దేశానికి రానున్నవి చీకటిరోజులు
(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు మార్కండేయ కట్జూ రాసిన ఈ వ్యాసం వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించారు. ఇది వీక్షణం అక్టోబర్ సంచికలో ప్రచురించబడినది)
భారతదేశంలో జరుగుతున్న సంగతులు నాకు నాజీల కాలంలో జర్మనీలో జరిగిన సంగతులను గుర్తుకు తెస్తున్నాయి.
జనవరి 1933లో హిట్లర్ అధికారానికి వచ్చిన తర్వాత యావత్తు జర్మనీ ఉన్మాదంలో పడిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ జనం ʹహెయిల్ హిట్లర్ʹ అనీ ʹసీగ్ హెయిల్ʹ అనీ ʹయుడెన్ వెరెక్కెʹ అనీ అరవడం, మత్తెక్కిన మరబొమ్మల్లాగ ఆ పిచ్చివాణ్ణి ప్రశంసించడం చేశారు.
మీకు కావాలంటే ఆ దృశ్యాలన్నీ యూట్యూబ్ మీద చూడవచ్చు.
జర్మన్లు ఎంత ఉన్నతమైన సంస్కృతీపరులంటే వారు మాక్స్ ప్లాంక్, ఐన్ స్టీన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలను, గూథె, షిల్లర్ వంటి మహా రచయితలను, హీనె వంటి మహా కవులను, మోజార్ట్, బాక్, బీథోవెన్ వంటి మహా సంగీత విద్వాంసులను,మార్టిన్ లూథర్ వంటి గొప్ప సంస్కర్తలను, కాంట్, నీషే, హెగెల్, మార్క్స్ వంటి గొప్ప తత్వవేత్తలను, లీబ్నిట్జ్, గాస్, రీమన్ వంటి గొప్ప గణితశాస్త్రజ్ఞులను, ఫ్రెడరిక్ ది గ్రేట్, బిస్మార్క్ వంటి గొప్ప రాజనీతిజ్ఞులను కన్న నేల అది. నేను కలిసిన ప్రతి ఒక్క జర్మన్ కూడ ఎంతో ఉత్తములు.
అయినప్పటికీ, రంగస్థలం మీదికి హిట్లర్ వచ్చాక, జర్మన్లే ఉత్తమ పాలక జాతి అని, వారి సమస్యలన్నిటికీ బాధ్యులు యూదులే అని ప్రకటించాక, జర్మన్లు ఆ పిచ్చిప్రేలాపనలను నమ్మడం మొదలుపెట్టారు. యూదుల మీద జరిగిన అత్యాచారాలకు, చివరికి జరిగిన మహామారణకాండకు వారు ఎదురుచెప్పలేదు. బహుశా దాన్ని సమర్థించి ఉంటారు కూడ.
అలా ఎలా జరిగింది? కచ్చితంగా జర్మన్ ప్రజలందరూ మూర్ఖులేమీ కాదు. అంతరాంతరాల్లో దుర్మార్గులేమీ కాదు. అన్ని దేశాల, అన్ని మతాల, అన్ని నరజాతుల, వగైరా అన్ని సమూహాల ప్రజల్లో 99 శాతం మంచివాళ్లేనని నా ప్రగాఢ నమ్మకం. మరి అరవై లక్షల మంది యూదులను గ్యాస్ చాంబర్లలోకి పంపి మూకుమ్మడిగా హత్య చేయడానికి జర్మన్లకు చేతులెలా వచ్చాయి?
నా ఉద్దేశంలో దానికి కారణమేమంటే, మహా శక్తిమంతమైన ఆధునిక ప్రచారసరళి అత్యంత సంస్కృతీపరుల, ఆలోచనాపరుల మెదళ్లలో కూడ విషం నింపగలదు. ఎక్కువమంది జర్మన్ల విషయంలో జరిగిందదే. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జర్మన్లలో నిండిన నిరాశా నిస్పృహలు, 1929 మహా సంక్షోభం తర్వాత పెద్ద ఎత్తున వ్యాపించిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం హిట్లర్ వంటి దుర్మార్గుడి విషప్రచారానికి సులభంగా దొరికిన ఆయుధాలు. ఆ విషప్రచారాన్ని జర్మన్లు మొత్తానికి మొత్తంగా అక్షరం వదలకుండా మింగి తమ మెదళ్లలో నింపుకున్నారు.
