మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
18-06-2021
అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా సోకిందంటూ పోలీసులు ప్రకటించిన జాబితాలోని వారితో సహా మా పార్టీలో ఏ ఒక్కరికీ కొరోనా ఇప్పటి వరకు సోకలేదనీ మా కార్యకర్తలందరూ చురుగ్గా విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారనీ ముఖ్యంగా వారి బంధు మితృలు ఎంతమాత్రం అందోళన పడాల్సిన అవసరం లేదనీ అభయ్ ఈ సందర్భంగా కోరారు.
అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....
కొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టి
మన దేశంలో కోవిడ్ - 19 మహమ్మారీ రెండవ అల విజృంభణను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన భారత పాలక వర్గాలు, కోట్లాది దేశ ప్రజలకు జవాబుదారీ వహించడం పోయి వీలైన అన్ని పద్ధతులలో ప్రజలను దారి మళ్లించే చర్యలకు, ప్రచారాలకు పూనుకుంటున్నారు. అందులో భాగంగానే పోలీసులు రెండవ అల ప్రారంభం నుండి కొరోనాతో మావోయిస్టుల మరణం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిని మా పార్టీ కేంద్ర కమిటీ నిర్ద్వందంగా ఖండిస్తున్నది. ఈ వార్తలన్నీ కేవలం పోలీసుల కల్పిత కథనాలేననీ ప్రజలకు స్పష్టం చేస్తున్నది. కొరోనా సాకుతో మావోయిస్టులను ఉద్యమ బాట వదలి లొంగిపోవాలని కోరడం పోలీసుల దివాళాకోరుతనాన్ని ప్రదర్శించడమే తప్ప మరేం కాదు.
దేశంలో రెండవ విడుత కొరోనా ప్రబలడానికి కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణం తప్ప మరెవరూ కారు. ప్రధానంగా కేంద్రం కొరోనా ప్రమాద తీవ్రతను పక్కన పెట్టి 5 రాష్ట్రాలలో 8 విడుతలలో జరిగే సుదీర్ఘ ఎన్నికల రణరంగాన్ని సిద్ధం చేసింది. ఎన్నికల ప్రచారానికి జరిపిన భారీ ర్యాలీలు, రోడ్ షోలు, విశాల ప్రజా సభలు తెలిసినవే! దేశంలో మొదటి విడుత కొరోనా వ్యాప్తికి ముస్లిం సంస్థ ʹతబ్లిగ్ ఏ జమాతీʹ కారణమంటూ నిరాధారమైన ఆరోపణలు చేసి, నిందించి, ఆ సంస్థ విదేశీ కార్యకర్తలు మన దేశం రావడాన్ని నిషేధించింది. ఈసారి రెండవ విడుత కొరోనా మహమ్మారీ వ్యాప్తి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో తమ హిందూ దురభిమానంతో కుంభమేళాలు నిర్వహించారు. తత్ఫలితంగా కొరోనా అతి వేగంగా గంగా మైదానాలలోకి విస్తరించింది. గంగా నదిలో వందలాది గ్రామీణుల శవాలు తేలే దుస్థితిని కల్పించారు. మరోవైపు కోట్ల రూపాయల వ్యాపారంగా మారిన క్రికెట్ క్రీడను అనుమతించారు. అనేక చోట్ల పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. పాలకులు తమ రాజకీయ, ఆర్థిక లాభాల కోసం అనేక రకాలుగా పీడిత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
కొరోనా వ్యాక్సిన్ తయారీలో ʹఆత్మనిర్బర్ʹ అంటూ మోదీ ప్రభుత్వం స్వోత్కర్షతో ప్రగల్బాలు పలుకుతూ ఏ వయసు గ్రూపు వారికి కూడ దేశంలో పూర్తి కొరోనా డోసులు అందకుండా వారిని బ్లాక్ ఫంగస్ లాంటి మరిన్ని కొత్త రోగాల పాలు చేస్తున్నది. విదేశాల నుండి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడంలో అనవసర తాత్సారం చేసి దేశంలో వేలాది మరణాలకు కారకులయ్యారు. కొరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రజలు నానారకాలుగా ఇబ్బందులు పడుతూ, నష్టాల పాలవుతుంటే కొరోనా వ్యాక్సిన్ అమ్మకాలతో పాలకులు కార్పొరేటు సంస్థలకు లాభాలు పండించారు. ఇక వ్యాక్సిన్ దౌత్యం గురించి వెలువడుతున్న వార్తలు వింటునే ఉన్నాం. ఇలా అన్ని రకాలుగా కొరోనా మహమ్మారిని ఒక ఆర్థిక, రాజకీయ అస్త్రంగా మలుచుకొని ప్రజల ప్రాణాలు తోడేస్తున్న పాలకులు కనీసం శ్మశాన వాటికలలో శవదహనాలకు కర్రలైనా సమకూర్చని నీతిమాలిన రాజకీయాలను అతి నీచ స్థితికి దిగజార్చారు. వీటన్నిటిని మా పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తూ పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా దృఢంగా, సమరశీలంగా పోరాడాల్సిందిగా పిలుపునిస్తోంది. కొరోనా సృష్టికర్తలైన దోపిడీ సామ్రాజ్యవాదులు వారి తాబేదార్ల ఉనికే లేకుండా పోయినపుడే ప్రజల ఆరోగ్యాలకు గట్టి హామీ ఉంటుంది.
