ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ

ఐదురాష్ట్రాల్లో

18-11-2023

ఐదు రష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తో చేసిన ఇంటర్వ్యూను మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం...

1.ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలకు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

అధికార ప్రతినిధి జగన్ :- సాధారణంగా మాపార్టీ ప్రస్తుత పార్లమెంట్ వ్యవస్థలో జరుగుతున్న ఎన్నికలను బహిష్కరణ పిలుపు ఇస్తుందనే మా పార్టీ విధానం ప్రజలందరికి తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలో కూడా బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించమని, దేశానికి ప్రమాధికారిగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్లు బీజేపిని, బీజేపికి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ ను తన్ని తరమండి. పత్రి పక్ష పార్టీలను నిలదీయమని పిలుపునిస్తున్నాము. అన్ని రంగాల సమస్యల పరిష్కారానికి మిలిటెంట్ ప్రజా ఉద్యమాలు చేపట్టమని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య, దోపిడీ అనుకూల, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపునిస్తున్నాం.

2. ప్రతి ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తారు. ఎందుకనీ?

అధికార ప్రతినిధి జగన్ :- మనం భారత దేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వభావాన్ని తెలుసుకోవాలి. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య విప్లవం జరిగినట్లుగా మన భారత దేశంలో జరగలేదు. కాని బ్రిటిష్ వలస వాదం భారత దేశంలో బూర్జువా ప్రజాస్వామ్యానికి విప్లవమేది జరకుండానే ఇక్కడి అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్వవస్థకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంటగట్టింది. వాస్తవంగా ఇక్కడి పార్లమెంట్ సామ్రాజ్యవాదులకు భారతదేశ బడా భూస్వాములకూ, దళారీ పెట్టుబడిదారులకు మధ్య పరమ విద్రోహకరంగా ఏర్పడింది. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశ, విదేశీ అభివృద్ధి నిరోధకులు మన ప్రజలపై కొనసాగిస్తున్న అత్యంత దారుణమైన దోపిడి. అణిచివేతను కప్పిపుచ్చడానికి తెరలాగా ఉపయోగపడేది మాత్రమే. ప్రజలకు రాజకీయ అధికారంతో ఏ మాత్రం భాగస్వామ్యం వుండదు. పార్లమెంట్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకొని, మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారిని నిష్క్రియ ప్రేక్షకులుగా పరిమితం చేసే తంతుగా మార్చారు.

పార్లమెంట్ పాలకులు ఉదరగొడుతున్న పార్లమెంట్ ప్రజాస్వామ్యం అనేది పచ్చి బూటకం. వాస్తవానికి ఈ 75 సంవత్సరాలుగా పార్లమెంట్ వ్యవస్థలో ప్రతి ఐదు సంవత్సారాలకు ఒక సారి ఓట్ల తంతు జరుగుతూనే వుంది కాని పార్లమెంట్ చరిత్రలో ప్రజలకు ఒరిగింది ఏమిటంటే ప్రజలు తీవ్రమైన దారిద్ర్యం, అణిచివేత మాత్రమే. పార్లమెంట్ ప్రజాస్వామ్యం అనే ముసుగులో దోపిడి పాలక వర్గాలు సామ్రాజ్యవాదులు, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, భూస్వామ్య వర్గాల దోపిడి అనుకూల విధానాలకు చట్టాలు, జీవోలు చేస్తూ దేశ సంపదను వారికి దోచిపెడుతున్నారు. ప్రజలపై అణిచివేత చట్టాలు రూపొందించి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు. అందుకే సామ్రాజ్యవాద, బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాల నియంతృత్వానికి సాధనంగా వున్న పార్లమెంట్ అనే ముసుగును చించి దాని నిజ స్వభావాన్ని అర్థం చేసుకొని ఎన్నికలను బహిష్కరించాలి.

3. ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటేనే కదా! ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం వుంటుంది. ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయితేనే కదా ప్రజలు బాగుపడే అవకాశం వుంటుంది? మీరు వద్దంటే మీ మాట విని ప్రజలు ఓట్లు వేయక పోతే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? ఎలాగూ మీ దగ్గరకు రాలేరు? మీరు ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు? మరి ప్రజల పరిస్థితి ఏంటి?

