పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన
మార్చి 24 న జైలు నుండి విడుదలైన గజ్జెల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న సైద్ధాంతికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజారిపోయాడని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. ఈ మేరకు వికల్ప్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...
గజ్జెల సత్యం రెడ్డి అలియాస్ గోపన్న సైద్ధాంతిక-రాజకీయ పతనాన్ని తీవ్రంగా ఖండించండి!
నల్లగొండ జిల్లా, సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గజ్జెల సత్యం రెడ్డి గోపన్న పేరుతో 25 సంవత్సరాల పాటు దండకారణ్య విప్లవోద్యమంలో పనిచేసి, ఆ ఉద్యమ ఉన్నత కమిటీ ʹదండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీʹ సభ్యుడిగా ఎదిగాడు. 2006లో అరెస్టయి 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించి మార్చి 24 న విడుదలయ్యాడు. అయితే ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా విప్లవంలో ద్రుఢంగా నిలబడడం అనే నిబద్దతను ఆయన కొనసాగించలేకపోయాడు. విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడు.
విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంత-రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చి, విలువలూ, ఆదర్శాలనూ తుంగలోతొక్కి తన సుదీర్ఘ విప్లవ జీవితానికి సైతం పరమ స్వార్థంతో తలవంపులు తెస్తూ తన జీవచ్ఛవంలాంటి బతుకుదెరువు కోసం పాలకవర్గాల ముందు ప్రాణ తీపితో దేబరించాడు. ఆత్మ వంచనతో నిరంకుశ పాలకవర్గాలను కీర్తించాడు. సత్యం రెడ్డి దిగజారుడును దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా అసహ్యించుకుంటూ ఖండిస్తున్నది.
తెలిసీ తెలియని వయసులో, ఆ వయసులో వుండే జోష్ (ఉత్సాహం)లో పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకుండా విప్లవోద్యమంలోకి వెళ్లానని ఆయన చెప్పడం తనను తాను మోసగించుకోవడమే! ఇలా చెప్పడం ద్వారా అమాయకులను విప్లవోద్యమంలో చేర్చుకుంటున్నారని పాలకవర్గాలు చేస్తున్న దుష్ప్రచారానికి ఆయన వంత పాడుతున్నాడు. అర్థం చేసుకోకుండానే ఉద్యమంలో చేరి 25 ఏళ్ల పాటు పనిచేశానని చెప్పుకోవడం ద్వారా ఆయన తన సుదీర్ఘ విప్లవ చరిత్రను రద్దుచేసుకోవడమే కాదు ఆత్మ వంచనతో తనను తానే అపహాస్యం చేసుకున్నాడు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చిన టీ. ఆర్.ఎస్. (కేసీఆర్) ప్రభుత్వం, తన వాగ్దానాలను బుట్టదాఖలా చేస్తూ ప్రజలకు ఏ విధంగా దగా చేసిందో, ప్రశ్నిస్తున్న, పోరాడుతున్న ప్రజలపై ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నదో, ప్రజా ఉద్యమాలపై, విప్లవోద్యమంపై ఎంతగా నిప్పులు కురిపిస్తున్నదో జగమెరిగిన సత్యాన్ని సత్యం రెడ్డి చూడడం లేదు. ఇటువంటి నిరంకుశ పాలనను సిగ్గు లేకుండా పొగుడుతూ రాష్ట్రంలో రాపిడ్ డెవలప్ మెంట్ జరుగుతున్నదనీ, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పడమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, వర్తమాన పోరాటాలను అవహేళన చేయడమే. అంతే కాదు తనను సుదీర్ఘకాలం జైల్లో బంధించి, జైలు గేటు వద్దే పలుమార్లు అరెస్టు చేసిన రాజ్య నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆయన ఆ ఇంటర్వ్యూలో పెదవి విప్పలేదు. అట్లా ఆయన తనను తాను వంచించుకున్నాడు.
25 సంవత్సరాల పాటు దండకారణ్య ప్రజలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అటువంటి ప్రజలపై నేడు ఫాసిస్టు పాలక వర్గాలు తీవ్రమైన అణచివేతను కొనసాగిస్తున్నయి. అయినప్పటికీ ప్రజలు పాలకవర్గాలకు లొంగకుండా తెగించి పోరాడుతున్నారు. అటువంటి ఎందరో ప్రజానీకాన్ని జైలు పాలు చేస్తున్న విషయం కూడా సత్యం రెడ్డికి ప్రత్యక్షంగా తెలుసు. కొంతమంది జైళ్ళల్లోనే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. జైలు కడగండ్ల జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని విడుదలైన తర్వాత అత్యధిక ప్రజలు తిరిగి విప్లవోద్యమ పక్షాన నిలబడుతున్నారు. కానీ సత్యం రెడ్డి మాత్రం పాలక వర్గాల ముందు అంతిమంగా తన విడుదలకోసం లొంగిపోయి దిక్కుమాలిన బతుకుతెరువు కోసం సర్కార్ను చేయిచాచి డబ్బూ, భూమి, ఇల్లు అడుక్కునే హీన స్థితికి చేరుకున్నాడు.
ఆయన దివాళాకోరుతనాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
అంతేకాదు విప్లవోద్యమంలో అమరత్వం చెందిన తన మొదటి సహచరి గురించి ఆయన చెప్పుకున్నాడు. కానీ తను పునర్వివాహం చేసుకున్నట్టుగానీ, తన సహచరి కామ్రేడ్ శాంతక్క విప్లవోద్యమంలో ద్రుఢంగా ముందుకు సాగుతున్న విషయం కానీ ఆయన ప్రస్తావించడానికైనా సాహసించలేదు.
నిజానికి ఆయన పతనం ఆకస్మికంగా జరిగిన పరిణామం కాదు. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత ఆయన పార్టీ రహస్యాలను ప్రాణానికి మిన్నగా భావించి కాపాడలేదు. పదిహేడేళ్ల పాటు జైలులో గడిపిన సత్యం రెడ్డి జైలును ఒక పాఠశాలగా, ఒక పోరాట కేంద్రంగా భావించలేదు. జైలు అధికారుల అవినీతికీ, అక్రమాలకూ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నడూ గొంతు విప్పలేదు. ఎంతసేపూ తన అవసరాలు తీర్చుకోవడానికే వెంపర్లాడాడు. జైలులో పోరాటం కాదు కదా, కనీసం నినాదం ఇవ్వలేదు. జైలును రణ క్షేత్రంగా మలిచిన ఎందరో కామ్రేడ్స్ నెలకొల్పిన ఉజ్వల వారసత్వాన్ని ఆయన త్రుణీకరించాడు. అలా ఆయన క్రమంగా దోపిడీ పాలక వర్గాల పట్లా, అధికార యంత్రాంగం పట్ల తన స్వార్థం కోసం రాజీ వైఖరిని అవలంబిస్తూ వచ్చాడు. ఈ కారణంగా తోటి ఖైదీల, విప్లవ ప్రజల, విప్లవోద్యమం నుండి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఆ విమర్శల నుండి ఆయన గుణపాఠం నేర్చుకోకపోగా తన విప్లవ చేవను పూర్తిగా కోల్పోయి తుదకు శత్రువుకు లొంగిపోయి జైలు నుండి విడుదలయ్యాడు.
విప్లవోద్యమ క్రమంలో విప్లవకారులు ఎన్నో రకాల కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్బంధం, అరెస్టులు, చిత్రహింసలూ, జైలు జీవితం.... ఇవన్నీ ఈ పరీక్షల్లో భాగమే. వీటన్నింటినీ రాజకీయ, సిద్ధాంత వెలుగులో అర్థం చేసుకొని ధైర్యం, సాహసం, గుండె నిబ్బరం, ద్రుఢ సంకల్పంతో ఎదుర్కొన్న వాళ్లే విప్లవోద్యమంలో కొన ఊపిరి వరకూ కొనసాగుతారు. చరిత్ర పురోగమనంలో భాగమవుతారు. ఆ పురోగమనానికి దిశా నిర్దేశనం చేస్తారు. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోతే చరిత్రలో అమరులై ప్రకాశిస్తారు. ఆ పరీక్షలకు తట్టుకోలేని వాళ్లు తిరోగమనం చెంది చరిత్ర పెంటకుప్పపైకి విసిరివేయబడుతారు. సత్యం రెడ్డి నిర్ద్వంద్వంగా ఈ కోవలోకి చేరుకున్నాడు. విప్లవోద్యమ అంతిమ విజయం పట్ల విశ్వాసాన్నీ కోల్పోవడమే ఆయన పతనానికి ప్రధాన కారణం.
ఎన్నో ఆటుపోట్లనూ, ఒడిదుడుకులనూ, వెన్నుపోట్లనూ, ద్రోహాలనూ నిబ్బరంగా ఎదుర్కొని సహితం పురోగమించిన అనుభవం విప్లవోద్యమానికి ఉన్నది. పొల్లునూ, నెల్లునూ వేరు చేస్తూ, చెత్తనూ, తెట్టునూ పక్కకు తోసేస్తూ చరిత్ర ముందుకే పురోగమిస్తుంది. ఎందుకంటే చరిత్రకు చోదకశక్తులు కొంతమంది నాయకులు కాదు, అసంఖ్యాకమైన సామాన్య ప్రజలే. విప్లవోద్యమానికి నష్టాన్నీ, ద్రోహాన్నీ తలపెట్టే ఇటువంటి శక్తులను ప్రజలూ, ప్రజాస్వామిక వాదులూ ఎండగట్టాలనీ, పాలక వర్గాల చెంతన చేరి వల్లించే వాళ్ళ పలుకులను ఖండించాలని మేం కోరుతున్నాం.
వికల్స్
అధికార ప్రతినిధి
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : cpi maoist, vikalp, gajjela satyam reddy, rtv, dandakaranyam,
(2023-06-02 03:33:56)
No. of visitors : 2152
Suggested Posts
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం. |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం |