త్రిపురలో ముస్లింలపై హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లపై UAPA -ప్రజాసంఘాల ప్రకటన
09-11-2021
త్రిపురలో ముస్లిం వ్యతిరేక హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండిద్దాం!
నిజనిర్ధారణ కమిటీ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారిపై మోపిన అభియోగాలను వెనక్కు తీసుకోవాలి, హింసకు కారకులైనవారిని శిక్షించాలి!
నవంబర్ 3న, త్రిపుర పోలీసులు ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులకు ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ నోటీసులు పంపారు. ఈ లాయర్లు, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (NCHRO) కార్యదర్శి అడ్వకేట్ అన్సార్ ఇండోరి, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (PUCL) సభ్యుడు అడ్వకేట్ ముఖేష్, న్యాయవాది అమిత్ శ్రీవాత్సవ, లాయర్స్ ఫర్ డెమోక్రసీ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ఎంతేషమ్ హష్మీ, ఇటీవల త్రిపురలో మత హింస వార్తల నేపథ్యంలో జరిపిన రెండు రోజుల నిజనిర్ధారణ ఆధారంగా, ʹత్రిపురలో మానవత్వం దాడికి గురవుతోంది, #ముస్లిం లైఫ్ మేటర్ʹ అనే శీర్షికతో తయారు చేసిన ఒక నివేదికను, నవంబర్ 2వ తేదీన న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. అక్టోబరు 15న బంగ్లాదేశ్లో జరిగిన మత హింసాకాండ, ఆ తర్వాత పది రోజుల పాటు త్రిపురలో జరిగిన మత హింసాకాండను ఈ నివేదిక నమోదు చేసింది. ఇందులో 12 మసీదులతో పాటు తొమ్మిది దుకాణాలు, ముస్లింలకు చెందిన మూడు ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు అనేక దహన సంఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని నివేదిక కోరింది.
నలుగురు లాయర్ల ఈ చర్యలు చట్టవ్యతిరేకమైనవని, వారి వాదనలు అబద్ధమని త్రిపుర పోలీసులు పేర్కొన్నారు. నలుగురు లాయర్లకు జారీ చేసిన నోటీసుల్లో UAPAలోని సెక్షన్ 13, IPCలోని సెక్షన్ 120 (b), 153 (a), 153 (b), 469, 471, 503, 504 కింద అభియోగాలు ఉన్నాయి (ఇవి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో పాటు నేరస్థుల కమీషన్ను ప్రేరేపిస్తాయి. శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత దావాలు, బెదిరింపులను ఉద్దేశపూర్వకంగా చేయడం), మత సముదాయాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వివిధ మత సముదాయాల ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్ట్లు పెట్టినందుకు నవంబర్ 10న పశ్చిమ అగర్తల పోలీస్ స్టేషన్లో న్యాయవాదులు హాజరు కావాలని నోటీసులో డిమాండ్ చేశారు. నిజనిర్ధారణ సమయంలో లాయర్లు తీసిన ఫోటోలు కూడా నకిలీవని, వాటిని సోషల్ మీడియా నుండి తొలగించాలని పోలీసులు డిమాండ్ చేశారు. నిజనిర్ధారణ నివేదికను విడుదల చేయడం, సోషల్ మీడియాలో ఫోటోలను ప్రసారం చేయడమే UAPAలోని సెక్షన్ 13లాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం దేశంలోని ప్రజాస్వామ్యం, మానవ హక్కుల స్థితికి సంబంధించిన విచారకరమైన స్థితిని తెలియచేస్తుంది. ఆశ్చర్యకరంగా, నిజనిర్ధారణ బృందంలోని నలుగురు ఎన్జీవో కార్యకర్తలను త్రిపుర పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తల్లో వచ్చింది.
గత నెలలో త్రిపురలో జరిగిన మత హింస ముఖ్యంగా ముస్లిం సమాజంపై ప్రతీకారం తీర్చుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. త్రిపురరాష్ట్ర జనాభాలో 9% కంటే తక్కువ ఉన్న ముస్లింలు పది రోజులకు పైగా భయభ్రాంతులకు గురయ్యారు. విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో సహా హిందూత్వ సంస్థలు విస్తృతంగా సమీకృతమై ముస్లిం ప్రాంతాలలో ర్యాలీలు, కవాతులు నిర్వహించాయి. బంగ్లాదేశ్లో జరిగిన ఘటనలకు ప్రతీకారం తీర్చుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన నినాదాలు, హింసాత్మక బెదిరింపులు, రాళ్ల దాడి, విధ్వంసం, దహనం వంటి చర్యలు జరిగాయి. అక్టోబర్ 26న, VHP భారీ ర్యాలీ తర్వాత, ఉత్తర త్రిపురలోని చమ్టిల్లాలో ఒక మసీదును ధ్వంసం చేసారు, అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో త్రిపుర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి కమిటీలు వేయాలని సిఫారసు చేసింది.