ఇవాళ అత్యధిక భారతీయుల విషయంలో అదే జరుగుతున్నది. అభివృద్ధి నిరోధక, హిందూ నయా ఫాసిస్టు పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి భారతీయ మైనారిటీలకు (ప్రత్యేకంగా ముస్లింలకు) వ్యతిరేకంగా భారీ మతోన్మాద ప్రచారానికి తెరలేపింది. ఆవులను చంపుతున్నారనీ, హిందూ బాలికలకు వల వేస్తున్నారనీ, వగైరా విద్వేషం నిండిన ఉపన్యాసాలతో చాలమంది హిందువుల మనసులను విషపూరితం చేశారు. రామాలయం నిర్మించాలనే ప్రకటనలూ, ముస్లింలను కొట్టి చంపడమూ గత కొద్ది సంవత్సరాలలో సర్వసాధారణమైపోయాయి. పాకిస్తాన్ లోని బాలాకోట్ మీద వైమానిక దాడి, సానుకూలమైన భారత ప్రచార సాధనాల ద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం కూడ ఈ దండయాత్రలో భాగమే. ఈ ప్రయత్నమంతా ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కనీవినీ ఎరగని ఘన విజయం చేకూర్చడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధించింది. భారతదేశంలోని ఏ ఒక్క నిజమైన సమస్యనూ పరిష్కరించలేని గారడీచర్యగా అధికరణం 370 రద్దు, దుష్ట పాకిస్తాన్ మీద సాధించిన మహా విజయంగా, ఉత్సవ సందర్భంగా చాల మంది హిందువులను మరింత ఉన్మాదులుగా మార్చింది. అమెరికాలోని హ్యూస్టన్ లో హౌడీ మోడీ ప్రదర్శన దీనికి ఒక సాక్ష్యం.
కనీ వినీ ఎరగని స్థాయి నిరుద్యోగం (స్వయంగా భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సాంపిల్ సర్వే వెల్లడించింది), దారుణమైన శిశు పోషకాహార లోపం (దేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపం బారిన పడి ఉన్నారు), అతి పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు (మూడు లక్షలకు పైగా), అశేష ప్రజానీకానికి దాదాపుగా అందని సరైన ఆరోగ్య సౌకర్యాలు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు, ధనికులకూ పేదలకూ మధ్య విపరీతంగా పెరిగిపోతున్న అంతరం (దేశంలోని 135 కోట్ల జనాభాలో సగం మంది దగ్గర ఉన్న సంపద కన్న ఎక్కువ సంపద ఏడుగురు భారతీయుల దగ్గరే ఉంది) వంటి భారతదేశంలోని నిజమైన సమస్యలలో ఏ ఒక్కటీ ఇటీవలి లోకసభ ఎన్నికలలో చర్చకే రాలేదు.
లౌకిక వాదమనేది ఉత్తర అమెరికా, యూరప్ ల వంటి పారిశ్రామిక సమాజాల లక్షణం. అది ఆసియా దేశాలలో అత్యధికంగా ఉన్న భూస్వామ్య, అర్ధభూస్వామ్య సమాజాల లక్షణం కాదు. రాజ్యాంగంలో ఆ మాట ప్రస్తావించినంత మాత్రాన దేశం లౌకిక దేశం అయిపోదు. భారతదేశం ఇంకా అర్ధభూస్వామ్యమేననేది ఈ సమాజంలో విస్తృతంగా ఉన్న కులతత్వం, మతతత్వం రుజువు చేస్తున్నాయి. భారతీయులలో అత్యధికులు లోలోతులనుంచి మత విశ్వాసాలు కలవాళ్లు. భారతీయులలో దాదాపు 80 శాతం హిందువులు గనుక వారు చాల సులభంగా మతోన్మాద ప్రచారానికి గురికాగలరు.
భారతదేశంలో హిందువులలోనూ ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లేనని నా అభిప్రాయం. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేను చూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లిం లేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు సంతోషిస్తున్నారేమో కూడ. ఒక తీవ్రవాది తగ్గాడని అనుకుంటున్నారేమో!
మైనారిటీల పట్ల, ప్రత్యేకించి ముస్లింలపట్ల విద్వేషం రూపంలో మతోన్మాదం చాలమంది హిందువులలో పైకి కనబడకుండా ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఎక్కడో ఒకచోట నిప్పురవ్వ పడితే పేలిపోయే మందుపాతర లాగ అది వేచి చూస్తూ ఉండింది. 2014 నుంచి 2019 వరకూ ఆ మతోన్మాద మంటలను భారతీయ జనతా పార్టీ ఎగసన దోస్తూ వచ్చింది. ఈ పార్టీ మీద ఆధిపత్యం వహిస్తున్నది భయంకరమైన ముస్లిం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక మతోన్మాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.