అధికార ప్రతినిధి జగన్ :- నిజంగానే ఎన్నికలు పారదర్శకంగా జరిగి, ప్రభుత్వాలు చెపుతున్న సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరి వారి మౌళిక సమస్యలు పరిష్కరించబడ్డాయని మీరనుకుంటున్నారా?
నేను ముందే చెప్పాను. ఈ పార్లమెంట్ వ్యవస్థ కేవలం దోపిడి పాలకుల ప్రయోజనాలు మాత్రమే కాపాడుతుంది. లేదా వారికి సేవ చేస్తుందని. ఎన్నికల పార్టీలన్నీ ఇప్పటి వరకు అనేక పర్యాయాలుగా అధికారాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసిన వాళ్ళే. అధికారంలోవున్నంత కాలం ప్రజల సంక్షేమాన్ని, ప్రజల మౌళిక సమస్యలను గాలికి వదిలిన బూర్జువా పార్టీలన్నీ సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసినవే. ఇలాంటి వ్యవస్థలో ప్రజల సంక్షేమం అంటే నేతి బీరలో నెయ్యి వెతుక్కోవడమే.

2014లో అధికారంలోకి రాక మనుపు కేసిఆర్ కుటుంబం ఆర్థిక స్థితి ఏంటి? అధికారంలోకి వచ్చాక వారి స్థితి ఏంటి? కేసిఆర్ అధికారంలోకి రాక ముందు బడా భూస్వామి మాత్రమే. కాని ఈ రోజు దళారీ నిరంకుశ బడా పెట్టుబడి దారుడుగా అవతారమెత్తారు. కేసిఆర్ కుటుంబంతో పాటు రాష్ట్ర సంపదంతా కొద్ది మంది దళారీ బడా బూర్జువాల దగ్గర పోగు అయింది. మెగా కృష్ణారెడ్డి, మురళి దివి కుటుంబం, P. పిచ్చిరెడ్డి, PV. కృష్ణారెడ్డి, B. పార్ధసారథి రెడ్డి కుటుంబం, రాంప్రసాద్ రెడ్డి, C. ప్రతాప్ రెడ్డి కుటుంబం, మైహోం రామేశ్వర్రావు లాంటి కొద్ది మంది దోపిడి దారుల చేతుల్లో పోగుపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఎంత జరిగింది అనేది ప్రజలందరికి తెలిసిందే.

కాళేశ్వరం వలన గోదావరి పరివాహక ప్రజలకు చుక్క నీరు అందడం లేదు. కాని మల్లన్న సాగర్ లోకి కాళేశ్వరం నీళ్ళు తరలించి కేసీఆర్, కేసీఆర్ లాంటి భూస్వాములు మాత్రమే కాళేశ్వరం నీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వీరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఇసుక మాఫియా. రియల్ ఎస్టేట్ మాఫియా, గ్రానైట్ విస్తరించాయి, నారాయణ పేట్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం చిత్తనూర్ గ్రామం వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కల్పించిన అనుమతులతో ప్రజలు వ్యతిరేకిస్తున్న దళారీ నిరంకుశ బూర్జువాలైన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థ సారధి రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బంధువులు) యాజమాన్యంలో 2022 ఫిబ్రవరి 06న ఆర్గానిక్ ఫార్మ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థ ఇథనాల్ పరిశ్రమను 500.5 ఎకరాల్లో నెలకొల్పారు. పెబ్బర్ మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్న ఏబిడి కంపెనీ మరొక్కటి నెలకొల్పారు. బలవంతంగా నెలకొల్పిన ఈ కంపెనీలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హరిత హారం, టైగర్ జోన్ ల పేరుతో సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం ఆదివాసులను అడవుల నుండి తరిమేస్తున్నారు., ఇలా చెపుకుంటూ పోతే రాష్ట్రంలో దోపిడి పాలకుల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలతో పేరుతో దోపిడి దారుల బొక్క నిండుతుంది. ప్రభుత్వాలు చెప్పుతున్న అభివృద్ధి పచ్చి అబద్దం.

మీరు అడిగిన మరో ప్రశ్ర ఏంటంటే వద్దంటే మీ మాట విని ప్రజలు ఓట్లు వేయక పోతే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? ఎలాగూ మీ దగ్గరకు రాలేరు? మీరు ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు? మరి ప్రజల పరిస్థితి ఏంటీ? అని ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రజల అభివృద్ధి కోసం రాజకీయ అధికారాన్ని కోరుకుంటున్నారు. ప్రజల ప్రజా స్వామిక వ్యవస్థను కోరుకుంటున్నారు. లేదంటే ప్రజల పోరాడి సాధించుకుంటారు.

4. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మాత్రమే బహిష్కరించాలని పిలుపునిస్తున్నారా? గతంలో విద్యార్ధి సంఘం ఎన్నికల్లో పాల్గొంది. ఎందుకనీ?

అధికార ప్రతినిధి జగన్ :- దోపిడి వర్గాల అనుకూల పార్లమెంట్ వ్యవస్థలో జరుగుతున్న ఏ ఎన్నికలనైన బహిష్కరిస్తాం. ఇక్కడ విద్యార్థి సంఘంగా వారి సమస్యలపై పోరాడింది. రాడికల్ విద్యార్థి సంఘం అనేది ఒక పోరాట సంఘం కావున విద్యార్థి సంఘం ఎన్నికలలో పాల్గొంటుంది. అది విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల మౌళిక సమస్యల పరిష్కారానికి, విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా, విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా, శాస్త్రీయ విద్య విదానం కోసం పోరాటాలు చేపట్టింది. సామాజిక పోరాటాలలో ప్రజలను చైతన్య పరిచింది. అది మింగుడుపడని దోపిడి పాలక ప్రభుత్వాలు, ఏబివిపి గుండాలు, పోలీసులతో దాడులు చేయించారు. విద్యార్థి సంఘంపై తీవ్రమైన అణిచివేతను ప్రయోగించారు. చాలా మంది విద్యార్థులను తీసుకెళ్ళి కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని కట్టు కథలు అల్లారు. కొద్ది మంది రాడికల్ విద్యార్థులను మాయం చేశారు.

5. ప్రజలకు అభ్యర్ధులు ఇష్టం లేక పోతే నోటా ఆప్షన్ కూడా వుంది. దాన్ని వాడుకుంటారు. ప్రత్యేకంగా బహిష్కరణ పిలుపు ఎందుకు?

అధికార ప్రతినిధి జగన్ :- నోటా ఆప్షన్ అనేది ఈ వ్యవస్థపై నమ్మకం కల్పించే పెద్ద మోస పూరితమైన ఎత్తుగడ మాత్రమే. వాస్తవానికి ఈ వ్యవస్థను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే ప్రజలు నిర్ద్వంద్వంగా బహిష్కరిస్తారు. ప్రభుత్వాలు చెప్పే తప్పుడు లెక్క ప్రకారమైన ఇప్పటికీ వంద శాతం ఓట్లు ఏనాడు సాధించలేదు. వాళ్ళంతా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లే కదా.

పాలక పార్టీలు అధికారం చేపట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రజల రాజకీయ వెనకబాటు చైతన్యాన్ని ఆసరా చేసుకొని అబద్దపు వాగ్దానాలూ, డబ్బు, మద్యం, కులం, మతం అనే దుర్మార్గాలను ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఓట్లు వేయని వారికి సంక్షేమ పథకాలు వర్తించవని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా కాదుకదా ఓట్ల పార్టీలన్నీ జుగుప్సాకరంగా ఓట్లను కొంటున్నాయి. మరో ప్రక్క నోటా పేరుతో ఇష్టమున్న అభ్యర్థికి ఓటు వేయమని లేదంటే నోటాకు వేయమనే ఆప్షన్ పెట్టి ఈ దోపిడి వ్యవస్థపై ప్రజలకున్న తిరస్కారాన్ని కుట్ర పూరితంగా ఒక అభ్యర్థికి పరిమితం చేసి చూపిస్తున్నారు. ఇది ఒక అభ్యర్థికి సంబంధించిన అంశం కాదు కదా ఈ వ్యవస్థకు సంబంధించిన అంశం. ప్రజల రాజకీయాధికారానికి సంబంధించిన అంశం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపితే ఖచ్చితంగా ప్రజలు ఓట్లను బహిష్కరిస్తారు.

6. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లింది. కాలంతో పాటు ఆప్డేట్ కాక పోవడం వల్ల ప్రజలకు దూరమవుతున్నారన్న విమర్శ వుంది. మీరేమంటారు? దాదాపు 150 సంవత్సరాల క్రితం కారల్ మార్క్స్ అర్ధం చేసుకున్న సమాజ నిర్మాణమే ఇప్పటికీ ఉందంటరా? ఎలాంటి మార్పులకు లోనూ కాలేదంటారా?

అధికార ప్రతినిధి జగన్ :- కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందని దోపిడి వర్గాలు మానసిక యుద్ధంలో భాగంగా చేస్తున్నా దుష్ప్రచారం. మార్క్సిజం ఆధునిక శాస్త్రీయ సామాజిక సిద్ధాంతం కాబట్టి అధునికతను విమర్శనాత్మకంగా అర్ధం చేసుకోవడం సులభమే. చరిత్ర ప్రతి శకం ఆర్ధిక ఉత్పత్తి నుండి తప్పనిసరిగా తలెత్తే సామాజిక, రాజకీయ వైరుద్యాలు వుంటాయి. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య సమాజంలో కూడ అసమానతలకు కారణం దోపిడి. దోపిడి అణిచివేతలు ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు వుంటాయి. ఇప్పుడు సమాజం గ్లోబలైజేషన్ మూలంగా దేశంలోగాని, రాష్ట్రంలో గానీ చాలా మార్పులు వచ్చిన మాట వాస్తవమే. దోపిడి రూపం మార్చుకుంది కాని శ్రమ దోపిడి మారలేదు.

ఉదాహరణకు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, రంగంలోకి వచ్చిన తరువాత భారత ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థతో మరింతగా విలీనం చేశారు. పర్యవసానంగా దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లోకి కూరుకుపోయి వున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మున్నెన్నటి కంటే తీవ్రతరమవుతూ రోజు రోజుకు బయటపడలేని పెద్ద సుడిగుండపు అగాధంలోకి జారిపోతున్నది. అందుకే ప్రస్తుతం సంక్షోభం దేశాన్నే కాదు మన రాష్ట్రాన్ని కూడా పట్టి పీడిస్తున్నది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు పోరాడుతున్నారు. దోపిడి అణిచివేతలు అంతకంతకు పెరిగి నేటి సమాజంలో అసమానతలు పెరిగాయి. కావున చరిత్ర అంతా పీడిత వర్గాలకు, దోపిడి వర్గాలకు, మద్య జరిగే పోరాటాల చరిత్రనే.

ఈ పోరాటాలు ఏ దశలో వున్నాయంటే దోచుకుని అణిచివేసే వర్గం నుండి పీడిత ప్రజలు తనను తాను విముక్తి పొందాలంటే అదే సమయంలో సమాజాన్నంతటినీ దోపిడి పీడన నుంచీ శాశ్వతంగా విముక్తి చేస్తేగాని పీడిత ప్రజలు విముక్తి కారు. మార్క్సు కాలానికి, నేటికి పరిస్థితులలో ఎంత మారినప్పటికీ మార్క్స్ చెప్పిన మూల సూత్రాలు ఈ నాటికీ వాటి యథార్థతను నిలబెట్టుకున్నాయి. మార్క్సు మూల సూత్రాలు సర్వత్రా, సర్వకాలలో చారిత్రిక పరిస్థితులపై ఆధారపడి వుంటుంది.
ఇక ప్రజలకు దూరమవుతున్నమన్న విషయానికి వస్తే తెలంగాణలో పట్టణ, మైధాన, అటవి ప్రాంతాల్లో మా పార్టీ బలహీన పడ్డ మాట వాస్తవమే, కాని మేము ఎప్పుడు ప్రజలకు దూరం కాలేదు. మా పార్టీ రహస్య పార్టీ మా వ్యూహాంలో వివిధ పద్ధతుల్లో పోరాట, నిర్మాణ రూపాలుంటాయి. దాన్ని అనుసరించే మా ఆచరణ కొనసాగుతుంది.

మా పార్టీ ప్రజల మద్య లేకుంటే నిరంతరం శతృవు మా పార్టీపై, ప్రజలపై, ప్రజా సంఘాలపై ఎందుకు దాడులు కొనసాగిస్తున్నట్లు. అర్బన్ నక్సలైట్ల పేరుతో, కలంధారీ మావోయిస్టుల పేరుతో ఎస్ఐఏ దాడులు ఎందుకు కొనసాగుతున్నట్లు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి పోరాటంలో మావోయిస్టులు వున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రజా పోరాటలతో దోపిడి వర్గాలు ఎంత గందరగోళ పడుతున్నాయో ప్రజలందరికి తెలుసు. కాని మావోయిస్టులను నిర్మూలించామని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందని శతృవు దుష్ప్రచారంతో మానసిక యుద్ధం చేస్తున్నాడు.

7. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే పంథా ఇప్పుడున్న పరిస్థితితులలో సాధ్యమయ్యే పనేనా?

అధికార ప్రతినిధి జగన్ :–ఈ సమాజం బడా భూస్వామ్య, దళారి నిరంకుశ బూర్జువా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాద దోపిడి వర్గాల పునాదులపై నిర్మతమై వుంది. మన భారతదేశంలో ఈ మూడు వర్గాలు ఒక దానిపై ఒకటి పరస్పరం ఆధారపడి వుంటాయి. సామ్రాజ్యవాదానికి భారత దళారీ బూర్జువా వర్గం, భూస్వామ్య వర్గం సేవలు చేస్తూ వుంటాయి. వీరి చేతుల్లో రాజకీయాధికారం వుండడంతో ప్రజలపై దోపిడి అణిచివేతలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రజలు అసమానతలు, దారిద్ర్యం, దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు.