హైకోర్టు జోక్యం చేసుకోవడంతో, బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హింసాకాండను రాష్ట్ర పరువు తీసేందుకు బయటి శక్తులు చేసిన కుట్రగా ప్రకటించింది. RTI కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నవంబర్ 2న త్రిపుర పోలీసులకు హింసపై దర్యాప్తులో వారి పాత్రను తెలియచేయమని లేఖ రాసింది.
ఈ పరిణామాలపై స్పందించిన త్రిపుర పోలీసులు నలుగురు న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 68 ఖాతాలను మూసివేయాలని, వారి ఐపి, ఫోన్ నంబర్ల వివరాలను అందించాలని ట్విట్టర్కు నోటీసులు పంపారు. అంతేకాకుండా, 68 ట్విట్టర్, 32 ఫేస్బుక్, 2 యూట్యూబ్ ఖాతాలతో సహా 102 సోషల్ మీడియా ఖాతాల మీద నవంబర్ 5న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ 102 మందిలో ఆరిఫ్ షా, CJ వెర్లెమాన్, జహంగీర్ అలీ, సలీం ఇంజనీర్, సర్తాజ్ ఆలం, షర్జీల్ ఉస్మానీ, శ్యామ్ మీరా సింగ్, ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ ఛైర్మన్ జఫరుల్ ఇస్లాం ఖాన్తో సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు, కార్యకర్తలు ఉన్నారు. లక్ష్యంగా చేసుకొన్న వారిలో ఎక్కువ మంది ముస్లింలు వున్నారు అనేది చాలా స్పష్టం. ఏ హిందుత్వ సంస్థపైనా చర్యలు తీసుకోలేదు. త్రిపుర పోలీసుల, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో సోషల్ మీడియా పోస్ట్లు నకిలీ సమాచారాన్నిస్తున్నాయి అని పోలీసులు అంటున్నారు. రాష్ట్ర పోలీసులకు సోషల్ మీడియా ఖాతాల పట్ల వున్న ఈ అయిష్టత, విమర్శించే ఏ స్వరాన్నైనా అణచివేయాలనే లక్ష్యాన్ని కలిగిన వారి వలసవాద మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. ఇది ఇలా వుండగా, బిజెపి నేతృత్వ పాలనలో ఉన్న పొరుగు రాష్ట్రం అస్సాంలో, ప్రధానంగా బరాక్ లోయ స్థితి అత్యంత అప్రమత్తంగా ఉంది, ఈశాన్య రాష్ట్రాలలో మతపరమైన భిన్న రేఖల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే లక్షణం ఇటీవలి కాలంలో పెరిగింది. అణగారిన కులాలు, తరగతులు, వర్గాలపై దాడులు పెరుగుతున్న వేళ, నేరస్తులను రక్షించడానికి రాజ్యాధికారాన్ని బహిరంగంగా ఉపయోగించుకోవడం కల్పిత కుట్రల ద్వారా వారి దృష్టిని మరల్చడానికి చాలా చురుకుగా పనిచేయడం చాలా తరచుగా జరుగుతోంది.
త్రిపురలో కుట్ర జరిగింది అనడం నమ్మశక్యం కాదు, ʹకుట్రలʹ జాబితాకు అది ఒక అదనపు చేర్పు మాత్రమే. హత్రాస్లో అత్యాచారం, హత్యకు గురైన దళిత యువతి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు ధైర్యం చేసినవారు కుట్ర పన్నారని, CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణ, ఆ తరువాత ఈశాన్య ఢిల్లీలో క్రూరమైన ముస్లింల వ్యతిరేక హత్యాకాండ ఇందులో ఉన్నాయి. హింసకు పాల్పడిన హిందూత్వ నాయకులను రక్షిస్తూ, ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే కల్పిత ఆరోఫణతో భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడంలాంటి కేసులన్నీ యిందులో వున్నాయి. జెండర్, కులపర దురాగతాలు, మత విభజన చట్టాలు, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యత వంటి ముఖ్యమైన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి ఈ అన్ని కేసుల్లోనూ ప్రభుత్వమూ, పోలీసులూ నేరస్థులతో కుమ్మక్కై అనేక మందిపై కుట్ర కేసులు పెట్టారు. ఇటీవల, ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వైదొలగడంపై సోషల్ మీడియా పోస్ట్లు పెట్టినందుకు అస్సాంలో 16 మందిపై, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నందుకు కాశ్మీరీ విద్యార్థులపై UAPA కేసులు పెట్టడం అనేది హిందూత్వానికి జీర్ణంకాని ఈ విషయాన్నైనా చేర్చడం కోసం ʹచట్ట వ్యతిరేకʹ నిర్వచనం ఎలా విస్తరించబడిందో చూపిస్తుంది. అంతులేని సంవత్సరాల జైలు నిర్బంధమే ఒక శిక్షగా వున్న కఠినమైన UAPA ద్వారా భిన్నాభిప్రాయాలను అంతం చేయడం జైలులో పెట్టడం, అంతిమంగా వారిని నిశ్శబ్దపరచడమే దీని ఉద్దేశం.
