అక్టోబ‌రు దాడి త‌ర్వాత‌... AOBలో ఏం జ‌రుగుతోంది...?

అక్టోబ‌రు

(ఏవోబీ మల్కన్ గిరి లో గత సంవత్సరం అక్టోబర్ లో ఎన్కౌంటర్ జరిగి 32 మంది మావోయిస్టులు అమరులైన‌ తర్వాత ʹది వీక్ʹ ప్రతినిధులు ఆ ప్రాంతంలో తిరిగి మావోయిస్టులను , ఆదివాసులను, పోలీసు అధికారులను ఇంటర్వ్యూలు చేసి అనేక కథనాలు ప్రచురించారు. అందులో ఈ కథనం ఒకటి . తెలుగులోకి అనువాదం చాసిన జీఎస్సార్ కు కృతఙతలు )

గగనతల దాడుల‌కు మోడీ ప్ర‌భుత్వం ఆమోదించ‌డంతో మావోయిస్టుల‌పై జ‌రుగుతున్న‌ పోరాటం నిర్ణ‌యాత్మ‌క‌ ద‌శ‌కు చేరుకుంది. పోలీసు బ‌ల‌గాలు మావోయిస్టుల ఎర్ర‌కోట‌ల్లోకి బ‌లంగా చొచ్చుకు వ‌స్తుంటే... ఆత్మరక్షణ కోసం తీవ్ర‌వాదులు గెరిల్లా యుద్ధానికి స్వ‌స్తి ప‌లుకుతున్నారు. చలన యుద్దాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న గురించి అనేక ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. పోరాట ప్రాంతం నుంచి ʹʹది వీక్ʹʹ వార పత్రిక అందిస్తున్న ప్రత్యేక క‌థ‌నం.

అత‌ని పేరు దోమ్రు కిలో. ఒడిస్సాలోని మ‌ల్కాజిగిరి జిల్లా రాంగూడ గ్రామంలోని గుడెసెవాసి. ఉత్త‌రంగా చ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దు... ద‌క్షిణం స‌రిహ‌ద్దుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంది. అత‌ని వయసు 30 ఏళ్లు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ల‌బ్దీ పొంద లేదు. రాజ‌కీయ నాయ‌కులు ఓట్లు అడ‌గ‌డానికి ఎప్పుడూ రాలేదు. రాంగూడ‌కు ఆనుకుని ఉన్న‌ ప‌చ్చ‌టి కొండ‌ల‌కూ, బ‌లిమెల రిజ‌ర్వాయ‌రుకూ అవ‌త‌ల వైపున ఏం ఉంద‌న్న ఎరుక లేక‌నే దోమ్రు కిలో పెద్ద‌వాడ‌య్యాడు.

త‌న‌కు తెలిసినంత‌లో.... ఇదే ప్ర‌పంచం అనుకుంటున్న రాంగూడ గ్రామం భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కి చెందిన దండ‌కార‌ణ్యంలోని విముక్త ప్రాంతంలో భాగ‌మైంది. ఆయుధాలు, మందుగుండుల బలంతో మావోయిస్టుల అధికారానిదే ఇక్కడ పైచేయి. వాళ్ల అధికారం ఎంత బ‌లంగా ఉందంటే అక్టోబ‌రు 23, 24 అర్థ‌రాత్రి ఘోరం జ‌రిగే వ‌ర‌కూ గ్రామంలోకి పోలీసు రావ‌డం అన్నది దోమ్రూ ఇంతకు ముందు ఎన్నడూ చూడ‌నేలేదు.

ఆ రాత్రి... దోమ్రు ఇంటికి వంద మీట‌ర్ల దూరంలో సీపీఐ (మావోయిస్టు) అగ్ర నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. అల్లంత దూరంలో ద‌ళాలు రాత్రి భోజ‌నం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. హ‌ఠాత్తుగా ఎక్క‌డ నుంచో వ‌చ్చిన‌ రెండు హెలికాప్ట‌ర్లు వారిపై గుళ్ల వ‌ర్షం కురిపించాయి. మావోయిస్టులకు ఏం జరిగిందీ అర్థం కాలేదు . వలలో చిక్కిపోయారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రేహౌండ్స్ ద‌ళాలు, ఒడిసా స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూపు ద‌ళాలు నేలపై అంద‌రినీ చుట్టుముట్టాయి. ʹగుళ్ల వ‌ర్షం కురిపించిన తర్వాత హెలికాప్ట‌ర్లు రిజ‌ర్వాయ‌ర్ ఒడ్డున వాలాయిʹ అంటూ దోమ్రు ఆనాటి సంఘ‌ట‌న‌ను జ్ఞాప‌కం చేశాడు. ʹరెండు డ‌జ‌న్ల‌కు పైగా ఉన్న సాయుధ పోలీసులు గ్రామాన్ని చుట్టిముట్టారుʹ అని కూడా చెప్పాడు.

దాడి ఎలా జరిగిందంటే....?

ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం... కింద దాదాపు 40 మంది పోలీసులు, పైన హెలికాప్టర్ల‌లో 50 మంది వ‌రకూ ఉన్నారు. ʹఅయితే మా పార్టీ వాళ్లే (మావోయిస్టులు) వాళ్ల‌ కంటే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారుʹ అన్నాడు దోమ్రు. ʹచాలా మంది నాయ‌కులు అతి క‌ష్టం మీద త‌ప్పించుకోగ‌లిగారు. ఒకేసారి ఇంత మంది చ‌నిపోవ‌డం ఈ దాడికి ముందు నేనెప్పుడూ చూడ‌లేదుʹ అని చెప్పాడు.

ఏడుగురు మ‌హిళా క‌మాండ‌ర్ల‌తోపాటు మొత్తం 30 మందికి పైగా సీపీఐ (మావోయిస్టు) క‌మాండ‌ర్లు ఈ దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గ్రామంలో 150 మంది మావోయిస్టులు స‌మావేశ‌మ‌య్యార‌ని పోలీసుల అందుకున్న సమాచారం మేరకు ఇది జరిగింది.

ఇళ్లపైనా కాల్పులు...

దోమ్రు చెప్పిన ప్ర‌కారం... దాడి త‌ర్వాత పోలీసులు ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టారు. మావోయిస్టుల‌ను అప్ప‌గించాలంటూ ఇళ్ల‌పై కాల్పుల‌కు దిగారు. తాను ఉంటున్న గుడెసె గోడ వైపు దోమ్రు చూపించాడు. తూటాల తాకిడికి గోడ పాక్షికంగా దెబ్బ‌తింది. ఆ స‌మ‌యంలో త‌ల్లితో కలిసి లోప‌ల అత‌ని మేన‌ల్లుడు నిద్ర‌పోతున్నాడు. అదృష్ట‌వ‌శాత్తూ వారు క్షేమంగానే ఉన్నార‌ని చెప్పాడు.

ʹ(ఓ పోలీసు) న‌న్ను కాలర్ ప‌ట్టుకుని సీనియ‌ర్ నేత‌లు ఎక్క‌డ దాగి ఉన్న‌దీ చెప్ప‌మ‌న్నారు. స‌మాచారం చెబితే...డ‌బ్బులిస్తామ‌ని ఆశ పెట్టారు. మాకు డ‌బ్బుల‌తో ప‌ని లేద‌ని చెప్పాం. మా పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు ఏదో ఒక రోజు మేం భారీగా మూల్యం చెల్లించుకుంటారంటూ మ‌మ్మ‌ల్ని హెచ్చ‌రించారుʹ అని దోమ్రు వివ‌రంగా చెప్పాడు. దాడి జ‌రిగిన గంట త‌ర్వాత‌, మావోయిస్టుల మృత‌దేహాల‌ను తీసుకుని హెలికాప్ట‌ర్లు వెళ్లిపోయాయి.
అక్టోబ‌రు దాడి... మావోయిస్టుల‌ను మ‌రింత జాగ్ర‌త్త ప‌డేలా చేసినా.... ఈ ప్రాంతంలోని గ్రామీణుల జీవ‌నం మ‌రింత క‌ష్టాల‌మ‌యం అయింది. దాడి జ‌రిగిన నెల‌న్న‌ర త‌ర్వాత... రాంగూడ గ్రామానికి చెందిన 40 ఏళ్ల కంట‌మ సీసా అనే మ‌హిళ ఇచ్చిన స‌మాచారం మేర‌కు జ‌న‌తానా స‌ర్కార్ (మావోయిస్టుల ప్రజా ప్ర‌భుత్వం) దాడి విష‌య‌మై విచార‌ణ నిర్వ‌హించింది. నిజానికి మావోయిస్టు నేత‌లు రామ‌కృష్ణ అలియాస్ ఆర్ కే, గాజ‌ర్ల ర‌వి అలియాస్ గ‌ణేశ్‌, చ‌ల‌ప‌తి అక్టోబ‌రు 23 నాటి స‌మావేశానికి హాజ‌రవుతున్న స‌మాచారాన్ని పోలీసులు కూడా ఇదే మ‌హిళ ద్వారా తెలుసుకున్నార‌న్న‌ది గ‌మ‌నించాల్సిన విష‌యం.

ఉప్పందించిన మ‌హిళ‌కు మ‌ర‌ణ‌శిక్ష

శిక్ష అమలు క్రమం వేగవంతం అయింది. డిసెంబ‌రు 12 రాత్రి కంట‌మకు మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు జ‌రిగింది. గ్రామంలో గుండె ధైర్యం ఉన్న కొంత‌మంది కంట‌మ మృత‌దేహాన్ని రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్లి చితి అంటించారు. చితి ఆరిపోక ముందే వారు అక్క‌డి నుంచి వెనుదిరిగారు.

ఇది జ‌రిగిన కొన్ని రోజుల త‌ర్వాత‌.... ʹʹది వీక్ʹʹ వార పత్రిక రాంగూడ గ్రామానికి వెళ్లిన‌పుడు ʹʹ వాళ్లు మా ప్ర‌భుత్వంపై దాడి చేశారు. అయితే శాశ్వ‌తంగా వారు న‌ష్టం క‌లిగించ‌లేరు. ఈ రోజు కను చూపు మేర‌లో కూడా పోలీసుల జాడ లేదు. మ‌ళ్లీ మా పార్టీ పూర్తిస్థాయిలో వ‌చ్చేసిందిʹʹ అని చెప్పాడు దోమ్రు.

మా హక్కులు మాకు ఇచ్చారు...

మావోయిస్టుల నీడ‌లో జీవించ‌డంలో కష్టమేం లేదు. ఎందుకంటే వాళ్లు భూమి, అడ‌విపై హ‌క్కుల్ని గ్రామ‌స్థుల‌కు అందించారు. అవును.. ఇక్క‌డ‌ ప్ర‌జాస్వామ్యం లేదు. మ‌రి మీ ప్ర‌భుత్వానికి ఓటు వేసినందుకు మీ ప్ర‌జ‌ల‌కు ప్రతిఫలంగా ఏం ద‌క్కుతుంది?... దోమ్రు ఎదురు ప్ర‌శ్న వేశాడు.

కరవుతో ఇక్కడ ఎవరూ చనిపోవాల్సిన పని లేదు....

ʹవాళ్లు మాకు మంచి నీళ్లు అందిస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోనందుకు నిల‌దీయాలంటూ మాకు గొంతుక‌ల‌ను ఇస్తున్నారు. మేం క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌దానిలో కొంత సొమ్మును వారికి ఇస్తున్నాం. మేం అనారోగ్యంగా ఉన్న‌పుడు మాకు మ‌ళ్లీ తిరిగి ఇస్తున్నారు. తిన‌డానికి తిండి లేని రోజుల్లో వాళ్లు తిండి కూడా పెడుతున్నారు. తిండి లేక క‌రవుతో ఎవ‌రూ ఇక్క‌డ చ‌నిపోవాల్సిన ప‌ని లేదు. వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన‌పుడు కూడా డ‌బ్బులు ఇస్తున్నారు. మా పార్టీ మా కోసం ఎన్నో చేస్తోంది... ప్ర‌భుత్వం మా కోసం ఇలాంటివి ఎప్ప‌టికీ చెయ్య‌లేదుʹ అని అంటాడు మ‌రో గ్రామ‌స్థుడు మోంగ్లా కిలో.

