కరోనా ముసుగులో బీజేపీ వార్షికోత్సవాలా? సిగ్గు సిగ్గు - న్యూడెమోక్రసీ
కరోనా మహమ్మారి మన దేశాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్కు చికిత్స ఎలా చేయాలి.. వ్యాక్సిన్ ఎలా కనుగొనాలనే పరిశోధనలు చేస్తుంటే.. మన దేశ పాలకులు వీధుల్లో చప్పట్లు కొట్టండి.. రాత్రికి లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించండనే టైం పాస్ మాటలు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీపాలు వెలిగిస్తే ఏమవుతుందో ఆ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాట్సప్ బ్యాచ్ చెప్పడం మానేసి.. గ్రహాలు, రాశులంటూ శుష్కవాదాన్ని వినిపిస్తోంది. ఈ నెల 6న భారతీయ జనతా పార్టీ ఏర్పడి 40 ఏండ్లు పూర్తవుతోంది. దీనికి సన్నాహకంగా ప్రజలందరి చేత ఏప్రిల్ 5న దీపాలు వెలిగించే కుట్ర కార్యక్రమానికి ప్రధాని మోడీ తెరతీశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులకు సరైన రక్షణ పరికరాలు అందించకుండా ఇలాంటి పనికిమాలిన టాస్కులు ప్రజలకు ఇస్తోంది. దీనిని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన యధాతథంగా..
----------------------------------------------------------------------------------------------
ప్రియమైన ఏ.పి రాష్ట్ర ప్రజలారా!
కరోనా బాధితులకు చేస్తున్న వైద్య సేవకు కృతజ్ఞత పేరుతో గత మార్చి 22న ʹజనతా కర్ఫ్యూʹ రోజు ʹచప్పట్లుʹ కొట్టండని ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు. రాత్రింబవళ్ళు వైద్య సేవలు చేస్తున్న వైద్యులు చప్పట్లు కంటే వైద్య పరికరాల సరఫరాను ప్రధానంగా కోరుకుంటున్నారు. వాటిని సరఫరా చేయకపోవడం పట్ల డాక్టర్లలో వ్యక్తమయ్యే అసంతృప్తి నివారణకు ʹచప్పట్లʹను బహుకరించారు. అది నిన్నటి మాట!
కరోనా బాధితుల పక్షాన దేశ ప్రజలు ఒకే త్రాటిమీద నిలబడ్డట్లు నిరూపించాలనే పేరిట రేపు 5-4-2020న రాత్రి 9 గం॥కు కరెంట్ లైట్లు ఆర్పి, క్రొవ్వోత్తులు వెలిగించాలాని మోడీ కొత్తపిలుపు ఇచ్చాడు. ఇది రేపటి మాట!
రేపు నాల్గవ నెల 5వ తేదీ! ఈ 4+5 కలిపితే 9 అంకె!, రేపు రాత్రి 9 గంటలు! అది కూడా తొమ్మిదే! పెద్దలైట్లు ఆర్పి, చిన్నలైట్లు వెలిగించే సమయం 9 నిమిషాలు! అది కూడా తొమ్మిదే! ఈ పిలుపు ఇచ్చేందుకు నిన్న 3వ తేదీ మోడీ ప్రసంగ సమయం కూడా 9 నిమిషాలే! అది కూడా తొమ్మిదే! బిజెపికి కలిసివచ్చే అంకే తొమ్మిదట! బిజెపి అంకె నమ్మకాన్ని దేశ ప్రజల ద్వారా అమలు చేసుకోవాలనుకోవడం రాజకీయమే. శాస్త్ర,సాంకేతికరంగాల యుగంలో మూఢ నమ్మకాలను వ్యాప్తిచేసే రాజకీయమిది. ఇదొక్కటే కాదు సుమా!
గాంధీని హత్యచేసిన రాజకీయ అపరాధం చారిత్రక అవచారం జనసంఘ్ కు శాపంగా వెంటాడింది అందుకే పాత జనసంఘ్ పార్టీ పేరును ʹ భారతీయ జనతా పార్టీʹ (బిజెపి)గా మార్చుకున్నారు. గాంధీని పొట్టన పెట్టుకున్న పాపాన్ని కడుక్కోవడానికి ʹగాంధియన్ సాషలిజంʹ లక్ష్యంగా ఈ కొత్త పార్టీ ప్రకటించుకున్నది. ఈ కొత్త ముసుగులో ఆర్.ఎస్.ఎస్ అనుబంధ బిజెపి పార్టీ 1980 ఏప్రిల్ 5,6 లో బొంబాయిలో (నేటి ముంభై) స్థాపించబడింది. దాని స్థాపనకు రేపు 5వ తేదీకి 40 ఏళ్ళు! ఈ 40వ వార్షికోత్సవ సభను ఘనంగా జరుపుకోవడానికి ʹ కరోనా ʹ అడ్డుపడింది. అదే కరోనా ముసుగులో తన రాజకీయ సభ నిర్వహణకు ఆరెస్సెస్ పూనుకున్నది. కరోనా బాధితులకు సానుభూతి పేరుతో దేశ ప్రధానితో తన 40వ వార్షికోత్సవ సభను జరిపించే కపట వ్యూహమిది.