UAPA సహాయంతో ఈ ʹకుట్రʹలు రాజ్య ఏజెంట్లను రక్షించడానికి, దాని విమర్శకులను జైలులో పెట్టడానికి ఉపయోగపడటమే కాకుండా మరింత పెద్ద ప్రయోజనాన్ని కూడా కలిగిస్తాయి. వారు ప్రజల మనస్సుల్లో అంతర్గతంగా శత్రువులు చుట్టుముట్టిన అనుభూతిని కలిగిస్తారు. అణగారిన కులాలు, వర్గాలు, సముదాయాలు, అసమ్మతివాదులు, రాజ్య యథాతథ స్థితిని కొనసాగించడానికి వ్యతిరేకంగా వున్నవారెవరైనా దేశద్రోహులుగా పరిగణించబడతారు. జర్మనీలో నాజీ రాజ్య స్థాపనలో రీచ్స్టాగ్ ఫైర్ పాత్ర మాదిరిగానే, భారత రాజ్య కల్పిత ఈ కుట్రలు బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం పూర్తి స్థాపనకు మార్గాన్ని సుగమం చేస్తాయి. కార్మిక, రైతాంగ, విద్యార్థి, మేధావి, ఆదివాసీ, దళిత, ముస్లిం, మహిళల హక్కుల కోసం తమ జీవితాలను గడిపిన వ్యక్తుల్ని ఇలా కుట్రకేసుల్లో ఖైదు చేయడం, పీడిత, అణగారిన వర్గాల స్వరాన్ని, హక్కులను హరించివేసే పథకానికి సరిగ్గా సరిపోతుంది.
త్రిపురలో మత హింస, నలుగురు లాయర్లకు నోటీసులు, సోషల్ మీడియా ఉపయోగించిన 102 మందిపై ఆరోపణలు మన ప్రజాస్వామ్య హక్కులపై దాడిలో భాగమే.మనం సమైక్యంగా ఈ దాడిని సవాలు చేయాలి. న్యాయవాదులు, సోషల్ మీడియాను ఉపయోగించేవారిపై పెట్టిన ఈ కల్పిత కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, త్రిపురలో హింసకు కారణమైన నేరస్థులపై విచారణ జరిపి శిక్షించాలనే డిమాండ్తో సమాజంలోని అన్ని ప్రజాస్వామ్య, ప్రగతిశీల వర్గాలు సమైక్యం కావాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CASR) విజ్ఞప్తి చేస్తూంది.
Campaign Against State Repression
(Organising Team: AISA, AISF, APCR, BCM, Bhim Army, Bigul Mazdoor Dasta, BSCEM, CEM, CRPP, CTF, Disha, DISSC, DSU, DTF, IAPL, IMK, Karnataka Janashakti, KYS, Lokpaksh, LSI, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, Mehnatkash Mahila Sangathan, Morcha Patrika, NAPM, NBS, NCHRO, Nowruz, NTUI, Peopleʹs Watch, Rihai Manch, Samajwadi Janparishad, Satyashodak Sangh, SFI, United Against Hate, WSS)
Keywords : tripura, UAPA, Attack on muslims, advocates,Tripura Police Invoke UAPA Against Lawyers Over Fact-Finding Report On Communal Violence
(2024-04-24 23:07:19)
No. of visitors : 894
Suggested Posts
| గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలుఅక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు.... |
| హంతకుల రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న సీపీఎం స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి.. |
| మత హింస గురించి రాసినందుకు ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు - బెయిల్ మంజూరు చేసిన కోర్టుత్రిపురలో ఈ మధ్య జరిగిన ముస్లింలపై దాడులకు సంబంధించిన ఘటనలను రిపోర్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఆదివారం నాడు అరెస్టుచేశారు. సమృద్ధి సకునియా, స్వరణ్ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులను అస్సాం లోని కరీంగంజ్ జిల్లాలో అదుపులోకి తీసుకుని ఆపై త్రిపుర పోలీసులకు అప్పగించారు అస్సాం పోలీసులు. |
| Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
త్రిపురలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా ఓ మసీదును ధ్వంసం చేశారు. ముస్లింల షాపులపై, ఇళ్ళపై దాడులు చేసి దోచుకున్నారు.
|