మత హింస గురించి రాసినందుకు ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు - బెయిల్ మంజూరు చేసిన కోర్టు
15-11-2021
త్రిపురలో ఈ మధ్య జరిగిన ముస్లింలపై దాడులకు సంబంధించిన ఘటనలను రిపోర్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టుచేశారు. అనంతరం కోర్టు వాళ్ళిద్దరికి బెయిల్ మంజూరు చేసింది. సమృద్ధి సకునియా, స్వరణ్ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులను అస్సాం లోని కరీంగంజ్ జిల్లాలో అదుపులోకి తీసుకుని ఆపై త్రిపుర పోలీసులకు అప్పగించారు అస్సాం పోలీసులు. త్రిపురలో ఇటీవల మసీదుపై, ముస్లింల షాపులు, ఇళ్ళపై దాడులు జరగగా ఈ ఇద్దరు జర్నలిస్టులు ఆ ఘటనలు రిపోర్ట్ చేశారు.
అక్టోబర్ 26న విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా పాణిసాగర్ సబ్ డివిజన్లోని మసీదు, పలు దుకాణాలపై దాడి చేయడంతో త్రిపురలో ఉద్రిక్తత నెలకొంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థ నిరసన వ్యక్తం చేసింది. హింసలో మసీదు దగ్ధం కాలేదని పోలీసులు పేర్కొన్నారు.
కాగా స్థానిక VHP కార్యకర్త కంచన్ దాస్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు జర్నలిస్టులపై త్రిపుర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉనకోటి జిల్లాలోని పాల్ బజార్ ప్రాంతంలో ముస్లిం సముదాయానికి చెందిన వారిని కలిసినప్పుడు సకునియా, ఝాలు హిందూ సముదాయానికి, త్రిపుర ప్రభుత్వానికి వ్యతిరేకంగా "ప్రేరేపిత ప్రసంగాలు" చేశారని వారు ఆరోపించారు. జర్నలిస్టులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120 (బి) (నేరపూరిత కుట్రకు శిక్ష), 153 (ఎ) (వివిధ సమూహాల మధ్య వైమనస్యం, శత్రుత్వం లేదా ద్వేషాన్ని పెంపొందించడం) 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఆరోపణలు ఉన్నాయి.
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం సకునియా, ఝాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జర్నలిస్టుల యజమాన్య HW న్యూస్ నెట్వర్క్ ఒక ప్రకటనలో ధృవీకరించింది. అనంతరం అసోం పోలీసులు వారిని త్రిపుర పోలీసులకు అప్పగించారు.
అస్సాం పోలీసులు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న తర్వాత, వారిని కరీంగంజ్ జిల్లాలోని నీలాంబజార్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్లు సకునియా ట్వీట్లో తెలిపారు.
" త్రిపురలోని గోమతి జిల్లా ఎస్పీ మమ్మల్ని నిర్బంధించమని ఆదేశించారని నీలాంబజార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి ద్వారా మాకు సమాచారం అందింది" అని సకునియా ట్వీట్ చేశారు. పాల్ బజార్ ప్రాంతంలో మసీదును తగలబెట్టారని సకునియా, ఝా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్పై ఆరోపణలు చేశారని వారిపై కంచన్ దాస్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. త్రిపురలోని మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, విశ్వహిందూ పరిషత్, త్రిపుర ప్రభుత్వాల పరువు తీయడమే జర్నలిస్టులు నేరపూరిత కుట్రలో భాగమని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఆదివారం ఉదయం తనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కాపీ ఇచ్చారని, తాము బస చేసిన హోటల్ బయట 15 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సకునియా ఆదివారం ఉదయం విడుదల చేసిన వీడియో ప్రకటనలో తెలిపారు.
తమ ఇద్దరి జర్నలిస్టుల ఆధార్, ప్రయాణ వివరాలను కూడా పోలీసులు తీసుకున్నారని సకునియా చెప్పారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం HW న్యూస్ నెట్వర్క్ తన ప్రకటనలో తమ జర్నలిస్టులపై ఎలాంటి కేసు లేదని పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 46 మేజిస్ట్రేట్ ఆదేశం లేకుండా సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడానికి అనుమతించదని, పోలీసులు ఈ విధానాన్ని పాటించడం లేదని ప్రకటన పేర్కొంది.
జర్నలిస్టులిద్దరినీ ప్రశ్నించడానికి తిరిగి త్రిపురకు తీసుకెళ్తామని అసోం పోలీసులన్నట్లుగా ఆ ప్రకటనలో చెప్పారు. ఇద్దరు జర్నలిస్టులను త్రిపురలో వారు బస చేసిన హోటల్ నుంచి తమ రాష్ట్రం వెళ్ళడానికి అనుమతించారు, కాని తరువాత త్రిపుర పోలీసుల సూచన మేరకు అస్సాంలో అదుపులోకి తీసుకున్నారు.
మరో వైపు త్రిపుర పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టులు స్వర్ణ ఝా, సమృద్ధి సకునియాలకు అగర్తల చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఈరోజు (సోమవారం) బెయిల్ మంజూరు చేసింది. ఈ ఇద్దరు జర్నలిస్టులను త్రిపుర పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచగా ఒక గంట విచారణ అనంతరం కోర్టు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా, త్రిపురలోని ఏ మసీదుకు నష్టం జరగలేదని హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపిందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. రాష్ట్రంలో ఏదైనా ఘర్షణలో గాయాలు, అత్యాచారం లేదా మరణం సంభవించినట్లు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. త్రిపురలోని గోమతి జిల్లాలోని కక్రాబన్ ప్రాంతంలో ఒక మసీదు దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ వార్తా నివేదికలు నకిలీవి, వాస్తవాలను పూర్తిగా తప్పుగా చూపించాయి" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో యింకా పోలీసుల ప్రతిస్పందన తెలియరాలేదు.
అయితే ప్రభుత్వ వాదనలు అబద్దమని వాస్తవ తనిఖీ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ శనివారం నివేదించింది. పాణిసాగర్లోని పూర్వ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపులో ఉన్న మసీదును ధ్వంసం చేసి, తగులబెట్టారని స్థానిక జర్నలిస్టులతో సహా పలువురు తమ వెబ్సైట్తో చెప్పారని ఆల్ట్ న్యూస్ తెలిపింది. ఆల్ట్ న్యూస్ ప్రకారం, ఈ మసీదు రోవా జామ్ మసీదు నుండి 3 కిలోమీటర్ల దూరంలో వుంది.
ఆల్ట్ న్యూస్తో పాటు, అల్ జజీరా, ఆర్టికల్ 14 కూడా పూర్వ CRPF క్యాంపులో మసీదును తగలబెట్టిన చిత్రాలను చూపించాయి.
Keywords : tripura, muslims, anti-Muslim violence in Tripura , Journalists, Samriddhi Sakunia Swarna Jha,Tripura Police detain two journalists who were booked for covering communal violence in the state
(2024-04-24 23:06:46)
No. of visitors : 1040
Suggested Posts
| గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలుఅక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు.... |
| హంతకుల రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న సీపీఎం స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి.. |
| త్రిపురలో ముస్లింలపై హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లపై UAPA -ప్రజాసంఘాల ప్రకటననవంబర్ 3న, త్రిపుర పోలీసులు ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులకు ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ నోటీసులు పంపారు. |
| Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
త్రిపురలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా ఓ మసీదును ధ్వంసం చేశారు. ముస్లింల షాపులపై, ఇళ్ళపై దాడులు చేసి దోచుకున్నారు.
|