ఆరెస్సెస్చే హత్యచేయబడ్డ గాంధేయవాద సంస్థలూ, శక్తులతో సహా ఇంకా తమ మనువాద లక్ష్యాలచేత బలికాబడే అన్నిరకాల సామాజిక, రాజకీయ బాధితవర్గాల ప్రజలతో సహా దేశ ప్రజలందరిలో ʹకరోనాʹ ముసుగులో తమ బిజెపి స్థాపన దినోత్సవంలో భాగాస్వామును చేసే కపట రాజకీయ వ్యూహమిది. దీనివరకే మోడీ-షా ప్రభుత్వ వ్యూహం పరిమితం కాదు. ఇంకా వుంది.కేరళలో మెదటి కరోనా కేసు వెలుగు చూసాక 50 రోజుల వరకూ విదేశీ ప్రయాణీకులను మోడీ-షా ప్రభుత్వం నియంత్రించలేదు. పైగా అదే కాలంలో అహమ్మదాబాద్లో లక్షమందితో ట్రంప్కు స్వాగత సభ జరిపించింది. చివరకు జనతా కర్ఫ్యూ తర్వాత ఒక రోజు (మార్చి 23) సడలించి, ఆ మరునాడు లాక్ డౌన్ ప్రకటించింది. ఆ సడలింపు రోజైన మార్చి 23నే మధ్యప్రదేశ్ చౌహన్ ప్రభుత్వ ప్రమాణస్వీకార సభ ఘనంగా జరగడం గమనార్హం! దేశంలోకి కరోనా వ్యాప్తికి మోడీ-షా ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాల్సి వుంది. ఈ నేరాన్ని కప్పిపెట్టుకునేందుకు దేశ ప్రజల దృష్టిని దారి మళ్ళించాలి. అందుకొక ముసుగుగా ఈ లైట్లు ఆర్పి, వెలిగించే కార్యక్రమం! దీనితో వారి వ్యూహం ముగియలేదు. ఇంకా వుంది.
ధిల్లీలో నిజాముద్దీన్ సంఘటనకు ప్రధాన మరియు ప్రాధమిక బాధ్యత మోడీ-షా ప్రభుత్వానిదే! తబ్లిక్ సభలు మార్చి 13-15 మధ్య జరిగాయి. మార్చి 13వ తేదీన కూడా మన దేశానికి కరోనా ప్రమాదం పొంచిలేదని ప్రధాని మోడీ ప్రకటించాడు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం రాదని కూడా చెప్పాడు. పై సభకు వచ్చిన విదేశీయును అనుమంతించింది మోడీ ప్రభుత్వమే. వారికి ఎయిర్పోర్టుల్లో కనీసం పరీక్షలు కూడా నిర్వహించకుండా వదిలేసింది కూడా మోడీ ప్రభుత్వమే! సభ కోసం నిర్వాహకులకు అనుమతిని ధిల్లీ పోలీసే ఇచ్చింది. అది మోడీ-షా ప్రభుత్వాధీనంలోనే వుంది. సభకు ఇచ్చిన అనుమతుల్ని అత్యవసర పరిస్థితుల్లో రద్దుచేసే అధికారం వుండి కూడా వదిలేసింది మోడీ ప్రభుత్వమే! తన నేరాన్ని కప్పిపెట్టుకునేందుకు దేశ ప్రజల మధ్య మత విద్వేషం రెచ్చగొడుతున్నది. తాను చేసిన పాపాన్ని ఒక మత పెద్దకు అంటగట్టి, ఆ పేరుతో ఆ మతాన్ని నేరస్థురాలుగా చిత్రించే పనిలో పడింది. మరో వ్యూహం కూడా వుంది.