సాయం అందిస్తున్న‌ట్లు మోంగ్లా చెప్పిన మాట‌లే కాకుండా... దండ కార‌ణ్య ప్రాంతంలో వ్య‌వ‌సాయ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు సూచ‌న ప్రాయంగానైనా ʹʹది వీక్ʹʹ ప‌త్రిక కంట ప‌డింది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే వంద‌లాది ఎక‌రాల్లో గంజాయి, న‌ల్ల‌మందు సాగుబడిలో ఉన్నాయి. ఇదే విష‌యాన్ని దోమ్రును అడగ్గా... తన‌కేమీ తెలియ‌ద‌ని, రాత్రి స‌మ‌యాల్లో గ్రామ‌స్థులు ఈ మొక్క‌లు నాటి ఉంటార‌ని చెప్పాడు.

గ్రామాల గుండా మేం సాగుతూ ఉంటే పురుగు మందులు కొడుతూ అక్క‌డ‌క్క‌డా మ‌హిళ‌లు క‌నిపించారు. అడ‌విలో ఉన్న ప్ర‌భుత్వానికి గంజాయి, న‌ల్ల‌మందు క్షేత్రాలే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు.

వెనక్కి తగ్గిన మావోయిస్టులు

పోలీసులు దూకుడును పెంచ‌డంతో మావోయిస్టులు ఒక అడుగు వెన‌క్కి త‌గ్గారు. న‌క్స‌ల్ ప్ర‌భావాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని పోలీసు ఉన్న‌తాధికారులు ʹʹది వీక్ʹʹ ప‌త్రికతో అన్నారు. అందులో భాగంగానే అవ‌స‌ర‌మైన చోట గగనతల దాడికి అనుమ‌తి కూడా వ‌చ్చింది. మావోయిస్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న చత్తీస్ ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిస్సా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను
సంప్ర‌దించిన త‌ర్వాతే... విముక్త ప్రాంతాన్ని (ఫ్రీ జోన్) ఉనికిలో లేకుండా చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు చెప్పారు. ఈ ఆప‌రేష‌న్ను మిష‌న్ 2016-2017 అని పిలుస్తున్నారు. దండ‌కార‌ణ్యం లోప‌లి ప్రాంతాల‌కు చొచ్చుకుపోవ‌డం, మావోయిస్టు క్యాంపుల‌ను ధ్వంసం చేయ‌డం అందులో భాగం.

మద్దతు ఇవ్వలేమన్న తెలంగాణ ప్రభుత్వం

కేంద్రం ప్ర‌తిపాద‌న‌ను అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలూ పూర్తిగా అంగీక‌రించాయ‌ని చెప్ప‌లేం కానీ... అలాగ‌ని ఎవ‌రూ వ్య‌తిరేకించ లేదు. బీజేపీ అధికారంలో ఉన్న చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు మావోయిస్టుల‌పై పోరాటానికి పూర్తిగా కేంద్రంతో క‌లిసి ప‌ని చేస్తున్నాయి. ప్ర‌త్యేక పోలీసు ద‌ళాలు ఇందులో భాగమయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడు ఇందుకు స‌హ‌క‌రిస్తున్నారు. ఆయ‌న పార్టీ ఏన్‌డీఏ లో భాగ‌స్వామి అన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన అభ్యంతరాలను తీవ్రస్థాయిలోనే వ్యక్తం చేసింది.

మోడీ వచ్చిన ఏడాదికే బీజాలు పడ్డాయి

నరేంద్రమోడీ ప్రధాని పదవిని అధిష్ఠించిన ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది. మావోయిస్టు సమస్యకు చరమగీతం పాడేందుకు నరేంద్రమోడీ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మావోయిస్టు సమస్య లోతులను అంచనా వేసేందుకు స్వయంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నక్సల్ నిర్మూలనా కార్యకలాపాలపై ప్రధాని సలహాదారుగా ఉన్న కె.విజయ్ కుమార్, పారా మిలిటరీ దళాల డైరెక్టర్ జనరళ్లు దండకారణ్య ప్రాంతానికీ, మహారాష్ట్రలోని నాగపూర్, గడ్చిరోలీ ప్రాంతాలకూ తరచూ వస్తున్నారు. గగనతల నిఘా, ప్రతిదాడులూ ఇక నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఉండబోతున్నాయని వారు తమ సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు.

బీజాపూర్ అడవిలో డ్రిల్స్ కు శ్రీకారం

2015 అక్టోబరులో రాయ్ పూర్ (చత్తీస్ ఘడ్ )లో జరిగిన సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది కర్ణాటక రాష్ట్రంలోని బిజాపూర్ లో హెలికాప్టర్ల సాయంతో గగనతల సన్నాహక కార్యక్రమాలు (డ్రిల్స్) నిర్వహించాలని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి చెందిన ఒకరు ఆదేశించారు. ఆనాటి సమావేశంలో చత్తీస్ ఘడ్ కి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రే హౌండ్స్, కేంద్ర రిజర్వు పోలీసు దళానికి చెందిన కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్), భారత వాయు సేనకు చెందిన గరుడ్ కమెండోలు పాల్గొన్నారు.

దీని గురించి యాంటీ నక్సల్ కార్యకలాపాల స్పెషల్ డైరెక్టర్ జనరల్ డి.ఎం. అవస్థిని సంప్రదించగా... ʹʹఅవును. మావోయిస్టులను నిర్మూలించేందుకు ఉద్దేశించిన విస్తృత‌ ప్రణాళికలో గగనతలం నుంచి దాడులు చేయాలన్నది ఒక భాగంʹʹ అని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇతిమిత్థంగా గగన తల దాడుల గురించి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిస్పందనగా మాత్రమే ఇపుడు గగనతల దాడులు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ʹʹఅవును. మేం వాటిని ఉపయోగించుకుంటున్నాం. ఇందులో మేం దాచిపెడుతున్నదేమీ లేదుʹʹ అని డి.ఎం అవస్థి ʹʹది వీక్ʹʹ పత్రికతో చెప్పారు.

గరుడ్ దళాలను పంపుతున్నాం

ʹʹమేం అడవిలోకి పంపుతున్న ప్రతి టీంతోపాటు గగన తలంలో గరుడ్ దళాలను హెలికాప్టర్లలో పంపుతున్నాం. అంతర్గత తీవ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మాపై ఉంది. మాకు హెలికాప్టర్లు కావాలి. మా భద్రతా దళాలకు సవాలు ఎదురైన పక్షంలో ప్రతిదాడిగా గగన తల దాడి నిర్వహిస్తాం. మా భద్రతా దళాల్ని కోల్పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? మా వైపు నష్టాన్ని తగ్గించుకుంటూనే... వారిపై దాడికి దిగాలి. ఈ కార్యకలాపాల్లో మా దళాలు చనిపోవడానికి అంగీకరించేది లేదు. అందువల్ల అప్పుడప్పుడూ హెలికాప్టర్లు అవసరం. మేం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశం లేదని చెప్పగలంʹʹ అని చెప్పారు అవస్థి.

మానవ హక్కుల ఉద్యమకారులు మాత్రం దీనిని విశ్వసించడంలేదు. ʹʹవారు అలా ఎలా చెబుతారు? గ‌గ‌న త‌ల దాడుల్ని కేంద్ర కార్యాల‌యం నియంత్రించ‌గ‌ల‌దా?ʹʹ అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖర్.

2015 వ్యూహంలో చేసిన మార్పుల కారణంగానే 2016లో విజయాలు సాధ్యమయ్యాయని అవస్థి చెప్పుకొచ్చారు. ʹʹనన్ను నమ్మండి. నక్సలైట్లు విముక్త ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత... వెళ్లడం అసాధ్యం అనుకున్న ప్రాంతాల్లోకి కూడా మేం ఇపుడు చొచ్చుకుపోయాంʹʹ అని ఆయన చెప్పారు. ఈ ప్రగతిని నరేంద్ర మోడీ, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని, నక్సలైట్లను ఈ ప్రాంతం (దండకారణ్యం) లో నిర్మూలించేందుకు కాలావధి గల లక్ష్యాలను నిర్ణయించుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా దళాలను కోరాయని చెప్పారు. నిర్ణీత కాలావధి (టైం ఫ్రేం) గురించి వివరించాల్సిందిగా కోరగా.... ʹʹమావోయిస్టులు వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నందున ప్రత్యేకంగా ఒక కాలావధి అంటూ చెప్పలేం. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేతులు కలిపాయి. ఇది శుభ పరిణామంʹʹ అని అవస్థి వ్యాఖ్యానించారు.

ప్రత్యేకంగా సమావేశమైన మోడీ

పోలీసు ఉన్నతాధికారుల అందించిన సమాచారం ప్రకారం... నక్సల్ ప్రభావిత రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరళ్లు, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సంస్థల ఉన్నతాధిపతులతోనూ 2015 డిసెంబరులో గుజరాత్ లోని బాలోజ్ లో జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ʹʹమావోయిస్టుల నిర్మూలనలో సత్ఫలితాల కోసం ప్రయత్నించండి. ఏదో చేశాం అంటే కాదుʹʹ అంటూ ప్రధాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. విముక్త ప్రాంతంలో ఉన్న మావోయిస్టులను తుద ముట్టించండి అంటూ ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ దూకుడు వెనక ఆర్థిక పరమైన కారణాలున్నాయని కవి, పౌర హక్కుల నేత కళ్యాణ్ రావు వెల్లడించారు. ʹʹదండకారణ్యంలోని బాక్సైట్, ఇతర ఖనిజాలను బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేయాలని ప్రస్తుత ప్రధాని కోరుకుంటున్నారు. అందుకే... మవోయిస్టులను తుద ముట్టించేందుకు దారుణమైన విధానాలను తెచ్చారుʹʹ అని ఆయన తెలిపారు.

రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి..

మావోయిస్టు సమస్య ఉన్న అనేక రాష్ట్రాలు రూ.3 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించాయి. గనులు, స్టీలు, పవర్ రంగాలకు చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచే ఈ పెట్టుబడులకు హామీలు లభించాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షల ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. దండ‌కార‌ణ్య ప్రాంతం, మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలి జిల్లాలో మొత్తం 45 గ‌నులుండ‌గా, అందులో 30 గ‌నులు ప్రైవేటు వ్య‌క్తుల చేతిలో ఉన్నాయి. గ‌డ్చిరోలి జిల్లాలో మైనింగ్‌ను వ్య‌తిరేకిస్తూ... డిసెంబ‌రు 23న గ‌డ్చిరోలిలో మావోయిస్టులు 69 ట్ర‌క్కులకు నిప్పు పెట్టారు.

ప్ర‌భుత్వం త‌న ప్ర‌ణాళిక‌ను గ‌త జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 250 మంది మావోయిస్టుల ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. అందులో 150 మంది ఒక్క చ‌త్తీస్ ఘ‌డ్ నుంచే ఉన్నారు. సీపీఐ (మావోయిస్టు) కు చెందిన అనేక మంది నేత‌లూ, పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి చెందిన అనేక మంది క‌మాండ‌ర్లు అరెస్టు కావ‌డ‌మో, చ‌నిపోవ‌డ‌మో జ‌రిగింది. గ‌త 30 సంవ‌త్స‌రాల్లో మొద‌టి సారిగా భ‌ద్ర‌తా ద‌ళాలు డ్రోన్ల ద్వారా దండ‌కార‌ణ్యంపై గ‌గ‌నత‌ల నిఘాను ప్రారంభించాయి.

మావోయిస్టులవైపు సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో గెరిల్లా యుద్ధం చేయ‌బోమ‌ని, కేవ‌లం దాడుల‌కే స్పందిస్తామ‌ని మావోయిస్టులు ప్ర‌క‌టించారు. ʹʹమావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో 2016 చాలా మంచి సంవత్సరం కింద లెక్క. నక్సలైట్లను చావుదెబ్బ తీశాం. వారు భారీగా నష్టపోయారు ʹʹ అని అన్నారు అవస్థి.

ఆరేళ్ల క్రితం...ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం ఉండ‌గా, మ‌రీ ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబ‌రం ఉన్న‌పుడు ఇదో తీరని ఆశగా మాత్ర‌మే ఉంది. ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ కొన‌సాగుతూనే ఉంది. నియంత్రిత గ‌గ‌నత‌ల దాడుల కోసం అనేక రాష్ట్రాలు డిమాండు చేస్తున్నాయి. రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడి కార‌ణంగా ప్ర‌భుత్వం దీనికి ఒప్పుకోలేదు.

ఇపుడు చాలా జాగ్ర‌త్త‌గానూ, ర‌హ‌స్య విధానంలోనూ గ‌గ‌న త‌ల దాడులు జ‌రుగుతున్నాయి. గ‌గ‌న త‌ల దాడుల గురించి ఆంధ్ర ప్ర‌దేశ్ గ్రేహౌండ్స్ అధిప‌తి ఎన్‌.సురేంద్ర‌బాబు వ‌ద్ద ʹʹది వీక్‌ʹʹ ప్ర‌స్తావించ‌గా... విధానపరంగా గ్రే హౌండ్స్ పత్రికలతో మాట్లాడకూడద‌ని, డీజీపీ ఎన్‌.సాంబ‌శివ‌రావును సంప్ర‌దించాల్సిందిగా సూచించారు. అయితే గ‌గ‌న త‌ల దాడుల గురించి మాట్లాడేందుకు ఆయ‌న నిరాక‌రించారు.

ఒడిసా స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూపు స‌మాచారం ప్ర‌కారం... అక్టోబ‌రులో జ‌రిగిన మ‌ల్క‌న్‌గిరి దాడి మావోయిస్టుల‌కు శ‌రాఘాతం వంటిది. మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా చేసే గ‌గ‌న‌తల దాడుల గురించి స‌మాచారాన్ని పంచుకోవ‌డానికి వీల్లేదని, భ‌విష్య‌త్తు వ్యూహ‌మేమిటన్న‌దీ చెప్ప‌లేమ‌ని అది కూడా తమ వ్యూహంలో భాగ‌మేన‌ని ఈ గ్రూపు అధిప‌తి ఆర్‌పీ కొచె చెప్పారు.

దాడులకు దూరంగా తెలంగాణ ప్రభుత్వం

భాజ‌పా, లేదా దాని మిత్ర ప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కాకుండా ఒక్క ఒడిసా మాత్ర‌మే మిష‌న్ 2016-2017ను మ‌ద్ద‌తు ప‌లికింది. తెలంగాణ పోలీసులు మాత్రం దీనికి మ‌ద్ద‌తు ప‌లికేందుకు నిరాక‌రించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శ‌ర్మ ʹʹది వీక్ʹʹ తో మాట్లాడుతూ... మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసు గగనతల దాడులకు దిగబోదు. ఇదే మా ప్రభుత్వ నిర్ణయంʹʹ అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు ఇపుడు తెలంగాణలో భాగంగా ఉన్నప్పటికీ కూడా మల్కన్ గిరి దాడుల్లో గానీ, మరే ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లోగానీ తెలంగాణ పోలీసులు పాల్గొనలేదని ఆయన వెల్లడించారు. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రధానమైన దాడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టినవేనంటూ చెప్పారు.

సీపీఐ (మవోయిస్టు) దండకారణ్య జోనల్ కమిటీకి చెందిన డాక్యుమెంట్లు కొన్ని ʹʹది వీక్ʹʹ చేతికి అందాయి. వాటి ప్రకారం దండకారణ్య గగనతలంలో హెలికాప్టర్లు తిరుగాడుతున్నట్లు అర్థమవుతోంది. ʹʹమావోయిస్టు ప్రభుత్వం ఇపుడు పోలీసుల నుంచి పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదిʹʹ అని డాక్యుమెంట్లలో రాసి ఉంది. ʹʹభారత వాయుసేనకు చెందిన గరుడ్ కమెండోలు గగనతల దాడులకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న క్రూరమైన అణచివేత విధానాల వల్ల దండకారణ్యం ఇపుడు మంటల్లో మండుతోందిʹʹ అని ఆ డాక్యుమెంట్లు చెబుతున్నాయి.

దండకారణ్య విముక్త ప్రాంతం (ఫ్రీ జోన్)లో ఉన్న శాంతినీ, గ్రామీణుల ఆస్తుల్నీ గరుడ్ కమెండోలు ధ్వంసం చేస్తున్నారని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్వహిస్తున్న పాఠశాలలపైనా దాడులు చేస్తున్నారని, టీచర్లను చంపివేస్తున్నారని, రాత్రిళ్లు మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామీణులు ఏ మాత్రం తిరుగుబాటు చేసినా... ఆకాశం నుంచి తూటాల వర్షం కురవడం ఖాయమని డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బట్టి మావోయిస్టుల్లో నెలకొన్న ఆందోళన స్పష్టంగానే తెలుస్తోంది.

అడవిలో... స్థానిక ప్రభుత్వాలు

దండకారణ్య ప్రాంతంలో సమాంతర ప్రభుత్వమే నడుస్తున్న విషయం ఈ డాక్యుమెంట్ల ద్వారా రూఢి అవుతున్నది. విముక్త ప్రాంతం అనేక జోన్లుగా విభజితమై ఉంది. అక్కడ స్థానిక జనతానా సర్కార్లు నడుస్తున్నాయి. ఈ స్థానిక ప్రజా ప్రభుత్వాలను పార్టీ అత్యున్నత నిర్ణాయాధికారం ఉన్న కేంద్ర కమిటీ పర్యవేక్షిస్తోంది.

స్థానిక ప్రభుత్వాల నేతల పైనా గురి

భద్రతా దళాలు ఈ జోన్ల వారీగా పని చేస్తున్న నేతలను గుర్తించి వారిని చంపివేస్తున్నాయి. ప్రతి ప్రాంతానికీ ఓ నేత ఉంటారు. వీరిని అధ్యక్షుడు (ప్రెసిడెంట్) గా పిలుస్తారు. ఈ ఏడాదిలోనే... స్థానిక మావోయిస్టు ప్రభుత్వాలకు చెందిన అలాంటి 50 మంది అధ్యక్షులను భద్రతా దళాలు చంపివేశాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పాఠశాలల్ని నడుపుతున్నారని, పిల్లలు పెరిగి పెద్ద కాగానే... వారిని సాయుధులుగా మార్చడానికేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దండ కారణ్యంలోని అనేక పాఠశాలల టీచర్లను భద్రతా దళాలు చంపడమో, అరెస్టు చేయడమో చేశాయి. తమకు చెందిన స్థానిక ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వం అణచివేస్తోందని మావోయిస్టులే స్వయంగా అంగీకరించారు. ʹʹమా నుంచి ఎలాంటి కవ్వింపులూ లేకపోయినా... భారత ప్రభుత్వం మా నేతలను చంపడం ద్వారా మా స్థానిక ప్రభుత్వాలను నాశనం చేస్తోందిʹʹ అని మల్కన్ గిరి దాడి అనంతరం వెలువడిన ఓ డాక్యుమెంట్ చెబుతోంది.