మన దేశంలో ఉనికిలో వున్న అర్ధ వలస, అర్ధ భూస్వామ్య రాజకీయాలు, ఆర్ధికం, సంస్కృతులను ద్వంసం చేసి నూతన ప్రజాస్వామిక రాజకీయాలు, ఆర్ధికం, సంస్కృతులను నెలకొల్పాలంటే ప్రస్తుత సమాజపు పునాది వర్గాలను కూల్చి జనతా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం తప్ప ప్రజలకు మరో మార్గం లేదు. శిధిలమవుతున్న ఏ శక్తి తన అధికారాన్ని సులభంగా వదులుకోదు. బలవంతగానే దోపిడి వర్గాల నుండి ప్రజలు రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవాల్సి వుంటుంది.

ఇప్పుడు వ్యవస్థపై నిరాయుధులైన ప్రజలు సాయుధ సైన్యాలకు వ్యతిరేకంగా నిలబడి ప్రతిఘటించలేక పోతున్నారు. అందుకే ప్రజాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సాయుధ పోరాటం చేపట్టటమే మా రాజకీయాల్లో ప్రధానాంశం. దోపిడి అణిచివేతల నుండి ప్రజలు రాజకీయంగా చైతన్యం అవుతారు. ప్రజా ఉద్యమాల ప్రయోజనాల రీత్యానే ప్రజలు ఆయుధాలు పడుతారు. శతృవుతో తలపడడానికి సాయుధ యూనిట్లుగా ఏర్పడుతారు. మా వ్యూహాం ఎత్తుగడల ప్రకారం ప్రాంతాల వారిగానే అధికారాన్ని హస్తగతం చేసుకుంటాము. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కావల్సిన అంశాలన్ని సామాజిక చట్టాల్లో వున్నాయి. ఇది సాధ్యమేనని మేము బలంగా విశ్వసిస్తున్నాము. ఇప్పుడున్న వ్వవస్థ నుండి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ప్రజల చేతిలో ఆయుధాలు లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం గురించి ఆలోచించడం పగటి కల తప్ప ఇంకేమి కాదు.

ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల పేర్లతో చేస్తున్న విచక్షణ రహితమైన హత్యలను చూసి సమాజాన్ని భయపెట్టాలనుకుంటున్నాయి. శతృవుకు ఆయుధాలు వున్నాయి కాబట్టి పైకి చూడడానికి బలవంతుడుగా కనబడవచ్చు. అభివృద్ధి నిరోధక శక్తి కాగితపు పులి. ప్రజలు నిరాయుధంగా బలహీనంగా కనబడవచ్చుగాని కోట్లాది ప్రజల సంఘటిత శక్తి సంకల్పం ముందు వెయ్యి మార్గాలను అనుసరించిన ప్రజా ఉద్యమాలను నిరోధించబడలేవు అనే సంగతి దోపిడి వర్గానికి కూడా తెలుసు. మృత్యువుని దిక్కరించి సాయుధమైనప్పుడు ప్రజలు పోరాటాల్లో విజయాలు సాధించగలరు.

8. సీఎం కేసిఆర్ పాలన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాయనుకుంటున్నారా? కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగు నీటి రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రగతి సాధించామంటున్నారా? ఇందుకు కేంద్ర ప్రభుత్వ నివేదికలు సాక్ష్యం అని సిఎం కేసీఆర్ అంటున్నారు? మీ అవగాహన ఏమిటి?

అధికార ప్రతినిధి జగన్ :- ప్రజలు కోరుకున్నది ప్రజా స్వామిక తెలంగాణ కాని ఇంకా ప్రజాస్వామిక తెలంగాణ సాధించలేదు. ప్రజల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో మోస పూరితంగా కేసిఆర్ అధికారాన్ని చేపట్టాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు గడిచిన ప్రజల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాల్సన అనివార్యత ఇప్పుడు ఏర్పడింది. అధికారంలోకి వచ్చే ముందు బంగారు తెలంగాణ చేస్తానన్నా కేసిఆర్ అవినీతితో తెలంగాణ ప్రజల బ్రతుకులను అధోగతి పాలు చేశాడు. తెలంగాణ ఏర్పడితే నీళ్ళు, నిధులు, నియామకాలు దక్కుతాయని విరోచిత పోరాటాల్లో ముందు వరుసన నిలిచి ఎంతోమంది ఉద్యమ కారులు ప్రాణ త్యాగం చేశారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో పదేళ్ళ నుండి దొరల కుటుంబం పాలిస్తూ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలను కొద్ది మంది దోపిడి దారులు మాత్రమే అనుభవిస్తున్నారు.
వాస్తవానికి ప్రజల మౌళిక సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. నియామకాల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పైగా గ్రూపు-1ను ఉద్దేశ్య పూర్వకంగా అనేక సార్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. నిధులు తెలంగాణ విభజన సమయంలో మిగులు వుండగా ఇప్పుడు అప్పులు మిగిలాయి. నీళ్ళు భూస్వాములకు తప్ప పేద, మధ్య తరగతి రైతులకు చేరలేదు. తాగు,సాగు నీటి రంగంలో మేడిగడ్డ బ్యారేజీ మొన్నటికి మొన్న కుంగిపోయిన సంగతి ప్రజలందరికి తెలిసిందే. లక్షల కోట్లతో నిర్మించిన బ్యారేజీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే కుంగి పోయిందంటే ఎంత అవినీతి జరిగి వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కాకతీయ మిషన్, మిషన్ భగీరథలో పర్సంటేజీ పేరుతో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికి తెలుసు.

ఇక బీఆర్ఎస్ ఏ రంగాల్లో అభివృద్ధి సాధించిందంటే రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియా, అవినీతి, గల్లీ, గల్లీ బార్ షాపులు వంటి రంగాల్లో బ్రహ్మండమైన అభివృద్ధితో మూడు పువ్వులు ఆరు కాయలుగా బీఆర్ఎస్ పాలన సాగుతుంది. అందులో భాగంగానే రాష్ట్రం అప్పుల్లో వుంది. అప్పులు తీర్చడానికి ఖనిస సంపదలను అమ్మేస్తున్నారు. సంక్షోభం వలన ప్రజల ఆదాయం తీవ్రంగా పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు.

కార్పొరేట్ విధానాలు ప్రవేశించిండం వలన రైతులు భూములు కోల్పోయి, పండించిన పంట నష్టపోయిన రైతు అప్పుల పాలై దివాళా తీసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొద్ది మంది వలస కూలీలుగా మారుతున్నారు. విద్య, వైద్య రంగాలు దాదాపు కార్పొరేట్ల చేతుల్లోనే వున్నాయి. సింగరేణి, రవాణా రంగాలు ప్రవేటుపరం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలు లేక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగులు నిత్యం పోరాటాలు చేస్తున్నారు. వీటిని చూసినప్పుడు రాష్ట్రంలో పరిస్థితి – మరింత దీనంగా మారింది. ప్రవేటైజేషన్ వలన వేలాది మంది ఉద్యోగాలు పోతుండగా, కొత్త ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం లక్షల్లో పెరిగింది. బంగారు తెలంగాణ అన్నారు. ప్రజలు బ్రతుకు కొరకు పోరు చేస్తున్నారు. మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటాలు చేపట్టాల్సిన అనివార్యత ఏర్పడింది.

గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలను దగా చేసినా బీఆర్ఎస్ మూడో సారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధమైంది. మరోసారి ప్రజలను మోసగించడానికి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంది. వాస్తవానికి ప్రజల మౌళిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదు. ఎన్నికలు రాగానే రైతు బంధు, ధళిత బంధు, బీసి బంధు, గిరిజన బంధు అంటూ ప్రజలను మాయ చేస్తుంది. భూమి లేని దళితులకు మూడు ఎకరాలు భూమిని ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని గద్దెనెక్కి నాడే మరిచింది. ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి హరిత హారం, యూరేనియం, టైగర్ జోన్ పేర్లతో వ్యవసాయ భూముల నుండి, అటవుల నుండి గెంటి వేస్తూనే మరో పక్క కొద్ది మంది పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదివాసుల సానుభూతిని పొందాలనుకుంటుంది.

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసిఆర్ రైతాంగం పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవు. కౌలు రైతులను పట్టించుకొనూ లేదు. కూలీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవు. సరైనా విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములనూ, భూస్వాముల, బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమనలకు అవకాశాలు కల్పించారు.
టీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో వీలినం చేసి ప్రవేటుపరం చేయాలనే పథకం పన్నారు.

