన్ పేరుతో దాడి తీవ్రం చేశాయి. ఇటీవల పార్లమెంట్, వివిధ రాష్ట్రాల ఎన్నికల తర్వాత తాజాగా 2022 నాటికి విప్లవోద్యమాన్ని పూర్తిగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆపరేషన్ సమాధాన్ను నడుపుతున్నారు. గతంలో తీసుకొచ్చిన మిషన్ 2016, 2017 వ్యూహాలు విఫలమయ్యాక భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ సమాధాన్ 2022ను తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల విప్లవోద్యమ ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తామని కూడా ప్రకటించింది. గత నెలలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని చెప్పారని బిఎస్ఎఫ్ డిఐజి ప్రకటించాడు. ఆపరేషన్ ఆర్కే అనే సరికొత్త అభియాన్ ఈ సమావేశంలోంచే, ఆపరేషన్ సమాధాన్ 2022 నుంచే తయారైంది. ఈ పని ఆంధ్ర, ఒడిశా పోలీసులు కలిసి చేయాలని, అవసరమైతే హెలికాఫ్టర్లు వాడాలని కూడా బిఎస్ఎఫ్ డిఐజి అన్నాడు.
నిన్న(22వ తేదీ) జరిగిన బూటకపు ఎన్కౌంటర్ ఈ అభియాన్లో భాగం. మొత్తంగా ఆపరేషన్ సమాధాన్ 2022లో భాగం. మౌలికంగా ఇంది ఆదివాసీ ప్రాంతాల నుంచి వాళ్లను బైటికి పంపించేసి అక్కడ ఉన్న సహజ వనరులను కార్పొరేట్లకు కట్టపెట్టే ఉద్దేశం ఇందులో ఉంది. దేశవ్యాప్తంగా పాలకవర్గ దోపిడీ రాజకీయార్థిక సాంఘిక సాంస్కృతిక విధానాలపై బలమైన విమర్శ పెడుతున్న విప్లవోద్యమాన్ని దెబ్బతీసే దీర్ఘకాలిక కుట్ర ఇందులో ఉంది. ప్రజల్లో మిలిటెంట్ చైతన్యాన్ని పెంచే విప్లవ శక్తులను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మోదీ-జగన్ సర్కార్లు ఈ అణచివేత విధానాలు కొనసాగిస్తున్నాయి. అలాగే వేర్వేరు ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజాస్వామిక ఉద్యమశక్తులను కకావికలం చేయడంలో భాగంగా అనుసరిస్తున్న వ్యూహంలో ఇదంతా భాగం. ఏవోబీ ప్రాంతంలో విప్లవోద్యమ నాయకత్వంలో ఆదివాసులు సంఘటితం అవుతూ తమ హక్కుల కోసం పోరాడుతూ ఉండటం, సహజ సంపదలను పెట్టుబడిదారుల పరం కాకుండా కాపాడుతూ ఉండటం పాలకులకు కంటగింపైంది. అందుకే ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్న విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి ఆపరేషన్ ఆర్కే చేపట్టి నానా భీభత్సం సృష్టిస్తున్నారు.
అయితే దండకారణ్యంలోగాని, ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతంలోగాని అమలవుతున్న ఈ రాజ్యహింస బైటి సమాజానికి తెలియడం లేదు. పత్రికలు చాలా అరగొరగా, అర్ధ సత్యాలతో, అసత్యాలతో రాస్తున్నాయి. ఆదివాసీ ప్రజల జీవించే హక్కుకు, పోరాడే హక్కుకు భంగం కల్గిస్తూ వేలాది మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలు దాడులు చేస్తోంటే పత్రికలకు, మీడియాకు పట్టలేదు. ఇప్పుడవి ఆంధ్రప్రదేశ్లో పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాల ప్రచారానికి నిస్సిగ్గుగా పోటీపడుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కంపెనీల స్వేచ్ఛ కోసం, కంపెనీల ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ కోసం వీధుల్లో బరితెగించి నానా వికృత విన్యాసాలు చేస్తున్నాయి. అందువల్ల ప్రజా జీవితంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ప్రజాస్వామిక శక్తులు వాస్తవాలు తెలుసుకొని ఆదివాసీ ప్రాంతాల్లోని అణచివేతను ఖండించాలి. వాళ్ల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలి.
పాణి
విరసం కార్యదర్శి
23. 9.2019
Keywords : aob, maoists, ys jagan, andhrapradesh, police, fake encounters
(2024-04-24 17:44:45)
No. of visitors : 1309
Suggested Posts
| లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల |
| తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో |
| గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట !
గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. |
| నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే |
| విశాఖ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై |
| డేటా చౌర్యంలో దోషులెవరు ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్ (మార్చ్ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది. |
| రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం |
| జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది |
| రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ
కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది. |
| Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల పోరాటం
న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు |