జేఎన్యూ తర్వాత...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీపై దాడి తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీ వంతు వచ్చిందా ? నిన్న సాయంత్రం విశ్వభారతి యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడి లో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ యూనివర్సిటీకి చెందిన మాజీ విద్యార్థి, ప్రస్తుతం బీజేపీ నాయకుడైన అచింటా బాగ్డి అద్వర్యంలో ఓ గుంపు తమపై దాడి చేశారని గాయపడిన విద్యార్థులు స్వప్నానిల్ ముఖర్జీ (ఎకనామిక్స్ విభాగం), దేబబ్రాతా నాథ్ (సంతాలి భాషా విభాగం) తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చారు.
గాయపడిన విద్యార్థులు దాడి చేసిన వారిని గుర్తించారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్ బిద్యూత్ చక్రవర్తికి బాగా కావాల్సిన వారని విద్యార్థుల ఆరోపణ.
గాయపడిన విద్యార్థులలో ఒకరైన స్వప్నానిల్ ʹగ్రౌండ్ జీరో డాట్ ఇన్ʹ అనే వెబ్ సైట్ ప్రతినిధితో మాట్లాడుతూ ʹʹవిశ్వ భారతి మాజీ విద్యార్థి అచింటా బాగ్డి నేతృత్వంలో ఆ మూక మాపై దాడి చేసింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ తో ఉన్న బాగ్డి బిజెపికి లో చేరాడు. అతను, వీసీ బిద్యూత్ చక్రవర్తికి చాలా దగ్గరి వాడు.ʹʹ
ʹʹఅచింటాతో పాటు మరో ఇద్దరు బిజెపి గూండాలు, షబ్బీర్ అలీ బాస్క్, సులాబ్ కర్మకర్ మరి కొందరి తో కలిసి విశ్వవిద్యాలయం లోపల వికెట్లు మరియు రాడ్లతో భీభత్సం సృష్టించారు. మమ్ములను దుర్మార్గంగా కొట్టారు. వీసీ కారును అనుసరించి ఈ ముఠా మోటారు సైకిళ్లపై విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించింది. విశ్వవిద్యాలయ భద్రతా అధికారి సుప్రియో గంగూలీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాని అతను ఎటువంటి చర్య తీసుకోలేదు. మాపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని బెదిరించాడుʹʹ అని చెప్పాడు.
రాడ్లు, కర్రలు పట్టుకున్న సాయుధ మూక విశ్వవిద్యాలయ ఆసుపత్రిని కూడా చుట్టుముట్టారు. ఆసుపత్రిలో గాయపడిన విద్యార్థులను కలవడానికి వెళ్ళిన ఇద్దరు అధ్యాపకులు సుదీప్తా భట్టాచార్య మరియు సుదేవ్ ప్రతిం బసు లను గేలి చేస్తూ మాట్లాడారు. విశ్వ భారతి ఫ్యాకల్టీ అసోసియేషన్ కార్యాలయానికి ఆ మూక తాళం వేసింది.
అసలు ఇలా విద్యార్థులపై గూండాలు దాడి చేయడానికి కారణమేంటి ?
సీఏఏకు వ్యతిరేకంగా జెఎన్యు విద్యార్థులపై ఎబివిపి చేసిన దాడికి వ్యతిరేకంగా, జనవరి 8న జరిగిన సాధారణ సమ్మెకు మద్దతుగా విశ్వవిద్యాలయ విద్యార్థులను విజయవంతంగా సమీకరించిన విద్యార్థులపై వైస్ ఛాన్స్లర్ , అతని వ్యక్తులు చేసిన ప్రతీకారం అని విద్యార్థులు పేర్కొన్నారు.
జనవరి 8న సీఏఏకు అనుకూలంగా జరగాల్సిన సమావేశం విద్యార్థుల నిరసనల వల్ల ఆగిపోవడం వీసీకి ఆగ్రహం తెప్పించింది. సిఎఎకు అనుకూలంగా మాట్లాడటానికి ఆహ్వానించబడిన వక్తలలో బిజెపి రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తా ఉన్నారు. దాస్గుప్తాను విద్యార్థులు చాలా గంటల పాటు చుట్టు ముట్టి తమ నిరసన తెలిపారు. ఈ దాడికి అది ఒక కారణమని విద్యార్థుల ఆరోపణ.
విశ్వవిద్యాలయం లోపల సీనియర్ బాయ్స్ హాస్టల్పై దాడి చేసిన అచింటా బాగ్డి మరియు అతని ముఠా, నిరసనలలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వెతికారు. వారు జనవరి 8న విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నారా లేదా అని అడిగి విద్యార్థులను బెదిరింపులకు గురిచేశారు.
దాడికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు గ్రౌండ్జీరో ప్రతినిధితో మాట్లాడారు. ఈ దాడి ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని వారు చెప్పారు. నేటి దాడికి వీసీ నే బాధ్యులని వారు ఆరోపించారు. వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దాడి ఘటనకు వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం విద్యార్థులు ఉదయం విశ్వవిద్యాలయ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన సభ జరిపారు.
Keywords : JNU, Vishwa Bharati University, Students, Attack, BJP, West Bengal
(2024-04-24 17:17:40)
No. of visitors : 889
Suggested Posts
0 results