తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నవంబర్ 24, కా. కిషన్జీ , కా. అజిత, కా. కుప్పు దేవరాజ్ అమరులైన రోజు. కిషన్జీ 2011 సంవత్సరంలో లాల్ ఘడ్ విప్లవోద్యమంలో నెత్తురు చిందించాడు 2017 సంవత్సరం దేవరాజ్, అజిత ట్రై జంక్షన్ విప్లవోద్యమంలో బలిదానం చేశారు. తూర్పు పడమర భారతదేశాలను విప్లవీకరించి వంతెన నిర్మించేందుకు వాళ్లు కృషి చేశారు.
విప్లవం గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని సిద్ధాంతాలు సిద్ధం చేసినా రాజకీయ ఆచరణే విప్లవం. అందులో భావజాల నిర్మాణం ఉంటుంది. సంస్కృతీ నిర్మాణం ఉంటుంది. కొత్త మనుషులను తయారు చేసే క్రమం ఉంటుంది. ముందు వెనుకల అవిభాజ్యంగా సిద్ధాంత నిర్మాణం ఉంటుంది. అంతిమంగా మానవ ఆచరణగా విస్తరిస్తుంది. విప్లవమంటే ఇదీ అని కాయితాల మీద అర్థమయ్యేది కాదు. పండిత చర్చల్లో తేలేది కాదు. ఒక రాజకీయ కార్యక్రమాన్ని అమలు చేయడమే విప్లవాచరణ. రాజ్యాధికార స్వాధీనం కోసం ప్రయత్నించడమే విప్లవాచరణ.
విప్లవంలోని ఈ మౌలిక దినుసు అర్థం చేసుకున్నవాళ్లు కిషజ్, అజిత, దేవరాజ్..
ఆలోచనల్లో రాడికల్ గా, విమర్శనాత్మకంగా ఉండటమంటే వాటిని ఆచరించడమే. దానికి సాహసం కావాలని అనడం చాలా చిన్నమాట. విమర్శనాత్మక చింతన అనేది విలువగా, దృక్పథంగా, వ్యక్తిత్వంగా నిగ్గుదేలడమే ఆచరణ. సాహసమంటే తమను తాము ఇట్లా పునర్నిర్మించుకోవడం. అలాంటి వాళ్లే ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందుతారు. ఇదొక సామూహిక పరివర్తనా క్రమం. వ్యక్తులు ఇందులో భాగం కావడమే విప్లవం చేయగలరని అనడానికి షరతు. ఈ రోజు వాళ్లు అమరులైన రోజు కావట్టి ప్రత్యేకంగా వాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ అలాంటి విప్లవకారులందరికీ ఇది వర్తించేదే.
కిషన్జీ, దేవరాజ్, అజిత అమరులై చాలా కాలం అయింది కదా. ఇప్పుడు వాళ్ల గురించి నింపాదిగా తెలుసుకోడానికి చాలా సమాచారం అందుబాటులో ఉన్నది. ఒకసారి తిరిగి చదవండి. ప్రజలు విప్లవం చేయగలరనే గొప్ప భరోసా ఈ ముగ్గురి ఆచరణలో కనిపిస్తుంది. అది కేవలం భరోసానే కాదు. తార్కికమైనది, శాస్త్రీయమైనది. వాళ్ల నాయకత్వంలో జరిగిన ప్రయత్నాలను చదివితే ఈ మార్గంలో విప్లవం సాధ్యమనే నమ్మకం కలుగుతుంది. అనేక సైద్ధాంతిక సవాళ్లకు, వర్తమాన సంక్షోభాలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలు అందులో ఉన్నాయనడానికి ఉదాహరణగా వాళ్ల ఆచరణ నిలబడుతుంది.
కాబట్టి నవంబర్ 24 కేవలం వాళ్ల త్యాగాన్ని మాత్రమే సూచించదు. అందులో పైన చెప్పినవన్నీ ఉన్నాయి.
నిరర్థక త్యాగం అనే వాళ్లున్నట్లే వాళ్ల త్యాగాన్ని గుర్తించవలసిందే అంటూ ఆ మార్గంలో ఏమీ కాదనే వాళ్లూ మన చుట్టూ ఉన్నారు. త్యాగాలు సరే.. వాస్తవ పరిస్థితుల్లో మార్పు తేవడానికి అవసరమైన సిద్ధాంతం మాటేమిటి? అనే వాళ్లూ ఉన్నారు. త్యాగాన్ని మిగతా అన్నిటి నుంచి వేరు చేసే వ్యూహం ఇందులో ఉంది.
త్యాగాలను తలపోసుకోవడమంటే సిద్ధాంత, రాజకీయ సవాళ్లపట్ల శాస్త్రీయ దృష్టిని కోల్పోవడం కాదు. సైద్ధాంతిక రంగంలో నిష్కర్షకు త్యాగాలు అవరోధంగా భావించడం కాదు. విప్లవానికి అత్యవసరమైన సిద్ధాంత చర్చలకు త్యాగపూరితమైన రాజకీయ ఆచరణ ఆటంకమని అనుకోవడం ఏమిటి? అసలు అత్యంత ఇరుకు మార్గాల గుండా ప్రజలు చేస్తున్న పోరాటాలతో నిమిత్తం లేకుండా ఏ సిద్ధాంత అన్వేషణ చేయగలం?
సమాజంలో సంక్షోభం తీవ్రమైన ప్రతిసారీ మేధావుల్లో ఈ ధోరణులు తలెత్తుతాయి. ఆ సంక్షోభాలను దీటుగా ఎదుర్కొనేలా విప్లవోద్యమం లేనప్పుడు కూడా ఆ కారణంగానే ఈ ధోరణులు ముందుకు వస్తాయి. ఇప్పుడు కిషన్జీ, దేవరాజ్ సందర్భంలో ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే .. వాళ్లు ఇలాంటి సమస్యలకు తమ ఆచరణ ద్వారా సమాధానాలు చెప్పారు. అన్యన్యమైన త్యాగాలను మోసుకుంటూ సాగుతున్న ప్రజా ఆచరణ క్రమానికి, సిద్ధాంత రాజకీయ సవాళ్లకు సృజనాత్మకమైన అన్వయం సాధించారు. 1970ల ఆరంభంలోనే తెలంగాణలో కిషన్జీ ఈ ప్రయత్నం మొదలు పెట్టాడు. సుమారుగా అదే సమయంలో దేవరాజ్ తమిళనాడు, కర్ణాటకల్లో ఇలాంటి కృషే మొదలు పెట్టాడు. అజిత కూడా అందులో భాగమైంది.
వీళ్లవి భిన్న సామాజిక అస్థిత్వ నేపథ్యాలు. వర్గపోరాటంలో భాగమై విప్లవకారులుగా తయారయ్యారు. విప్లవాచరణ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకున్నారు. విప్లవ రాజకీయ, సిద్ధాంత విషయాల్లో కృషి చేశారు. కిషన్జీ ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం దాకా అక్కడి నుంచి తూర్పు భారత దేశంలోకి విప్లవ మార్గాన్ని పురోగమింపచేసి లాల్ ఘడ్ దాకా చేరుకున్నాడు. దేవరాజ్, అజిత తమిళనాడులో పుట్టినా కర్ణాటక విప్లవోద్యమంలోకి, పశ్చిమ కనుమల ట్రై జంక్షన్ లోకి విస్తరించారు. అట్లా వాళ్లు తూర్పు పడమర
భారతదేశాల మధ్య విప్లవ వంతెన నిర్మించే ప్రయత్నం చేశారు.
పశ్చిమ బెంగాల్ లో నందిగ్రాం, సింగూర్లో పెట్టుబడి విధ్వంసానికి వ్యతిరేక పోరాటాల దగ్గరి నుంచి లాల్ ఘడ్ విప్లవోద్యమ నిర్మాణం దాకా కిషజ్ చివరి రోజుల కృషి ఉన్నది. నాయకత్వం ఉన్నది. విప్లవోద్యమ పురోగమనం, భారత దేశంలో పెరుగుతున్న నూతన వైరుధ్యాల పై సిద్ధాంత అవగాహన క్రమంలోనే ఇదంతా జరిగింది. ఇది సులభంగా సాధ్యం కాలేదు. ఆచరణలోని అనేక సమస్యను పరిష్కరించుకుంటూ, అసాధారణ త్యాగాల మధ్య కొనసాగింది.
సరిగ్గా ఇదే పరిస్థితి కర్ణాటక, తమిళనాడులో జరిగింది. అనేక సవాళ్లు, ఎదురు దెబ్బల మధ్యనే విప్లవ విస్తరణకు సిద్ధాంత, ఆచరణాత్మక సంఘర్షణల మధ్య దేవరాజ్, అజిత ట్రై జంక్షన్ పోరాటాన్ని నిర్మించారు. ఈ క్రమంలో అనేక నష్టాలు ఉన్నట్లే అత్యద్భుతమైన విజయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆచరణ క్రమం భారత విప్లవోద్యమానికి సిద్ధాంత, నిర్మాణ స్పష్టతను ఇచ్చింది. విప్లవశక్తుల ఐక్యతను నిజం చేసింది.
