బ్రహ్మదేవ్ను భద్రతా దళాలు హత్య చేశాయి - బహిర్గతం చేసిన నిజనిర్దారణ కమిటీ నివేదిక
30-06-2021
జార్ఖండ్ రాష్ట్రం, లాతేహర్ జిల్లాలోని, గారూ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకు-పిరి అడవిలో 2021 జూన్ 12 న, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో, ఒక నక్సలైట్ మరణించాడనీ, అనేక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు అనీ అనేక వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి.
కానీ, మర్నాడు జూన్ 13 న, అనేక స్థానిక వార్తాపత్రికలలో, సర్హుల్ కొండల ముందర వున్న అడవిలో వేటకని వెళ్ళిన పిరి గ్రామ నివాసులైన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు జరిపిన తిరుగు కాల్పుల్లో 24 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.
జార్ఖండ్ జనాధికార్ మహాసభ తరఫున వివిధ సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల బృందం ఈ విషయంపై దర్యాప్తు జరిపారు. ఈ బృందంలో ఆదివాసి అధికార్ మంచ్, ఆదివాసీ ఉమెన్స్ నెట్వర్క్, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్, ది గ్రామ్సభ వంటి అనేక సామాజిక, మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.
ఈ బృందం జూన్ 17 న గ్రామస్తులను, బాధితులను కలుసుకుంది, స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీసుల స్పందన, ఎఫ్ఐఆర్ నమోదు, స్థానిక మీడియా చేసిన నివేదికలను విశ్లేషించింది.
జూన్ 12 న జరిగిన ఘటన ఏ విధంగానూ "ఎన్కౌంటర్" కాదని బృందం నిర్థారించింది. అమాయక గ్రామస్తులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరణించిన బ్రహ్మదేవ్తో పాటు ఆ గ్రామ యువకులు ఆరుగురు, ఎప్పటిలాగానే సర్హుల్ పండుగ ముందు సాంప్రదాయ వేటకు వెళ్ళారు. బ్రహ్మదేవ్ దగ్గర వున్న భార్తువా తుపాకీ తరతరాలుగా వారి కుటుంబంలో ఉంది. ఈ తుపాకీతో సింగల్ ఫైర్ చేయవచ్చు. కుందేళ్ళు, కోళ్లు, పందులు వంటి చిన్న జంతువులను వేటాడేందుకు, పంటలను జంతువుల నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు.
సుమారు 50 అడుగులు నడిచాక, కాస్త ముందుగా నడుస్తున్న ఒక యువకుడు అటవీ అంచున ఉన్న భద్రతా దళ సిబ్బందిని చూసి తనతో వున్న వాళ్ళతో వెనక్కు వెళ్ళిపోదామనడంతో అందరూ పరిగెత్తడం ప్రారంభించారు. ఇంతలో భద్రతా దళం కాల్పులు ప్రారంభించింది. భార్తువా తుపాకీ నుండి కాల్పులు జరగలేదు. వారు పోలీసులను చూసి చేతులు పైకెత్తి, ʹమేము మావోయిస్టు పార్టీ కాదు, మమ్మల్ని చంపద్దుʹ అని వేడుకొంటున్నప్పటికీ, పోలీసులు జరిపిన కాల్పుల్లో, దీననాథ్ చేతికి, బ్రహ్మదేవ్ శరీరానికి తూటాలు తగిలాయి. ఆ తరువాత, బ్రహ్మదేవ్ను భద్రతా దళాలు అడవి చివరకు తీసుకెళ్లి మళ్ళీ కాల్చి చనిపోయాడని ధృవపరచుకున్నారు. గ్రామస్తుల ప్రకారం, పోలీసులు అరగంట దాకా కాల్పులు జరిపారు. ఆ ఆరుగురు బాధితులకీ మావోయిస్టు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని గ్రామస్తులు నిజనిర్ధారణ బృందానికి చెప్పారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని చూస్తే వారు నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఎఫ్ఐఆర్లోను పోలీసులు తూటా వల్ల బ్రహ్మదేవ్ హత్య జరిగినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ చర్యను ఎన్కౌంటర్ అని పేర్కొని, సాయుధ వ్యక్తులు మొదట కాల్పులు జరిపారని, కొంతమంది అడవిలోకి పారిపోయారని, అడవి అంచున బ్రహ్మదేవ్ మృతదేహం కనబడింది అని రాశారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఆయుధ చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద బ్రహ్మాదేవ్తో సహా ఆరుగురు ఆదివాసీలపై కేసుల నమోదు చేయడం కూడా పోలీసుల ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తుంది. పోలీసుల కాల్పులు, హత్యలను ప్రశ్నించకుండా గ్రామస్తులపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో, అనేక కాయితాల మీద, (కొన్ని తెల్లవి, కొన్ని ఏదో వ్రాసినవి) సంతకం, లేదా బొటనవేలు ముద్ర వేయించారు. కానీ ఆ కాయితాల్లో ఏమి రాశారో ఎవరికీ వివరించ లేదు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్నాయి. ఉదాహరణకు, 2020 జూన్లో, పశ్చిమ సింఘ్భూమ్లోని చిరియాబేడా గ్రామంలో జరిపిన సెర్చ్ కేంపెయిన్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఆదివాసీలను దారుణంగా కొట్టారు. ఈ హింసాకాండలో సిఆర్పిఎఫ్ పాత్రవుందని చైబాసా సూపరింటెండెంట్ అంగీకరించినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిఆర్పిఎఫ్ హింసకు బాధ్యులు అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు బాధితులకు పరిహారం యివ్వడం కానీ లేదా బాధ్యులైన సిఆర్పిఎఫ్ జవాన్లపై చర్యలు తీసుకోవడం గానీ జరగలేదు.