అనేక ప్రపంచ దేశాల ప్రభుత్వాలతో పోల్చితే సాపేక్షికంగా అతి తక్కువ ఉద్దీపన పధకాన్ని ప్రకటించింది. ఈ అరకొర సాయాలు కూడా సక్రమంగా అమలుకావడం లేదు. పైగా వలస కార్మికుల సమస్య ప్రభుత్వ వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ఈ వైఫల్యాన్నింటి నుండి దేశ ప్రజలని దారిమళ్ళించే వ్యూహం కూడా వుంది. దీనికే పరిమితం కాదు. ఇంకా వుంది. మున్ముందు ఆర్ధిక సంక్షోభ దుష్పలితాలు బ్రద్దలయ్యే ప్రమాదకర పరిస్థితి తలెత్తుతోంది. ఫలితంగా మున్ముందు దేశ ప్రజల నుండి ఆందోళనలు, తిరుగుబాట్లు తలెత్తే అవకాశాున్నాయి. మోడీ-షా ప్రభుత్వం ఒక అభద్రతను ఎదుర్కొంటున్నది. అందుకే తమ పైకి ప్రజల అసంతృప్తి, ఆగ్రహావేశాలను మళ్ళనివ్వకుండా ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. మోడీ-షా ప్రభుత్వం ద్వారా ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలను పొందుతున్న బడా కార్పొరేట్ వ్యవస్థ తన చెప్పుచేతల్లోని కార్పొరేట్ మీడియా ద్వారా మత విద్వేషాన్ని అదేపనిగా రెచ్చగొడుతోంది. ఒకవైపు ప్రజలను విభజిస్తున్నది. అదే విద్వేష విభజన రాజకీయ వ్యూహంతో చేపడుతున్న 40వ బిజెపి వార్షికోత్సవ సభలో దేశ ప్రజందరినీ తెలివిగా భాగాస్వామ్యం చేసే వ్యూహం పన్నింది.
ఈ నేపథ్యంలో రేపటి మోడీ-షా ప్రభుత్వ పిలుపును వ్యతిరేకించాల్సిన బాధ్యత దేశ ప్రజలమీద వుందని మా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ భావిస్తున్నది. అందుకే దీన్ని వ్యతిరేకించాని రాష్ట్ర ప్రజకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా వివిధ విప్లవ, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, హక్కుల సంస్థలకూ, శక్తులకూ కూడా సమైఖ్యంగా నిరసిద్దామని విజ్ఞప్తి చేస్తున్నది. పై మోడీ-షా ప్రభుత్వ పిలుపు అమలుకు బదులుగా - గతంలో ప్రకటించిన నాసిరకం ప్యాకేజీని సవరించి, మెరుగైన ప్యాకేజీని ప్రకటించాలని, రైతుకూలీలకూ మరియు భవన నిర్మాణ, ఆటో, మోటారు, హమాలీ, జట్టు, ముఠా, గ్యాస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ తదితర అసంఘటితరంగ కార్మికులకూ ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించానీ, ముఖ్యంగా వలస కార్మికులకు కూడా ఓ ప్యాకేజీని ప్రకటించాలనీ డిమాండ్ చేద్దాం. వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్లకు తగిన వైద్య సామాగ్రిని అందుబాటులోకి తేవాలాని, వారికి, పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజిని ఇవ్వాని డిమాండ్ చేద్దాం. కార్పోరేట్ హాస్పిటళ్ళ నన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కరోనా భాధితుల కోసం ఐసోలేషన్ కల్పించి తగిన వైద్యం అందించాలని డిమాండ్ చేద్దాం. 40వ బిజెపి వార్షికోత్సవ పిలుపు అమలుకై ఐక్యతను ప్రదర్శించే లక్ష్యం కోసం ఐక్యతను చాటుటకు బదలు కరోనా బాధిత ప్రజల కోసం పైన పేర్కొన్న న్యాయమైన మానవీయ డిమాండ్ల కోసం రేపటి రోజు తమ ఐక్యతను చాటి చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్- లెనినిస్టు) న్యూడెమోక్రసీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
రామనరసయ్య భవన్, క్రీస్తు రాజపురం, విజయవాడ.
అధికార ప్రతినిధి : వై. సాంబశివరావు సెల్ : 9440019965
స్థలం : విజయవాడ,
తేది : 04-04-2020.
Keywords : బీజేపీ, దీపాలు, మోడీ,న్యూ డెమోక్రసీ, పత్రిక ప్రకటన, Corona, India, Modi, Amith Shah, Diya Jalaye, New Democracy, Doctors
(2024-04-24 16:54:41)
No. of visitors : 1113
Suggested Posts
0 results