తెలంగాణలోని సింగారం ప్రాంతానికి చెందిన నేత కుర్షం ధర్మాన అలా బలైన వాడే. మావోయిస్టు స్థానిక ప్రభుత్వానికి చెందిన వత్రే రాజాల్ అనే అతన్ని చత్తీస్ ఘడ్ సుక్మాలో పట్టుకున్నారు. ʹʹఅతన్ని ఆంధ్రప్రదేశ్ లోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. అక్కడే చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారుʹʹ అని దండకారణ్య జోనల్ డాక్యుమెంటులో పేర్కొన్నారు. ʹʹజులై లో జరిగిన దాడిలో సామాన్య ప్రజలపైనా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. మా నేతలతోపాటు అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మా పాఠశాలల టీచర్లు, గిరిజన కళాకారులు కూడా ప్రాణాలు కూడా కోల్పోయారుʹʹ అని ఒక నివేదిక చెబుతున్నది.

జులై 29న భద్రతా దళాలు గ్ర‌నేడు విసిరిన‌పుడు... హేముల పొడియాల్ అనే గిరిజ‌న క‌ళాకారుడి గ‌దికి నిప్పు అంటుకున్న‌ది. ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. మ‌రో 19 మంది గిరిజ‌న క‌ళాకారుల ఇళ్ల‌పైనా దాడులు జ‌రిగాయి. కొంత‌మంది చాక‌చ‌క్యంగా త‌ప్పించుకోగ‌లిగార‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. దాని ప్ర‌కారం హేముల‌తోపాటు న‌లుగురు క‌ళాకారులు కూడా అసువులు బాసిన‌ట్లు అందులో చెప్పారు.

దండ‌కార‌ణ్యంలో చొచ్చుకుపోవ‌డానికి అసాధ్య‌మైన ప్రాంతాల్లోకి కూడా భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌వేశించిన‌ట్లు మావోయిస్టు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చూసే బ్యూరో కూడా అంగీక‌రించింది. విముక్త ప్రాంతంలో ని ప్ర‌జ‌ల‌ను అస్ప‌ష్ట‌త‌లో ఉంచేందుకు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మ‌మ్మ‌ల్ని దారుణంగా దెబ్బ‌తీశామ‌ని, ఇంక కోలుకోవ‌డం క‌ష్ట‌మేనంటూ ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తోంది. ఇది చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి చెప్ప‌డ‌మే. మాకు దెబ్బ త‌గిలింది... అయితే మేం అంత‌రించిన‌ట్లు కాదని వారు చెప్పారు. దండకారుణ్య జోన‌ల్ క‌మిటీ ప్ర‌కారం... భ‌ద్ర‌తా ద‌ళాలు త‌మ ఘ‌న విజ‌యాల‌కు ప్ర‌చారం ల‌భించేందుకు మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌ను దాచి పెడుతున్నాయ‌నేది మరొక ఆరోప‌ణ‌.

కొన్న మావోయిస్టు డాక్యుమెంట్ల‌లో తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో పార్టీ నుంచి మూడేళ్ల కింద‌టే బ‌య‌ట‌కు వ‌చ్చిన దంప‌తులిద్ద‌రిని చంపివేయ‌డం. భ‌ద్ర‌తా ద‌ళాలు ఆ వివాహిత‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టాయి. ʹʹహక్పా మనార్, థాథి పాండేలు 2013లోనే మావోయిస్టు ప్రభుత్వం నుంచి తప్పుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు. బీజాపూర్ లోని కర్నార్ గ్రామం నుంచి వారిని 2016 మే 17న పోలీసులు తీసుకుపోయారు. తీవ్రంగా హింసించారు. పాండేని సామూహికంగా అత్యాచారం చేశారు. మే 21న వారిని హత్య చేసి... ఇద్దరు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు ప్రకటించారుʹʹ అని డాక్యుమెంటు చెబుతున్నది.

బూటకపు ఎన్ కౌంటర్లు, మహిళలపై జరిగిన నేరాల గురించి మహిళలు, గ్రామీణుల నుంచి తనకు అనేక ఫిర్యాదులు వచ్చినట్లు అవస్థి అంగీకరించారు. ʹʹప్రతి ఫిర్యాదుపైనా న్యాయ విచారణ జరుగుతుందని, నిష్పాక్షిక దర్యాప్తు కూడా ఉంటుందని నేను హామీ ఇస్తున్నా.. ఫిర్యాదులు నిజమని తేలితే... కఠిన చర్యలు తీసుకుంటాంʹʹ అని ఆయన చెప్పారు.

మా ప్రయాణం సాగిందిలా...

ఈ దశలో... మావోయిస్టుల కార్యకలాపాలు, అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు కంటమకు మరణశిక్ష అమలయిన వెంటనే...ʹʹది వీక్ʹʹ పత్రిక గత డిసెంబరులో మల్కన్ గిరి కి వెళ్లింది. మల్కన్ గిరికి చేరుకునే 50 కిలోమీటర్ల ముందే.. రహదారి ఆగిపోయింది. రహరదారిని ధ్వంసం చేసేందుకు మావోయిస్టులు నది దారిని కొంత వరకూ మళ్లించారు. పాత జీపు ఉంటేనే అడవిలోకి వెళ్లడం సాధ్యమని మా కారు డ్రైవరు తేల్చివేశాడు.

ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ సమీప పట్టణం నుంచి అయిదు గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత ఒడిసా సరిహద్దులోని ఓ గ్రామానికి చేరుకున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఈ గ్రామమే చివరి ప్రాంతంలా కనిపించింది. సమయం ఉదయం 9 గంటలయింది. విముక్త ప్రాంతంలో కాలుపెట్టేందుకు అనుమతి కోసం అడవిలోకి సందేశాన్ని పంపించాం. కొద్ది సేపట్లోనే మోటారు సైకిళ్లపై వచ్చిన యువకులు మీరెందుకు ఇక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు.