పై పరిస్థితులలో ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన పాలకులు వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజలకు వాటిని నగ్నంగా బహిర్గతం చేస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం పాటుపడుతున్న మా పార్టీపై వారు దుష్ప్రచారం చేయడం కొత్త కాదు. గతంలో మా పార్టీ నాయకత్వం రోగాల పాలై మంచాన పడిందంటూ అనేక కల్పిత కథనాలను ప్రచారం చేశారు. ఇటీవలే మా పార్టీ ప్రధాన నాయకత్వం లొంగుబాటుకు సిద్ధమైందంటూ సంచలనాత్మక వార్తలను విడుదల చేశారు. ఇపుడు మాకు కొరోనా సోకిందంటున్నారు. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులు. దేశ పీడిత ప్రజలలో మా పార్టీ పట్ల పెరుగుతున్న ప్రేమాభిమానాలను, విశ్వాస నమ్మకాలను, ప్రతిష్టను వమ్ము చేయడానికి వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు. వాటిలో భాగమే ప్రస్తుతం కొరోనా వ్యాధితో మావోయిస్టుల మరణాలు, కేడర్లను చికిత్సకు అనమతించడం లేదంటూ పోలీసులు జరుపుతున్న ప్రచారమంతా బూటకమే తప్ప అందులో రవ్వంత కూడ వాస్తవం లేదు. అలా మరణాలే జరిగి ఉంటే మా పార్టీ ఎలాంటి దాపరికం లేకుండా నిరభ్యంతరంగా ప్రకటిస్తుంది.
అవాకులు చవాకులతో విప్లవోద్యమం పై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం పాలకులకు అవసరం. అందుకు తమ చేతులలోని మీడియాను అది తప్పక వినియోగించుకుంటుంది. కానీ, తమ వృత్తి ధర్మానికి తిలోదకాలిచ్చి తానా అంటే తందానా అన్న చందంగా కొంత మంది పాత్రికేయులు పోలీసు వార్తలను ప్రచారం చేయడాన్ని కూడ మాపార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. విప్లవ రాజకీయాల నుండి హీనాతి హీనంగా దిగజారి పోయిన జపన్నకు విప్లవరాజకీయాలపై, మా పార్టీపై మాట్లాడటానికి కనీస నైతిక అర్హత కూడా లేదని మా పార్టీ ఈ సందర్భంగా మరో సారి స్పష్టం చేస్తోంది. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికి మాటికీ పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాం.
మావోయిస్టులు మానవాతీతులు ఏమీ కారు. ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కొరోనా మహమ్మారి ప్రజల మధ్య పనిచేస్తున్న మావోయిస్టులకు సోకదనే గ్యారంటీ ఏమి లేదు. కాకపోతే, ఈనాటి వరకు మా ఉద్యమ ప్రాంతాల ప్రజలకు, మాకు ఆ మహమ్మారి సోకలేదనే వాస్తవాన్ని మేం ఈ పత్రికా ప్రకటన ద్వార విప్లవ ప్రజలకు, విప్లవ సానుభూతిపరులకు, భారత ప్రజల ప్రజాస్వామిక విప్లవోద్యమ విజయాన్ని ఆకాంక్షించే సమస్త మిత్ర శక్తులకు తెలియచేస్తున్నాం. పోలీసులు ప్రకటించిన జాబితాలోని వారితో సహ మా పార్టీలో ఏ ఒక్కరికీ కొరోనా ఇప్పటి వరకు సోకలేదనీ మా కార్యకర్తలందరూ చురుగ్గా విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారనీ ముఖ్యంగా వారి బంధు మితృలు ఎంతమాత్రం అందోళన పడాల్సిన అవసరం లేదనీ కోరుతున్నాం.
కొరోనా సాకుతో మావోయిస్టుల లొంగుబాటుకు ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ పోలీసులు అనారోగ్యంతో ఉన్న మా ప్రియమైన కామేడ్స్ గంగాలు, శోబ్రాయిలను ఇటీవలే అరెస్టు చేసి వారికి కొరోనా పాజిటివ్ తేలిందనే అబద్దాలను తెగ ప్రచారం చేసి వారిని నాటకీయంగా అసుపత్రులలో చేర్చినట్టు చూపి మాననీయ విలువలను మంటగలుపుతూ నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామనీ, వారు ప్రధాన స్రవంతిలో జీవించవచ్చని నమ్మ బలుకుతున్నారు. కానీ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దోపిడీ పీడన, అణచివేత సహా అన్ని రకాల రుగ్మతలకు వ్యతిరేకంగా ఒక ఆరోగ్యకరమైన, దోపిడీ రహిత నూతన సమాజ నిర్మాణం కోసం అత్యంత అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తున్న ఏ విప్లవకారులు సామ్రాజ్యవాదులు సృష్టించే వ్యాధులకు వెరసి సామ్రాజ్యవాద అంతానికై పోరాడుతున్న విప్లవోద్యమాన్ని వదలుకోరని స్పష్టం చేస్తోంది. ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎంతమాత్రం నమ్మకూడదనీ, ఎలాంటి అందోళనకు గురికాకూడదనీ యావత్ విప్లవ క్యాంపును కోరుతున్నాం.
పోలీసులకు విజ్ఞప్తి: మీరు మాకు ఇంకా సోకని కొరోనాకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఏమీ లేదు కానీ, వివిధ ప్రాంతాలలో మా కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళుతూ కొరోనా జాగరూకత కార్యక్రమాలు చేపడుతుంటే వారిపై కాల్పులకు పాల్పడడం మీ పాశవిక మనస్తత్వాన్ని చాటుతుంది. మహమ్మారీ కాలంలో అలాంటి శాడిస్టు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి.
అభయ్,
అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).


Keywords : maoists, telangana, andhrapradesh, corona, covid 19, CPI MAOIST Statement on Corona
(2025-03-15 15:40:17)
No. of visitors : 2539
Suggested Posts
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణవేలాది ఎర్రని జెండాలతో దండకారణ్యం ఎర్రబడింది. వేల మంది ప్రజల నినాదాలతో దండకారణ్యం దద్దరిల్లింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. |