విద్యార్థులకు. నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించక పోగా ఉద్యేశ పూర్వకంగా గ్రూపు-1ను అనేక సార్లు రద్దు చేయిస్తూ వస్తుంది. చేతి వృత్తుల వారికి లక్ష రూపాయాల చేయతనిస్తామని, మొండి చెయి చూపించింది. ఆసరా రైతు బంధు, దళిత బంధు వంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ బంధు మిత్రులు లబ్ది దారులయి వాటాలు పంచుకుంటున్నారు. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కుటుంబం కోట్ల డబ్బును పోగేసుకుంది, రైతాంగానికి చెందాల్సిన ప్రభుత్వ రుణాలు పాలకులు, భూస్వాములు, పొందుతున్నారు. పేద రైతాంగం మాత్రం భూస్వాముల నుండి, వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమాలన్నింటిని దుర్వినియోగం చేసి రాష్ట్ర బడ్జెట్ ఖజనాను ఖాళీ చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించ లేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రం అప్పుల్లో వడ్డీలు చెల్లించడానికి భూములను అమ్ముకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి పట్టింది. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపితో అంతర్గత ఐక్యత వుంది. బీజేపితో అంటకాగుతున్న అవకాశవాద బీఆర్ఎస్ ను తన్ని తరమండి.

9. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపిలు అధికారం లోకి వస్తే ఆకాంక్షలు నెరవేరే అవకాశముందంటారా?
అధికార ప్రతినిధి జగన్ :- బూర్జువా పార్టీలన్ని ఒక తాను ముక్కలే గత 75 సంవత్సరాలగా బీజేపి, కాంగ్రేస్ నాయత్వంలోని ఎన్డీఏ, యూపిఏ కూటమిల ద్వారా పాలించారు. కాని ప్రజల మౌళిక సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడినా, ప్రశ్నించినా వాళ్ళపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన ప్రధాన నాయకత్వాన్ని జైళ్ళలో పెడుతున్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ దాడి మొదలైంది. సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం తప్ప భారత బూర్జువా వర్గం ఏ విధమైన మార్గాలను కనుగొనలేక పోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి దాడిపైనే ఆధారపడుతున్నాయి.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 9 1/2 సంవత్సరాల్లో అమలు చేసిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ, కోవిడ్ లాక్ డౌన్లతో, పలు రైతు, కార్మిక, చిన్న మధ్య తరహ పెట్టుబడిదారుల, ఆదివాసీ, మత మైనార్టీ వ్యతిరేక చట్టాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినిపోయింది. దీంతో చిన్న పెట్టుబడిదార్లు చితికిపోయారు. మధ్య తరగతి, కార్మికులు, రైతాంగం మొత్తంగా దేశ ప్రజానీకపు ఆర్థిక స్థితి ఘోరంగా దెబ్బతిని పోయింది.

దేశంలో మోదీ నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వం గత 9 1/2 సంవత్సరాలుగా అధికారంలో వుండి దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టింది. బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మోదం భారత ప్రజల ప్రధాన శతృవుగా మారింది. కార్మిక వర్గం, రైతాంగం, మేధావి వర్గాలలో విప్లవ శక్తులపై భయంకర కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తుంది. ఇతర మతాల పట్ల పీడిత సామాజిక సెక్షన్ల పట్ల అతి హేయమైన విద్వేషాని రెచ్చ గొట్టే అత్యంత కరుడు గట్టిన బ్రాహ్మణీయ మతోన్మాద దురహంకారానికి పాల్పడుతుంది. బ్రాహ్మణీయ హిందుత్వం రాజకీయ గుత్తధికారాన్ని వెంటనే నెలకొల్పుకోవడానికి పూనుకుంది. తనకు ప్రత్యర్థులుగా వున్న పార్టీలు, గ్రూపులపై భయోత్పాత పాలనతో వేధింపులు తీవ్రం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించిన రాసిన, పాడినావ్యక్తులపై, సంఘాల ప్రతి నిధులపై, మేధావులపై, ప్రోఫెసర్లపై, జర్నలిస్టులపై, ప్రజాస్వామిక వాదులపై, అమాయక ఆదివాసులపై, మావోయిస్టులతో కలిసి హత్యలకు కుట్రలు చేస్తున్నారని, అర్బన్ నక్సలైట్స్ అనే పేరుతో చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కేసులు మోపుతున్నారు, లేదంటే ఎస్ఐఏ దాడులతో వేధిస్తున్నారు.

