నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం... చీకట్లను చీల్చుకొని మళ్ళీ జనం మధ్యకు వస్తాం - విరసం
విప్లవరచయితల సంఘం తో సహా 16 సంఘాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధం రాజ్యాంగ వ్యతిరేకమని విప్లవ రచయితల సంఘం మండి పడింది. ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకంగా ఉండటానికి, ప్రభుత్వ ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు చేయడానికి, ప్రచారం చేసుకోడానికి భారత రాజ్యాంగం పూర్తి అవకాశం ఇచ్చిందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విమర్శనాత్మకంగా ఉండటం భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని విరసం పేర్కొంది. విరసం సహా 16 సంఘాల మీద తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలు చట్ట వ్యతిరేకమని న్యాయ విచారణలో తేలాల్సి ఉందని కానీ ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపిస్తూ విరసం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం మీ కోసం....
26.4.2021
ఈ నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం
విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి
విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు.
ప్రజాస్వామ్యంలో జీవోలు తయారైన కొద్ది గంటల్లోనే ప్రజలకు బహిరంగపరచాలి. ఈ పారదర్శకతను తెలంగాణ ప్రభుత్వం పాటించలేదు. ఇది పాలనా సూత్రాలకు పూర్తి విరుద్ధం. అంతే కాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం లేకుండానే ఆయన పేరు మీద దీన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజాభద్రతా చట్టం -1992 ప్రకారం ఈ సంస్థలను చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటిస్తున్నానని చెప్పుకున్న ప్రభుత్వం ఆ చట్టం ప్రకారమే పాటించాల్సిన పద్ధతులను ఉల్లంఘించింది.
చట్ట వ్యతిరేక సంస్థలుగా ఎందుకు ప్రకటించదల్చుకున్నదీ ముందు ఆ సంఘాల బాధ్యులకు తెలియజేయాలి. ప్రభుత్వ ఆరోపణలపై ఆ సంస్థలు తమ వాదనలను, అభ్యంతరాలను వినిపించడానికి ఒక విచారణ కమిటీని హైకోర్టు న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలి. అక్కడ వాదోపవాదాలు జరిగాక ఆ కమిటీ నిర్ధారిస్తేనే చట్టవ్యతిరేక సంస్థలవుతాయి. నిషేధం అమలులోకి వస్తుంది. ఈ మొత్తానికి చట్టం ప్రకారమే మూడు నెలల గడువు ఉంది.
అంతేగాని ప్రభువుల వారికి కోపం వచ్చినంత మాత్రాన ప్రజా సంఘాలు చట్ట వ్యతిరేక సంస్థలైపోవు. దశాబ్దాలుగా ప్రజా జీవిత ఉన్నతీకరణకు పని చేస్తున్న సంస్థల కార్యకలాపాలు నేరమైపోవు. దొరవారు తమకు ఇష్టం లేని ఆలోచనలను అణచివేయడానికి చట్టాన్ని అడ్డం పెట్టుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. సమాజం మీద నిరంకుశ పెత్తనాన్ని చెలాయించడానికి భిన్నాభిప్రాయాలు గల సంస్థలను చట్టవ్యతిరేకమని అనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
ప్రజలందరూ ప్రభుత్వ అభిప్రాయాలకు లోబడి ఉండాలని, వేరే ఆలోచన ఏదీ చేయడానికి వీల్లేదని అంటే భారత రాజ్యాంగం అంగీకరించదు. ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకంగా ఉండటానికి, ప్రభుత్వ ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు చేయడానికి, ప్రచారం చేసుకోడానికి భారత రాజ్యాంగం పూర్తి అవకాశం ఇచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విమర్శనాత్మకంగా ఉండటం భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. విరసం సహా 16 సంఘాల మీద తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలు చట్ట వ్యతిరేకమని న్యాయ విచారణలో తేలాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిందని మేం చెప్పదల్చుకున్నాం.
ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రజాసంఘాల మీద 5 ఆరోపణలు చేసింది. సీపీఐ మావోయిస్టు వ్యూహం ఎత్తుగల ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకంగా అర్బన్ గెరిల్లా చర్యలకు అనుబంధంగా ఈ సంస్థలు పని చేస్తున్నాయని చేసిన ఆరోపణ పూర్తి అబద్ధం. ఇదొక నిరాధార అసంబద్ధ ప్రచారం. విరసం సీనియర్ సభ్యులు, ప్రముఖ సాహిత్యకారులు వరవరరావు, ప్రొ. జిఎన్. సాయిబాబ విడుదల కోసం పని చేయడాన్ని కూడా చట్ట వ్యతిరేకంగా ఈ జీవోలో పేర్కొన్నారు. వీరిద్దరి విషయంలోనే కాదు, భీమా కొరేగావ్ కేసులోని ఇతర మేధావులపైన, సీఏఏ, ఎన్ ఆర్ సీలను వ్యతిరేకిస్తూ ఉద్యమించినవారిపైన ఉపా కేసులు ఎత్తివేయాలని కోరుకోవడం కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలుగా ఈ జీవో ఆరోపించింది.
ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాసరే బెయిల్ కోరుకోడం, దాని కోసం ఉద్యమించడం చట్టబద్ధమైన హక్కు. వాళ్లు విడుదల అయ్యేదీ లేనిదీ న్యాయ ప్రక్రియలో తేలుతుంది. పౌరులకు ఉన్న ఈ చట్ట పరమైన అవకాశాలను నేరమని ఆపాదించడం చట్టవ్యతికం. ప్రభుత్వం చేసిన ఉపా లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుకోవడం రాజ్యాంగ ఇచ్చిన హక్కు. ఇది ఎంత మాత్రం చట్టవ్యతిరేకం కానే కాదు.
ఇలాంటి ఆరోపణలతో విడుదల చేసిన ఈ ఉత్తర్వులు చెల్లవని మేం ప్రకటిస్తున్నాం. తన రాజకీయ తాత్విక విశ్వాసాల కోసం సాహిత్య కళా మేధో రంగాల్లో విరసం పని చేస్తున్నది. సరిగ్గా 15 ఏళ్ల కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం విరసాన్ని నిషేధించింది. అయితే అప్పుడు ప్రభుత్వం న్యాయ సలహా మండలిని ఏర్పాటు చేసింది. విరసం అక్కడ తన మీద ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సహేతుక వాదనలు వినిపించింది. ప్రభుత్వం తన వాదనలకు కనీస సాక్ష్యాధారాలు చూపుకోలేకపోయింది. అబద్దాలకు ఆధారాలు ఎక్కడ ఉంటాయి? ప్రభుత్వం ఓడిపోయింది. విరసం విజయం సాధించింది. మూడు నెలలకల్లా నిషేధ ఉత్తర్వులు వీగిపోయాయి.
మళ్లీ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఇది ఈ ప్రభుత్వ దుర్మార్గ, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తున్నది. విరసం తాను ఎంచుకున్న సాహిత్య భావజాల రంగాల్లో ప్రజల పక్షాన, ప్రగతి కోసం చేస్తున్న కార్యాచరణ ప్రభువులకు చిరాకు తెప్పిస్తోంది. భయానికి లోను చేస్తోంది. ఇది మౌలికంగా సాహిత్యానికి ఉన్న సృజనాత్మక శక్తికి నిదర్శనం. రాజ్యం పదే పదే నిషేధపు ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాల్సి రావడం విప్లవ రచయితల విశ్లేషణ పటిమకు రుజువు. రచయితలు ప్రజా జీవితంలో ఉంటే రాజ్యపు క్రూర స్వభావం బట్టబయలవుతూ ఉంటుంది. సాహిత్య రచన అంటేనే భావజాల, సాంస్కృతిక పోరాటం. ఆధిపత్య, హింసాత్మక, దోపిడీ భావజాలాన్ని ప్రశ్నించమనే చైతన్యాన్ని ఇది ప్రజలకు అందిస్తుంది. అందుకు పదే పదే రాజ్యం విరసం మీద కన్నెర్ర చేస్తోంది.
రెండోసారి వచ్చిన ఈ నిషేధ ఉత్తర్వులను కూడా మేం తప్పక ప్రజలు, ప్రగతిశీల మేధావులు, రచయితల మద్దతుతో ఎదుర్కొంటాం. ఒక్క విరసమే కాదు, దశాబ్దాలుగా ప్రజా జీవితంలోని వేర్వేరు జీవన పార్శ్వాల్లో నిబద్దంగా పని చేస్తున్న మిగతా ప్రజా సంఘాలు కూడా ఈ అప్రజాస్వామిక ఉత్తర్వుల చీకట్ల నుంచి తేజోవంతంగా, మరింత వెలుగులీనుతూ జనం మధ్యకు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నాం. ఈ ఉత్తర్వుల్లోని ఆరోపణలు ఎంత ప్రమాదకరమో ఆలోచించమని సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దురుద్దేశపూరిత, కుట్రపూరిత చట్టవ్యతిరేక ప్రభుత్వ చర్యలను ఖండించాలని అందరినీ కోరుతున్నాం.
అరసవెల్లి క్రిష్ణ(అధ్యక్షుడు)
బాసిత్ (ఉపాధ్యక్షుడు)
రివేరా(సహాయ కార్యదర్శి)
కార్యవర్గ సభ్యులు పి. చిన్నయ్య,ఉజ్వ ల్, రాంకి, రాము, పాణి, వరలక్ష్మి
సీనియర్ సభ్యులు క్రిష్ణాబాయి, సిఎస్ఆర్ ప్రసాద్, జి. కళ్యాణరావు, రత్నమాల, వి. చెంచయ్య, నల్లూరి రుక్మిణి
Keywords : virasam, clc, cms, kcr, telangana, ban, go ms no.73
(2024-04-25 00:36:50)
No. of visitors : 751
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |