దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపు
(ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా బుల్ గడి గ్రామంలో 19 ఏళ్ళ అమ్మాయిపై నలుగురు ఠాకూర్లు చేసిన అత్యాచారం, హత్య ఘటనపై కుల నిర్మూలనా పోరాట సమితి,ఆంధ్రప్రదేశ్ ప్రచురించిన కరపత్రం)
దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం.
కార్పోరేట్ రాజకీయ గారడీలను ఎండగడదాం
ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా బుల్ గడి గ్రామంలో 20 బ్రాహ్మణ,వంద భూస్వామ్య ఠాకూర్ కుటుంబాలు,కేవలం నాలుగు దళిత కుటుంబాలు వ్యవసాయ రైతుకూలీలుగా జీవిస్తున్నారు.19 ఏళ్ల దళిత యువతి మనీషాను ఠాకూర్ కులానికి చెందిన నలుగురు మృగాళ్ళు 14.9.2020న సామూహిక అత్యాచారం చేశారు.నాలుకకోసి,మెడవెముక,వెన్నెముక విరిచి,మర్మాంగాన్ని చిద్రం చేసి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేర్చబడిన బాధితురాలికి అవసరం అనుకున్న వైద్యపరీక్షలు డాక్టర్లు చెయ్యలేదు.నాలుగు రోజుల తర్వాత ఐ.సి.యు లోకి చేర్చారు.పదిరోజులు మృత్యువుతో పోరాడి మనీషా శవమయ్యింది. ఇంతవరకూ జరిగిన పరిణామాలు ఈ దేశంలోని దళితులు నిత్యం అనుభవిస్తున్నవే.అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు బాధిత కుటుంబాన్ని నిర్బంధించి మధ్యరాత్రి 2 గంటల సమయంలో మనీషా శవాన్ని తగలబెట్టి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా బూడిద చేశారు.అత్యాచారం జరిగిన 11 రోజుల తర్వాత స్పెర్మ్ ఆనవాళ్లు పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు మనీషా శవాన్ని బూడిద చేసిన మరుసటి రోజే అత్యాచారం జరగలేదని నివేదిక ఇచ్చారు.వెంటనే పోలీసు ఉన్నతాధికారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి"కొందరు రాజకీయలబ్ధికోసం సామూహిక అత్యాచారం జరిగిందని, నాలుకకోశారని, వెన్నెముక విరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నార"ని అన్నారు.డాక్టర్ల నివేదికలు, పోలీసుల కట్టుకథలు,అధికారపక్షం పిట్టకథలు, ప్రభుత్వానికి హైకోర్టు,ఎన్.హెచ్.ఆర్.సి,జాతీయ మహిళా కమిషన్ నోటీసులు,ఎస్.ఐ.టి ఏర్పాటు లాంటివి షరామామూలే.ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం,ఇల్లు లాంటి ప్రకటనలు ఎప్పుడూ వింటున్నవే.కానీ జిల్లాకలెక్టర్ సైతం నిందితులకు అనుకూలంగా బాధిత కుటుంబాన్ని బహిరంగంగా బెదిరించి భయాందోళనకు గురిచేయడం యోగిపాలనలోనే చూస్తున్నాం."ఓట్లుమావి,సీట్లుమీవా? దళిత బహుజనులకే రాజ్యాధికారం"అనే నినాదాలతో దేశరాజకీయాల్లో సంచలనం సృష్టించి దళితుల ప్రతినిధిగా బహుజన సమాజ్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో నేడు దళితులపై అమానుషమైన హింస జరగడం అత్యంత విషాదం.దేశవ్యాప్తంగా దళిత బహుజన సంఘాల స్పందన నామమాత్రంగానే ఉంది.వివిధ రాజకీయ పార్టీలు దళితసంఘాలనాయకుల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.కొందర్ని హత్యలు చేసి,కొందరు హక్కుల సంఘాల నాయకుల్ని,ప్రజాస్వామికవాదుల్ని జైళ్లలో నిర్బంధించారు.ఈ సంక్షోభకాలంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్,వామపక్షాలు బాధితులకు అండగా రోడ్డెక్కడం,కొన్ని టీ.వీ ఛానళ్లు సీరియస్ గా స్పందించి గ్రౌండ్ రిపోర్ట్ అందించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఆ నలుగురిని కాపాడడానికేనా
కేవలం నలుగురు అత్యాచారం నిందితులను కాపాడటానికి పోలీసులు, డాక్టర్లు,ఫోరెన్సిక్ నిపుణులు,కలెక్టర్ అంత దిగజారి ప్రవర్తించారా?ముఖ్యమంత్రి,ఢిల్లీ పెద్దల ఆదేశాలు లేకుండానే పోలీసులు అంతటి హంగామా సృష్టించారా?కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సహించలేక పోవడానికి కారణం ఏమైవుంటుంది? ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అడ్డగించారు.చొక్కా పట్టుకుని లాగారు.కిందపడేసి తొక్కారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై లాఠీఛార్జ్ చేశారు.మహిళా నాయకుల జాకెట్లు పట్టుకొని లాగారు.ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలి జాకెట్ చించారు.ఆ దృశ్యాలను టీ.వీల ద్వారా ప్రజలంతా చూశారు.
బుల్ గడి ఊరుచుట్టూ పోలీసులు బారికేడ్లు కట్టారు. మీడియాతో సహా ఎవ్వర్నీ బాధితుల్ని కలవనివ్వలేదు.ʹవాడʹఒంటరిగా బిక్కుబిక్కు మంటుంది.ʹఊరుʹరోజూ సమావేశాలు జరుగుతుంది. ఆ నలుగురూ నిరపరాధులని,చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని వెంటనే వారిని విడుదల చేయాలని ధర్నాలు చేస్తున్నారు.కేవలం నిందితులను కాపాడటం కోసమే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేస్తుందనుకుంటే పొరపాటు.లక్ష్మణ్ పూర్ భాతే నుండి కారంచేడు,చుండూరు,వేంపెంట నరమేధాలవరకు ఎంతమంది నేరస్తులకు కోర్టులో శిక్షలు పడ్డాయి.గుజరాత్ ముస్లింల ఊచకోతలో పాల్గొన్నవారు ఎంతమంది జైళ్లలో ఉన్నారు? సోహ్రబుద్దీన్ ను హత్య చేయించిన వారు ఎక్కడున్నారు?అంతెందుకు బాబ్రీ మసీద్ స్థానంలో రామమందిరం నిర్మిస్తామని రథయాత్ర పేరుతో దేశమంతా ప్రచారం చేసి "ఇంటికొక ఇటుకతో అయోధ్యరండి" అని పిలుపునిచ్చిన నాయకులకు, పలుగు,పారలు,త్రిశూలాలతో ఇస్లాం మతానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని,ప్రపంచమంతా చూస్తుండగా కూల్చిన కరసేవకులకు ఎంతమందికి శిక్షలు పడ్డాయి?ఈ విషయాలు పాలకులకు తెలియక ఆ నలుగురిని శిక్షనుండి తప్పించడం కోసమే ఇంత సీను క్రియేట్ చేయలేదు.యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బహిరంగంగా అమలుచేస్తున్న చట్ట ఉల్లంఘనలు వెనుక చాతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల పంచములుగా వెలివాడల్లో బతుకుతున్న అంటరాని ప్రజలను భయాందోళనలకు గురిచేసి,లోబర్చుకునే వ్యూహం ఉంది.వర్ణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యం ఉంది. అగ్రకుల భూస్వామ్య హంతక మూకలకు అండగా ఉంటామనే బరితెగింపు ఉంది.వారి రామరాజ్యంలో దళితుల స్థితి ఈ విధంగానే ఉండబోతుందని హెచ్చరిక ఉంది.అంతకంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్న రైతు ఉద్యమాన్ని దారి మళ్లించే ప్రయత్నముంది.
రైతు ఉద్యమం దారి మళ్లింపు
ఈ దేశంలోని 70 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చింది.అందుకు నిరసనగా అకాలీదళ్ ఎన్.డి.ఏ నుండి బయటకొచ్చింది.ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు.అకాళీదళ్ తో సహా దాదాపుగా అన్ని ప్రతిపక్షాలు రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.పంజాబ్, హర్యానా,రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు.దేశ రాజధానిలో ట్రాక్టర్లు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.ఇప్పటికే విద్యుత్, వాయు,రైలు,రోడ్డు రవాణా రంగాలను ఎల్.ఐ.సి, బి.ఎస్.ఎన్.ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిన మోడీ ప్రభుత్వం లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డుపై నిలబెట్టింది. విద్య,వైద్యరంగాలనుండి వైదొలగి పీడిత కులాల ప్రజల బతుకులను ఛిద్రం చేసింది.నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పేదలను చదువులకు దూరం చేస్తుంది.నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. మెజార్టీ ప్రజలు మోడీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో రైతుఉద్యమానికి విస్తృతంగా ప్రజల మద్దతు లభిస్తుంది.ఈ పరిస్థితుల్లో సంఘ్ అనుంగు పుత్రుడు యోగిఆదిత్యనాథ్ రాజ్యంలో దళిత యువతిపై అత్యంత క్రూరమైన అత్యాచారం జరిగింది.ఇదే అదనుగా యోగిప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బహిరంగ చట్ట ఉల్లంఘనలకు,అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది.ʹవాడʹ అణచివేసి ʹఊర్లʹకు అండగా నిలిచి,నిచ్చెనమెట్ల కులవ్యవస్థను పరిరక్షించే హిందూమతానికి నికార్సైన ప్రతినిధులమని లోకానికి చాటి చెప్పింది.దేశ ప్రజల దృష్టి రైతు ఉద్యమం నుండి హత్రాస్ వైపు మళ్లించడంలో విజయవంతమయ్యింది.
ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారం
సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా ఈ దేశంలో ఖనిజసంపద,సహజవనరులు దోపిడీకి గురవుతున్నాయి.ఆ కారణంగా ప్రజల జీవన స్థితిగతులు అధ్వానంగా మారాయి.ఈ నేపథ్యంలో ప్రజల బతుక్కి భద్రత,భరోసా ఇచ్చే వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచే స్థితి ఏ పార్టీకి లేదు.ప్రజలపై హింసను ప్రయోగించి,భయపెట్టి అధికారం దక్కించుకోవడం,ఒక విధానంగా భారత దేశ రాజకీయాల్లో అమలవుతుంది.ప్రపంచ దేశాలకు భిన్నంగా మనదేశంలో ఏర్పడిన వర్ణవ్యవస్థలో అలాంటి హింసా రాజకీయాలకు మెజారిటీ ప్రజల ఆమోదం లభిస్తుంది.ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన 90వ దశకం తొలినాళ్ళలో బాబ్రీ మసీదు విధ్వంసంతో ప్రారంభమైన ఈ విధానం నేడు తీవ్ర రూపం దాల్చింది.అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా దళితులపై దాడులు, అత్యాచారాలు,హత్యలు జరుగుతున్నాయి. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుండి గ్రామ స్థాయి చోటా నాయకుల దాకా కులవైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతి సంక్షేమ కార్యక్రమం కులం ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు పదే పదే ప్రకటిస్తూ నిచ్చెనమెట్ల కులవ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.పోలీస్ స్టేషన్లు,రెవెన్యూ ఆఫీసులు వై.ఎస్.ఆర్ సీపీ కార్యాలయాలుగా వర్ధిల్లుతున్నాయి.దళితులపై అగ్రకుల దాడుల కంటే రెవెన్యూ మోసాలు,పోలీసుల అకృత్యాలు ఎక్కువవుతున్నాయి.ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.దళిత ప్రభుత్వ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు.పోలీస్ స్టేషన్ లలో లాకప్ హత్యలతో పాటు దళిత యువకులకు గుండు చేయించడం,మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడంలాంటి సంఘటనలు జరిగాయి.దళిత మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదిమంది మృగాళ్లు వారంరోజుల పాటు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి వెళ్లారు.దళితుల్ని ఏంచేసినా పోలీసులు పట్టించుకోరనే భావన ప్రజల్లో స్థిరపడిందనడానికి సాక్ష్యంగా ఆ సంఘటనను చెప్పుకోవచ్చు.రాష్ట్రంలో దళితులపై దాడులు గణనీయంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సి.ఆర్.బి) వెల్లడించింది.దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల్లో 4.5 శాతం ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు ఆ సంస్థ నివేదిక తెలియజేస్తుంది.
గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించుకున్న బిజేపి,కేంద్రం ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.ఈ మధ్య కాలంలో హిందూ,క్రైస్తవ దేవాలయాలపై దాడులు,దేవతా విగ్రహాల విధ్వంసాలు జరిగాయి.ఈ దాడుల వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలున్నాయో తెలిసినప్పటికీ వై.ఎస్.ఆర్ సీపీ గానీ,టి.డి.పి గానీ బి.జే.పీ పై చిన్న కామెంట్ చేసే సాహసం చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో,కేంద్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ సీపీ,బీజేపీతో పాటు టి.డి.పి రాబోయే ఎన్నికల్లో ఓట్లు,సీట్ల కోసం కుల,మత ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే పని ఇప్పటి నుండే ప్రారంభించారు.కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో దళితులపై,ముస్లింలపై దాడులు జరిగే అవకాశాలున్నాయి.ఈ జరుగుతున్న సంఘటనలన్నీ పీడిత కులాల ప్రజలు ఐక్యంగా,అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.ప్రజల్ని విభజించి పాలించే పాలకవర్గాల వ్యూహానికి విరుగుడుగా కూడగట్టి పోరాడే ప్రతివ్యూహాన్ని అమలు చేయడం ద్వారా మాత్రమే దళితులపై దాడుల్ని ఆపగలుగుతాం.
కుల నిర్మూలనా పోరాట సమితి (KNPS)
ఆంధ్రప్రదేశ్
ప్రచురణకర్త : అధ్యక్షులు,ప్రధానకార్యదర్శులు
దుడ్డు ప్రభాకర్,9959567818
కె.కృష్ణ,9652064882...తేది
Keywords : hathras, uttarapradesh, thakurs, dalit girl, rape, murder
(2024-04-25 03:12:49)
No. of visitors : 786
Suggested Posts
| హత్రాస్ వెళ్లాలనుకోవడమే అతడి నేరంహత్రాస్ వెళ్లేందుకు యత్నించిన మళయాళీ పాత్రికేయుడు సిద్ధికీ కప్పన్తో పాటు మరో ముగ్గురిని సోమవారం యూపీ పోలీసులు అరెస్టు చేసి Unlawful Activities (Prevention) Act (యూఏపీఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. |
| హత్రాస్ సంఘటన : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమకుందన్నజిల్లా మెజిస్ట్రేట్
అత్యాచారం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై హత్రాస్ దారుణంపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిథల్ మరియు జస్టిస్ రాజన్ రాయ్ డివిజన్ బెంచ్ రెండు గంటల విచారణలో బాధితుడి కుటుంబం మరియు వివిధ ప్రభుత్వ అధికారులను వాదనల్ని విన్నది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
|
| పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు నిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు. |