నియంతృత్వాన్ని దగాకోరు పార్లమెంటరీ పద్దతులను మిళితం చేసి తన వర్గ పునాదిని విస్తృతం చేసుకుంటుంది. భారత రాజ్యంగాన్ని నామమాత్ర సమాఖ్య(పెడరల్) వ్యవస్థను దెబ్బతీసి, బలమైన కేంద్రీకృత బ్రాహ్మణీయ హిందుత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తుంది. అందుకే జమిలి ఎన్నికల పేరుతో 5 చట్ట సవరణలు చేయడానికి సిద్ధపడింది. ప్రతి పక్ష రహిత దేశంగా మార్చే ఏజెండాతో బూర్జువా పార్లమెంటరీ ప్రజ స్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని చేపట్టడం, లేదా తమ తొత్తు గవర్నర్లను నియమించి అక్కడి ప్రభుత్వాలను అస్తవ్యస్తం చేయడం అనేది బీజేపి కుట్ర పూరిత పథకంలో భాగమే.

తన వర్గ ప్రయోజనాల కోసం బీజేపి ఆర్ఎస్ఎస్ కూటమికి అగ్రామిగా పని చేస్తూ ఫాసిజాన్ని అమలు చేస్తుంది. దేశభక్తి పేరుతో అనాగరిక జాతీయ అహంకారాన్ని రెచ్చగొడుతుంది. ప్రజా వ్యతిరేక దేశ ద్రోహకర సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను, దళారీ పెట్టబడిదారి, భూస్వామ్య విధానాలను దూకుడుగా అమలు చేస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ రంగ పరిశ్రమలను, సంస్థలను, ఆస్థులను సామ్రాజ్యవాదులకు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నారు. 26 ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీ, టాటా లాంటి దళారీ పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేసింది. అలాగే మరో 61 ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్ల లిస్టింగ్ లో పెట్టి కార్పొరేట్ల చేతుల్లో పెట్టింది. ఫలితంగా దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఫలితంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. వ్యవసాయం సంక్షోభంలో పడింది. కార్మికులు రోడ్డున పడుతున్నారు. చేతి, వృత్తులు ద్వంసం అయ్యాయి. చిన్న, మద్య వ్యావారులు దివాళా తీస్తున్నారు. నిత్యవసర ధరలు ఆకాశనంటుతున్నాయి.

రానున్న రోజుల్లో రక్షణ రంగ సంస్థను, జీవిత భీమా సంస్థ(LIC)ను, రైల్వే, నౌకాశ్రయాలు, విద్యుత్ రంగ కంపెనీలు ఇలా ఒక్కొక్కటిగా చాలా వరకు ప్రవేటుపరం చేయడానికి సిద్ధంగా వుంది. మొత్తంగా 2047 నాటికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా వుండకూదని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. హిందూ రాష్ట్రం చేయడంలో అర్ఎస్ఎస్, బీజేపి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలున్నాయి. నేడు కొనసాగుతున్న పార్లమెంట్ ప్రజాస్వామ్యం అని చెపుకుంటున్న ఈ వ్యవస్థను కూడా ద్వంసం చేసి అర్ఎస్ఎస్ పునాదులపై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద ఫాసిజపు పరిపాలనను నెలకొల్పడం, అంతిమంగా ఈ దేశ సంపదను దేశ, విదేశీ కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు తెగ నమ్మడమే వీరి లక్ష్యం.

అందుకే ఈ రోజు ప్రజలపై, ప్రజా ఉద్యమాలపై ముఖ్యంగా హిందూ రాజ్య నిర్మాణానికి, ప్రపంచీకరణకు అడ్డంగా వున్న భారత కమ్యూనిస్లు పార్టీ (మావోయిస్టు)పై. ప్రజల జనతనా సర్కార్లపై విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి కొనసాగుతుంది. అత్యంత అభివృద్ధి నిరోధకమైన బ్రాహ్మణీయ హిందుత్వాన్ని విశాల ప్రజా రాశులంతా ఐక్యమై ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆస‌న్నమైంది.

చాలా కాలంగా అధికారాన్ని కోల్పోయి నిరాశ నిస్పృహాల్లో వున్నా కాంగ్రేస్ పార్టీ, కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. యూపిఏ అధికారంలో వున్నప్పుడే ఊపా, ఎన్ఐఏలను తీసుకొచ్చారు. వాస్తవానికి స్వతంత్రం వచ్చిన నుండి కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రేస్ పార్టీనే పరిపాలించింది. ఇన్ని యేండ్ల కాలంలో అమలు చేసినా ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన ప్రజలు ఇప్పటికీ ఆ పార్టీపై అసంతృప్తితోనే వున్నారు.

Keywords : cpi maoist, telangana, elections, jagan, abhay
(2024-04-26 16:52:47)



No. of visitors : 1201

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


ఐదురాష్ట్రాల్లో