ఇప్పుడిక భారతీయ జనతా పార్టీ, దాని నాయకుడు మోడీ అసాధారణ విజయం సాధించారు గనుక, ప్రజల వైపు నుంచి తమ సమస్యలు పరిష్కరించే పాలన ఇమ్మని ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఉద్యోగాలు కల్పించమనీ, రైతుల నిస్సహాయ స్థితిని మెరుగుపరచమనీ, శిశు పౌష్టికాహార లోపాన్ని తగ్గించమనీ, మంచి ఆరోగ్యసేవలు అందించమనీ, నాణ్యమైన విద్య అందించమనీ, వగైరా ఆకాంక్షలు పెరుగుతాయి. కాని ఈ పాలకులకు ఆ పరిష్కారాలు ఎలా సాధించాలో తెలియదు. అంతే కాదు, పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, దేశంలో ప్రస్తుతం ఆర్థిక స్థితి మరింతగా దిగజారింది. జాతీయాదాయ పెరుగుదల రేటు ఒక్కసారిగా 5 శాతానికి పడిపోయింది. వాహనాల తయారీ రంగంతో సహా పారిశ్రామిక ఉత్పత్తులలో, రియల్ ఎస్టేట్ లో, విద్యుచ్చక్తి రంగంలో, అటువంటి మరెన్నో రంగాలలో పతనం కనబడుతున్నది. మున్నన్నడూ లేనంత నిరుద్యోగం తలెత్తడం మాత్రమే కాదు, అది ఇంకా పెరుగుతున్నది.
ప్రస్తుత పాలనా పద్ధతుల లోపల పరిష్కరించడం అసాధ్యమైన ఈ నిజమైన సమస్యల నుంచి, అవి ఇంకా దిగజారుతుండడం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఏదో ఒక బలిపశువును కనిపెట్టాలి. సరిగ్గా హిట్లర్ అట్లాగే యూదులు అనే బలిపశువును కనిపెట్టినట్టుగా. భారతదేశంలో అటువంటి బలిపశువు ముస్లింలు. అందువల్ల ముస్లింల మీద అత్యాచారాలు ఇంకా పెరుగుతాయనీ, కొద్దిగా తక్కువగా క్రైస్తవుల మీద కూడ పెరుగుతాయనీ నాకు భయం కలుగుతున్నది.
సరిగ్గా నాజీ పాలనాకాలంలో జర్మనీలో విజ్ఞానశాస్త్రాన్ని ఎట్లా జాత్యహంకార పూరితమైన అర్థరహిత ప్రేలాపనగా మార్చారో, భారతదేశంలో కూడ 2014 తర్వాత విజ్ఞానశాస్త్రాన్ని అట్లాగే మార్చారు. నాజీ జర్మనీలో చరిత్రను ఎట్లా వక్రీకరించారో, 2014 తర్వాత భారతదేశంలో అట్లాగే వక్రీకరిస్తున్నారు. సరిగ్గా జర్మన్ ప్రచార సాధనాల మీద గోబెల్స్ ఆధిపత్యం చలాయించినట్టుగానే, భారత ప్రచార సాధనాలు కూడ వంగిపోయి, లొంగిపోయి, ʹసర్వంసహా చక్రవర్తిʹకి ప్రణామాలు పలుకుతున్నాయి.
దేశానికిక రానున్నవి చీకటిరోజులే.
- మార్కండేయ కట్జూ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు
Keywords : markendeya katju, hindutva, narendra modi, bjp, rss,
(2024-04-24 17:39:28)
No. of visitors : 1375
Suggested Posts
| ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్కను హత్య చేస్తారట ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు. |
| ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ? ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు. |
| మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలుప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది. |
| ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ? మరణవార్త చెప్పిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్ ఫోన్ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ... |
| సాదువుల హత్య కేసు:101 మంది అరెస్ట్... ఒక్క ముస్లిం కూడా లేడు సాదువుల హత్య కేసులో ఇప్పటివరకు 101 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. వారంతా హిందువులేనని, అందులో ముస్లింలు ఒక్కరు కూడా లేరని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం తెలిపారు. |
| తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు.... |
| 51 University VCs Attend RSS Workshop on Making Education More IndianOver 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital.... |
| వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరిజిల్లాలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఖాకీ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో లాఠీలు పట్టుకున్న ఆరెస్సెస్ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి చెక్ చేసిన ఘటనపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. |
| సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ !ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ |
| జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు. దక్షిణ 24 పరగణా లోని కానింగ్ నుండి హుబ్లీకి రేల్లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న రైలులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు. |