మల్కన్ గిరిని సందర్శించడంపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిషేధిత ప్రాంతానికి ఎందుకు వెళుతున్నదీ చెప్పి ముందస్తుగా... అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరులో ఎన్ కౌంటర్ తర్వాత హక్కుల ఉద్యమకారుల్ని లోపలికి అనుమతించారు. నిర్దేశిత ప్రాంతంలో గ్రామీణులను కలిసేందుకు మాత్రమే వారిని అనుమతించారు. బయట వ్యక్తుల్ని అనుమతించి... తర్వాత అనుకోకుండా ఏదైనా జరిగితే ఏమిటన్న కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.

ఇన్ని ఆంక్షల మధ్యనే ధైర్యంగా మా ప్రయాణాన్ని కొనసాగించాం. మావోయిస్టుల నుంచి అనుమతి రాగానే ట్రక్టర్ లో 12 కిలోమీటర్లు ప్రయాణించి అడవిని చేరాం. మార్గ మధ్యంలో కిందికి వాలిన చెట్ల కొమ్మలు మా ముఖాలకూ, దేహాలకూ రాపాడుతున్నాయి. చలికి చేతులు కొంగర్లు పోతున్నా... మా సీట్లకు అతుక్కుపోయి అలానే కూర్చుండిపోయాం. అనేక అడుగుల లోతున్న గోతుల మీదుగానే ట్రాక్టర్ ఎలాగో ముందుకుపోయింది. మరో మూడు గంటల తర్వాత... ఇక ట్రాక్టర్ కూడా ముందుకు పోవడానికి వీలుకాని ఓ ప్రాంతానికి చేరుకున్నాం.

మరో రెండు గంటలపాటు నడవాల్సిన కొండ మార్గం మా ముందు కనిపిస్తోంది. నదిని దాటి... కొండలు ఎక్కుతూ, దిగుతూ ముందుకు సాగిపోయాం. మా అలసట... రాంగూడ గ్రామం వద్ద ఆగింది. గత అక్టోబరులో హెలికాప్టర్లు దాడి చేసింది ఇక్కడే. చుట్టూ కొండలు... మానవ నివాసానికి అంత అనువుగా ఉన్న ప్రాంతంలా లేదు. ʹʹఅడవి విశ్వరూపాన్ని ఇక్కడ చూడొచ్చు. క్రూర మృగాల సంచారం ఎక్కువ‌ʹʹ అని చెప్పాడు స్థానికుడైన సురంగి కోలె. ʹʹనిజానికి ఇది నివాసయోగ్యమే. ఇక్కడ జంతువులేమీ లేవు. ఎందుకంటే మా నేతలు ఉండేది ఇక్కడే. ఇక్కడి నుంచే వారు పరిపాలిస్తారుʹʹ అని కూడా అతను చెప్పాడు.

తామంతా సుఖంగా జీవిస్తున్నామని గ్రామీణులు మాతో చెప్పారు. అవును. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేవు. పిల్లల్ని దూర ప్రాంతానికి పంపి చదివించుకునేందుకు అనుమతి ఉంది. ʹʹఅయితే... ప్రభుత్వాన్ని నమ్మకుండా ఉండేందుకు, అక్కడ వ్యవస్థను నమ్మకుండా ఉండేందుకు అవసరమైన తర్ఫీదు ఇస్తారుʹʹ అని 50 ఏళ్ల సిర్సా కోలె చెప్పాడు. మా పిల్లలు పార్టీ నుంచి, పార్టీ నడుపుతున్న ప్రభుత్వం నుంచి ప్రాథమిక విద్యను పొందుతున్నారని కూడా తెలిపాడు.

రాంగూడ, ఇతర సమీప గ్రామాలకు మల్కన్ గిరిలోని ప్రైవేటు విద్యుత్ సంస్థ విద్యుత్ ను అందిస్తోంది. అనారోగ్యంగా ఉన్నపుడు తక్కువ సమయంలోనే వైద్యులు వస్తారు. స్వేచ్ఛను వదులుకోవడం వల్లనే వారికి ఇవన్నీ సమకూరుతున్నాయి. బయటకు వెళ్లాల్సిన ప్రతిసారీ గ్రామస్థులు మావోయిస్టులకు వివరణ ఇచ్చుకోవాలి. ఎవరిని కలుస్తున్నారు... ఎందుకు అన్న వివరాలను అందించాల్సి ఉంటుంది. లేదంటే... కంటమకు పట్టిన గతే పడుతుంది ఎవరికైనా.

అష్టకష్టాలూ పడి రాంగూడకు చేరామా..... మావోయిస్టు నాయకత్వాన్ని కలిసేందుకు గ్రామీణులు అంగీకరించ లేదు. మునిమాపు వేళ మావోయిస్టు విముక్త ప్రాంతం నుంచి బయటపడేందుకు బయల్దేరాం. అంతలో నల్లటి యూనిఫాంలో ఉన్న 50 మంది ఉన్న బృంద‌మొక‌టి మా ట్రాక్ట‌ర్ ముందు ప్రత్యక్షమైంది.

అంద‌రి చేతుల్లోనూ క‌లష్నికోవ్ రైఫిల్స్ ఉన్నాయి. ఈ ద‌ళానికి నాయ‌కుడు గాజ‌ర్ల ర‌వి అలియాస్ గ‌ణేశ్‌. దండ‌కార‌ణ్యానికి అత‌నే అధినేత‌. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర క‌మిటీ స‌భ్యుడు కూడా. మ‌ల్క‌న్ గిరిలో ద‌ళాల‌ను మోహ‌రించేందుకు ఈ ప‌దాతిద‌ళం ప‌హ‌రాలో ఉంది. అందులో 20 మంది మ‌హిళ‌లు కూడా ఉన్నారు. అక్టోబరు దాడిలో తోటి కామ్రేడ్ల‌ను కోల్పోయిన బాధ‌గానీ, ఆందోళ‌న గానీ వారి ముఖాల్లో లేదు. ʹʹమేం కోలుకున్నాంʹʹ అని చెప్పింది వరంగల్ (తెలంగాణ) కు చెందిన మహిళా కమాండర్ సునీత. మేం ఇపుడు ఎటువంటి పరిస్థితుల్నయినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేసింది.

ఇది నిజమే సుమా అంటూ మరో సీనియర్ కమాండర్ తలూపడం గమనించాం. ʹʹమా దళంలో మహిళా కమాండర్లను నియమించడం కోసం ఒక‌ప్పుడు మహిళలు దొరికేవారు కాదు. ఈ ప్రాంతాల్లోని మహిళలపై ప్రభుత్వ దాడులు పెరగడంతో మాకు మహిళల మద్దతు లభిస్తోంది. దండకారణ్యంలో మా పాలన చెక్కు చెదరకుండా పూర్వంలానే ఉందిʹʹ అని ఆయన తెలిపాడు.

అధునాతన తుపాకులు, ఫ్లాష్ లైట్లు, చైనా తయారీ... వాకీ టాకీలు వారి వద్ద ఉన్నాయి. మందుగుండు వారి భుజాలకూ, నడుములకూ వేలాడుతూ కనిస్తోంది. అప్పడే కళాశాల విద్యను ముగించుకుని వచ్చిన యువకులు, మరికొంత మంది కౌమారంలో ఉన్నవారూ అందులో కనిపించారు. చత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న 21 ఏళ్ల కుర్రాడు మల్కన్ గిరి ఎన్ కౌంటర్ తర్వాత దళంలో చేరిపోయాడు. నీవెందుకు దళంలో చేరావని ప్రశ్నించగా...ʹʹఅందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అవును. మావోయిస్టయిన మా అన్నను పోలీసులు పొట్టనబెట్టుకున్నారు. పార్టీకి సానుభూతి పరులైన మా గ్రామ యువతులపై జరిగిన అత్యాచారాలే నేను దళంలో చేరడానికి అతి పెద్ద కారణం. మోడీ ప్రభుత్వం ఏమైనా చెయ్యనీ.... మా ఉద్యమం కొనసాగుతుందిʹʹ అని చెప్పాడు.

(ది వీక్ పత్రికలో ప్రచురితమైన రవి బెనర్జీ రాసిన ఈ కథనాన్ని జీఎస్సార్ తెలుగులోకి అనువదించారు)

Keywords : maoists, the week, AOB, malkangiri, police, modi
(2024-04-25 16:28:22)



No. of visitors : 3160

Suggested Posts


ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !

ఏవోబీలో మరో (పోలీసుల కథనం ప్రకారం)ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు.

గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం

ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో జరిగినట్టు చెబుతున్న ఎన్కౌంటర్ నిజమా అబద్దమని మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీలను పట్టుకొని కాల్చి చంపారని. స్థానిక ఆదివాసులైన జయంతి , రాధిక గొల్లూరి,సుమలా , రాజశేఖర్‌ కర్మలను పోలీసులు అరెస్టు చేసి పట్టుకెళ్ళారని వారిని కూడా చంపేస్తారేమోననే ఆందోళన ఆద

మావోయిస్టు అరుణ ఎక్కడ ?

సీపిఐ మావోయిస్టు పార్టీ నాయకురాలు అరుణ ఎక్కడుంది? పోలీసుల అదుపులో ఉన్నదా ? ఏవోబీలోనే సేఫ్ గా ఉన్నదా ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది. ఈ నెల 22న‌ గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు దగ్గర జరిగిన‌ ఎన్‌కౌంటర్‌లో అరుణ చనిపోయిందని ప్రచారం కూడా సాగింది.

అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు

ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టు అందులో మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీల ఎలియాస్ మీనా ఎలియాస్‌ జిలానీ మృతి చెందిన ఘటనపై అనేక‌ సందేహాలు తలెత్తుతున్నాయి.

ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌

పోలీసుల‌ కూంబింగ్ తీవ్రంగా జరుగుతుండగానే సీపీఐ మావోయిస్టు పార్టీ అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియాలో ఈ సభ నిర్వహించారు.

కామ్రేడ్... నీ నెత్తిటి బాకీ తీర్చుకుంటాం... గర్జించిన వేల గొంతులు

వార్త తెలుసుకున్న వందలాది గ్రామాలనుండి వేలాది మంది ఆదివాసులు ఆదివారం రాత్రి నుండే కొండెముల గ్రామానికి రావడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికే ఆ గ్రామం ఎర్రజెండాలు చేబూనిన వేలాదిమందితో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడి భౌతిక కాయాన్ని చూసిన ప్రజలు బోరుమంటు విలపించారు....

కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌

అదిగో ఆ ఎర్ర గోంగూర చెట్టుందే అదే విప్లవ యువ కిశోరం మున్నా శత్రు సేనలతో వీరోచితంగా పోరాడుతూ తన రక్తంతో ఎరుపెక్కించిన నేల. ఆ చోటంతా ఎర్ర గోంగూర మొక్కలతో అచ్చం ఎర్రపూల వనంలా విరబూసింది. ఆ జారుడు మట్టిదారి మన ప్రియతమ మహిళా నాయకురాలు భారతక్క తూటాల గాయాలతో పైకి ఎక్కలేక జారిపడ్డ బాట. ఆ కొండమలుపులోనే మిలిటరీ దిగ్గజం యాదన్న మరో తరాన్ని కాపాడడానికి శత్రు మోర్టార్

పితృస్వామ్యంపై విల్లెత్తిన‌ విప్లవ మహిళ ‍- భారీ బహిరంగ సభ‌

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ముంచింగుపుట్టు ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా , మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ...

గుంపులలో సందె గంగన్న సంస్మరణ సభ‌ (వీడియో)

ఏవోబీలో ఎన్ కౌంటర్ లో మరణించిన సందె గంగన్న సంస్మరణ సభ ఈ రోజు ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంపులలో జరిగింది.

నిత్య‌ పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్ర‌

గ్రామాలపై పోలీసుల దాడులు... ఎన్ కౌంటర్ హత్యలు.... ఏవోబీలో ఒక వైపు పోలీసులు ప్రతి చెట్టును, పుట్టను తమ తుపాకులతో జల్లెడ పడుతూ భయోత్పాతం సృష్టిస్తుండగానే... మరో వైపు ప్రజలు భూపోరాటాలు, అమరుల సంస్మరణ సభలు జరుపుకుంటూ తమ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అక్టోబ‌రు