పెగాసస్ స్కాం: జర్నలిస్టు రూపేష్, అతని భార్యల ఫోన్లు హ్యాక్... సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
02-08-2021
జార్కండ్ రాష్ట్రం రాంగర్ కు చెందిన జర్నలిస్ట్, కార్యకర్త రూపేష్ కుమార్ సింగ్, అతని జీవిత భాగస్వామి, కార్యకర్త ఇప్సా శతాక్షి పెగాసస్ గూఢచర్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వారిద్దరి తరపున న్యాయవాది ప్రతీక్ కుమార్ చడ్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో యూనియన్ ఆఫ్ ఇండియా & ఇతరులను ప్రతివాదులుగా చేసారు.
300 మందికి పైగా భారతీయ పౌరులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఇజ్రాయెల్ కంపెనీ NSO తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ సహాయంతో గూఢచర్యం చేసిన తీవ్రమైన కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్లోని రామ్గఢ్లో ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్, అతని జీవిత భాగస్వామి, కార్యకర్త ఇప్సా శతాక్షికి సంబంధించిన మూడు ఫోన్ నంబర్లు పెగాసస్ స్పైవేర్ జాబితాలో ఉన్నాయి.
బెదిరించేవాళ్లు నా కంటే ముందు చేరుకునేవారు
రూపేష్ కుమార్ సింగ్ది జర్నలిజంలో నిబద్ధత కలిగిన పేరు. పెగాసస్ గూఢచర్యం కేసు గురించి ఒక ఇంటర్వ్యూలో, రూపేష్ కుమార్ సింగ్
ʹʹమా జర్నలిస్టుల విషయానికొస్తే, మేము విశ్వసనీయ సమాచార మూలాల ఆధారంగా పని చేస్తామనేది స్పష్టమైన విషయమే. మా గ్రామంలో ఈ సమస్య ఉంది లేదా ఈ ఉద్యమం జరుగుతోంది మీరు రండి అని మాకు గ్రామాల నుండి ఫోన్లు వస్తాయి. ఈ పెగాసిస్ వ్యవహారం తెలిసాక ఇక ఎవరైనా మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? వారంతా భయపడతారు కదాʹʹ అని అన్నారు.
ʹʹనాకు ఇలా గతంలో కూడా జరిగింది, అయితే మా మీద గూఢచర్యం చేస్తున్నారనే విషయం మాకు ఇప్పుడు తెలిసింది, నేను వస్తున్నానని ఎవరికైనా ఫోన్ చేసి, నేను అక్కడికి చేరుకునే ముందే వేరే వాళ్ళు అక్కడికి చేరుకుని ʹమీరు ఎవరిని పిలిచారు, ఎందుకు పిలిచారు?ʹ అని అడిగేవారు.
అణగారిన ఆదివాసీ సమాజం కోసం జర్నలిజం చేసే రూపేష్ కుమార్ సింగ్, ʹనేను నివసిస్తున్న రాష్ట్రం, నేను రాసే వార్తలు, సహజ వనరుల దోపిడీకి సంబంధించినవి. జార్ఖండ్లో నిర్వాసిత్వం సమస్య, నిర్వాసితుల ఉద్యమం, ఇక్కడ బలవంతపు ఎన్కౌంటర్లు, మావోయిస్టుల పేరిట ఆదివాసీలను పెద్దఎత్తున అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం జరుగుతోంది. నేను ఆ పోరాటాన్ని విస్తృత పరిధిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వనరుల దోపిడీలో స్థానికులు మాత్రమే కాదు, మన ప్రభుత్వం ఆహ్వానించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ, విదేశాల పెట్టుబడిదారులు వున్నారు. నేను దానిపై వ్రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, అందుకే నా పేరు జాబితాలో ఉందని నేను అనుకుంటున్నాను.
"జాబితాలో నా జీవిత సహచరి, మరొక కుటుంబ సభ్యుడి పేరు కనిపించిందని తెలిసినప్పుడు, నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ చాలా కోపం వచ్చింది. నేను నా బెడ్రూమ్లో ఏమి చేస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని తెలుసుకొనే ప్రభుత్వం ఒకరి గోప్యతతో ఎలా చెలగాటమాడుతుంది? ఒక జర్నలిస్టు స్వరాన్ని అణచివేయడానికి, జర్నలిజంతో అంతగా సంబంధం లేని నా కుటుంబ సభ్యుల ఫోన్ను కూడా వారు ట్యాప్ చేస్తున్నారుʹ అని అంటారు.
ఈ విషయంలో విచారణకు అనేక దేశాల ప్రభుత్వాలు ఆదేశించాయి. ఫ్రాన్స్తో పాటు, అల్జీరియా, ఇజ్రాయెల్, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. NSOతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి థామస్ జెరాన్ ఇజ్రాయెల్కు పారిపోయాడనీ, దర్యాప్తు చేస్తున్నామనీ మెక్సికో అటార్నీ జనరల్ ఇటీవల చెప్పారు. ఆరోపణలకు గురైన ఇజ్రాయెల్ కంపెనీ పైన విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంలో, ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు NSO గ్రూప్ కార్యాలయాలపై దాడి చేశారనీ, ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు తమ కార్యాలయాలకు వచ్చారనీ స్వయంగా NSO ప్రతినిధి ఇజ్రాయెల్ న్యూస్ వెబ్సైట్ ʹది రికార్డ్ʹ ద్వారా ధృవీకరించారు.
ఫ్రాన్స్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (ANSSI) దేశంలోని ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ మ్యాగజైన్ మీడియాపార్ట్లో పని చేస్తున్న లిన్నెగ్ బ్రెడాక్స్, ఎడ్వి ప్లానెల్ అనే ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు ధృవీకరించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ నివేదికలో వారిద్దరి పేర్లు ఉన్నాయి.ఇది ప్రపంచ స్నూపింగ్ స్కామ్కి సంబంధించి ఒక ప్రభుత్వ సంస్థ చేసిన మొదటి నిర్ధారణ.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జాబితాలో తమ ఇద్దరు జర్నలిస్టుల పేర్లు కనిపించిన తరువాత, మీడియాపార్ట్ ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత, పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెమి హీట్జ్ జూలై 20 న దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లను పారిస్ ప్రధాన కార్యాలయంలో ఫ్రెంచ్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ANSSI పరిశీలించింది. మీడియాపార్ట్ ప్రకారం, ANSSI కి చెందిన IT నిపుణులు పెగాసస్ ద్వారా తమ ఫోన్ల గూఢచర్యాన్ని నిర్ధారించారు. కేసు విచారణ సమయంలో ఇది నిర్ధారించబడిందని దీనికి సంబంధించి మీడియాపార్ట్ ఫ్రెంచ్లో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. విశేషమేమిటంటే, పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా గూఢచర్యం చేయించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. అది తెలిసిన తరువాత మాత్రమే, ఫ్రాన్స్ ఈ విషయంలో దర్యాప్తును ఏర్పాటు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 ఫోన్ నంబర్లను పెగాసస్ హ్యాక్ చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నివేదికలో తెలిపింది.
అదే సమయంలో, భారత ప్రభుత్వం అటువంటి గూఢచర్యం స్కామ్ జరగలేదని చెప్పడమే కాకుండా, ప్రభుత్వమూ, ప్రభుత్వ సంస్థలలో కూడా స్పైవేర్ వినియోగంపై దర్యాప్తు చేయాలనే డిమాండ్ను తిరస్కరించింది. ఏదేమైనా, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ కూడా పెగసస్ సంభావిత లక్ష్యంగా వున్న ఫ్రాన్స్లో ఈ వివాదం ఒక బలమైన చర్య చేపట్టడానికి దారితీసింది,
ఇదిలా ఉండగా, ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరుపుతామని భారత సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపేసి కోర్టు వింటుంది అని అనుకుంటున్నారు.
(janchowk.com సౌజన్యంతో... )
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి
Keywords : pegasus, jarkhand, Journalist, Rupesh kumar singh, wife,
(2024-04-24 23:26:39)
No. of visitors : 687
Suggested Posts
| ప్రతి మనిషి జేబులో పోలీసు! ఒక హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు రాజ్యం ఎంత దుర్మార్గంగా ఉండడానికి అవకాశం ఉందో, నరేంద్ర మోడీ – అమిత్ షా ప్రభుత్వం ఆ అవకాశాల చిట్టచివరి పరిధిని తాకదలచుకున్నట్టుందని తాజాగా బైటపడిన పెగాసస్ స్పైవేర్ ఉదంతం బైటపెడుతున్నది. |