సరిగ్గా విప్లవోద్యమానికి వ్యతిరేకంగా పాలకశక్తులు కూడా పూర్తి స్థాయిలో ఐక్యమయ్యాయి. దేశవ్యాప్త ఆపరేషన్లు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో విప్లవోద్యమ నిర్మూలనకు అనుసరిస్తున్న దాడి వ్యూహాలు సమన్వయం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి-విప్లవ పార్టీలకు మధ్య చర్చల వైఫల్యం తర్వాత కా. అజాద్, హేమచంద్రపాండే హత్య ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. తూర్పు ప్రాంతంలోకి భారత ప్రభుత్వ బలగాలను నిలవరించే పోరాటంలో ఉన్న కిషన్జీ హత్య చేశారు. దీని వెనుక పోలీసు అధికారి విజయ్ కుమార్ ఉన్నాడు. అప్పటికి విజయకుమార్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్. విప్లవోద్యమానికి వీరి మరణంతో తీవ్ర నష్టం జరిగినప్పటికీ గ్రీన్హంట్ ను విప్లవ ప్రజలు నిలువరించగలిగారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు విజయ్ కుమార్కు అమిత్ షా, అజిత్ దోవల్ తోడయ్యారు. సమాధాన్ రావడానికి నాలుగు నెలల ముందు పశ్చిమ కనుమల్లో దేవరాజ్, అజిత ఎన్ కౌంటర్ జరిగింది. ఇప్పుడు అతను మోడీ కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు వ్యతిరేక భద్రతా సలహాదారు.
ఇప్పుడు లాడ్ పోరాటం దెబ్బతినిపోయి ఉండవచ్చు. ట్రై జంక్షన్ తీవ్రమైన సమరంలోనే ముందుకు వెళ్తూ ఉండవచ్చు. కానీ ఆ విస్తరణ ఆ ముగ్గురి అమరత్వంతో కనుమరుగయ్యేది కాదు. అది విప్లవోద్యమ అనుభవంలో, ఆచరణలో, సిద్ధాంత అవగాహనలో భాగమైపోయింది.
అట్లాగే ఆపరేషన్ సమాధాన్ కూడా అణచివేత వ్యూహాన్ని చాల ముందుకు తీసికెళ్లింది. ఇప్పుడది అన్ని విప్లవోద్యమ ప్రాంతాల్లో అమలవుతోంది. ఇందులో భాగంగా ఇచ్చిన ఉపా చట్టం దేశంలోని అనేక ప్రజాస్వామిక ఉద్యమాల అణచివేత సాధనమైపోయింది.
ఈ తరుణంలో అజిత, కిషన్జీ, దేవరాజ్ అమరత్వాన్ని తల్చుకుంటున్నాం. .
వీళ్ల అమరత్వం తదనంతర కాలంలో దేశంలో మరింత సంక్షోభం ముదిరిపోయింది. దీన్ని అర్థం చేసుకోడానికి అనేక కొత్త ఆలోచనలు అవసరం. అయితే ఎక్కడో ఒక చోట ఆచరణకు పూనుకోని ఆలోచనల వల్ల ఏ ప్రయోజనం ఉండదని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిట్టూర్పులు, నిరాశలు, ఎదురు దాడులు ఎంత కవితాత్మకంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. ప్రజా ఆచరణలో ఉండటం, లేదా దానికి సన్నిహితంగా ఉండటం వల్ల అసలైన జ్ఞాన సముపార్జనకు, సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకపోతే మెట్ట వేదాంతంగా, పాండిత్య ప్రకర్షగా, గాలిలో కత్తి యుద్ధ విన్యాసంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది.
అజిత, కిషన్జీ, దేవరాజ్ విస్పష్టమైన రాజకీయ వైఖరితో దృఢమైన రాజకీయ ఆచరణలోకి రమ్మని తమ జీవితం ద్వారా ఉ ద్బోధిస్తూ అమరులయ్యారు. ఎవరికైనా అదే మార్గదర్శి.
- పాణి
(పాణి రాసిన ఈ వ్యాసం virasam1970.blogspot.com నుండి తీసుకున్నాము)
Keywords : kishan jee, kuppu devaraj, ajitha, kerala, telangana mallojula koteshvar rao
(2024-04-25 03:29:35)
No. of visitors : 1101
Suggested Posts
0 results