గత బిజెపి ప్రభుత్వ అణచివేత, ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగానూ, ఆదివాసీలపై జరుగుతున్న నిరంతర దాడుల ఫలితంగా మాత్రమే హేమంత్ సోరెన్ నాయకత్వంలోని మహా కూటమికి స్పష్టమైన ప్రజల మద్దత్తు లభించిందని పార్టీ సభ్యులు అంటున్నారు. కానీ ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనా ఘటనలు, ఆదివాసీలపై పరిపాలనా హింస, పోలీసుల అణచివేత ఆగకపోవడం చాలా విచారకరం. ఆదివాసీల ప్రయోజనాల పరిరక్షణ కోసం జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి జార్ఖండ్ జనాధికార్ మహాసభ, నిజనిర్ధారణ బృందం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ క్రింది డిమాండ్లను చేస్తుంది: -
- ఇది మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ కాదని, భద్రతా దళాలు జరిగిన తిరుగు కాల్పులు కాదని ప్రభుత్వం అధికారికంగా బహిరంగపరచాలి. వేటకు వెళ్ళిన ఆదివాసీలు భద్రతా దళాలపై కాల్పులు జరపలేదు. అమాయక ఆదివాసీలపై భద్రతా దళాలు కాల్పులు జరపి బ్రహ్మదేవ్ను హత్య చేసి ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నించారు.
- ఈ విషయంపై న్యాయమైన దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బ్రహ్మాదేవ్ను హత్య చేసి, గ్రామస్తులపై కాల్పులకు బాధ్యులైన భద్రతా దళ సిబ్బంది, అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బ్రహ్మాదేవ్తో సహా ఆరుగురు ఆదివాసీలపైన పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి. తప్పుడు ప్రకటనలు, ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినందుకు స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులపై పరిపాలనాసంబంధ చర్యలు తీసుకోవాలి.
- తెల్లకాయితాలపై లేదా రాసినది చదివి వినిపించకుండా సంతకం లేదా బొటనవేలు ముద్ర తీసుకున్నారు కాబట్టి బాధితులు, వారి కుటుంబ సభ్యుల నుండి పోలీసులు తీసుకున్న అన్ని స్టేట్మెంట్లు, అఫిడవిట్లు మొదలైనవాటిని రద్దు చేసినట్లుగా పరిగణించాలి. తన న్యాయవాది సమక్షంలో మాత్రమే బాధితుడు ప్రకటన చేయాలి.
- బ్రహ్మాదేవ్ భార్యకు కనీసం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, వారి కుమారుడి పెంపకం, విద్య, ఉపాధికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే, మిగిలిన ఐదుగురు బాధితులకు పోలీసుల వేధింపులకు పరిహారం చెల్లించాలి.
- ప్రజలను, ముఖ్యంగా ఆదివాసీలను ఏ విధంగానైనా దోపిడీ చేయవద్దని స్థానిక పరిపాలన, భద్రతా దళాలకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల ముసుగులో ప్రజలను భద్రతా దళాలు వేధించకూడదు.
- ఏ గ్రామ సరిహద్దులోనైనా సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ముందు గ్రామసభ, సాంప్రదాయ గ్రామ పెద్దలు, ఇతర ప్రాంతాల పంచాయతీ ప్రతినిధుల సమ్మతి తీసుకోవాలి. ఐదవ షెడ్యూల్ నిబంధనలు, పెసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
- స్థానిక పరిపాలనా సిబ్బందికి, భద్రతా దళాలకు ఆదివాసీ ప్రజల భాష, ఆచారాలు, సంస్కృతి, జీవిత విలువల గురించి శిక్షణ ఇవ్వాలి.
Keywords : jarkhand, fake encounter, murder, police, adivasi,bramhadev-was-murdered-by-security-forces-says-fact-finding-team
(2024-05-01 07:10:18)
No. of visitors : 1282
Suggested Posts
| మాఊర్లో మారాజ్యం... స్వతంత్రం ప్రకటించుకున్న 100 ఆదివాసీ గ్రామాలుమా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వయం పాలనను ప్రకటించుకుంటున్నారు. ఝార్ఖండ్లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి. |
| 78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడిసామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్పై జార్ఖాండ్లోని పకూర్లో మంగళవారంనాడు చెడ్డీ గ్యాంగ్ మూక దాడి చేసింది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చినప్పుడు బీజేపీ యువమోర్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఆయనను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు. |
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villagesOn 5-6 March 2021, a human rights fact-finding team of CDRO and HRLN visited three police station areas of the Giridih district - Madhuvan, Dumri and Pirtand, where the central government has decided to set up para – military camps. Following the decision there has been massive protests by the villagers. The team met these villagers and got complete info |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్ |