NIA కేసులో (కేసు నం.-19/22) బీహార్ లోని భాగల్పూర్లోని షహీద్ జుబ్బా సహాని సెంట్రల్ జైలులో నిర్బంధించబడిన అండర్ ట్రయల్ ఖైదీ జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా జైలులో ఉన్న రూపేష్ ఆరోగ్యం ఆందోళనకరమైన స్థాయిలో దిగజారింది. ఈ నేపథ్యంలో రూపేష్ ను మెరుగైన సౌకర్యాలు కలిగిన మరింత సరైన ప్రదేశానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ IG (జైళ్లు)కి అతని భార్య ఇప్సా శతక్షి లేఖ రాసింది.
ఇప్సా లేఖలో ఇలా రాశారు: ” మూడు సంవత్సరాల జైలు జీవితంలో, నా భర్తకు ‘సైనస్’ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అలెర్జీలు కూడా ఉన్నాయని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. దీని కారణంగా, ప్రతి ఉదయం అతను నిరంతరం తుమ్ములు, తీవ్రంగా ముక్కు కారటం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణం మారినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనికి సంబంధించి అతన్ని జైలు ఆసుపత్రికి చూపించినప్పటికీ, ఎటువంటి నిర్దిష్ట చికిత్స అందించబడలేదు. అటువంటి పరిస్థితిలో, అవసరమైనప్పుడు గోరువెచ్చని నీరు కొంత ఉపశమనం కలిగిస్తుంది.”
”నా భర్త కాళ్ళలో నరాల లాగడం, పిక్కల్లో తీవ్రమైన నొప్పి కూడా ఉంది. క్రీడలు, వ్యాయామం వంటి శారీరక శ్రమలతో ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. అయితే, ఇక్కడ సెల్ ఖైదీలకు క్రీడా సౌకర్యాలు లేవని ఆయన నాకు తెలియజేశారు. నొప్పి పెరిగినప్పుడల్లా, జైలు ఆసుపత్రి అతనికి ప్రతిసారీ కాల్షియం టాబ్ల్రెట్లు మాత్రమే ఇస్తున్నది. కానీ అది ఏ మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అతనికి విటమిన్ డి పరీక్ష చాలా అవసరం. ఇది ఇప్పటివరకు చేయలేదు. జైలు ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్ష బయటి ప్రయోగశాల నుండి జరుగుతుంది కాబట్టి, అందుకోసం ఖైదీయే డబ్బులు చెల్లించాలి. అంటే థైరాయిడ్ పరీక్ష తన సొంత ఖర్చుతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పరీక్ష కోసం ఆగస్టు 14న రూపేష్ తన బ్లడ్ షాంపిల్స్ ఇచ్చాడు. “
ఇప్సా ‘ది మూక్నాయక్’ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఆగస్టు 14న నిర్వహించిన పూర్తి శరీర పరీక్ష ఫలితాలు కుటుంబ సభ్యుల ఆందోళనలను మరింత పెంచాయని తెలిపారు. పరీక్ష నివేదికలో అతని VLDL కొలెస్ట్రాల్ 125 ఉందని తేలిందని, అయితే సాధారణ స్థాయి 30 కంటే తక్కువగా ఉండాలని ఆమె తెలిపింది. అదేవిధంగా, అతని సీరం ట్రైగ్లిజరైడ్స్ స్థాయి 519 అని తేలిందని, అయితే ఇది సాధారణంగా 150 కంటే తక్కువగా ఉండాలని ఆమె చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం, ఈ స్థాయిలు చాలా ఆందోళనకరంగా పరిగణించబడతాయి. గుండె జబ్బుల యొక్క తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తాయి. థైరాయిడ్ పరీక్ష నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
జైలులో ఖైదీలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని, నీటిలో ఆర్సెనిక్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉందనే అనుమానాలను లేవనెత్తుతున్నాయని రూపేష్ కుటుంబం ఆరోపించింది. సెల్ గది ప్లాస్టర్ ఊడిపోతోంది, వర్షాకాలంలో మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సెల్ ఖైదీలకు క్రీడలు లేదా శారీరక కార్యకలాపాలకు ఎటువంటి ఏర్పాట్లు లేవు, ఇది అతని ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రూపేష్ విద్యావంతుడైన జర్నలిస్ట్ అని, జైలులో ఉన్నప్పుడు కూడా ఇగ్నో ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు కొనసాగించాడని ఇప్సా శతాక్షి ఐజీకి రాసిన లేఖలో నొక్కిచెప్పారు. అయితే, అధిక భద్రతా సెల్లో ఉంచడం, అవసరమైన సౌకర్యాలు కూడా లేకపోవడం అతని విద్యా, వైద్య శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తోంది. రూపేష్ కుమార్ సింగ్ను వెంటనే మెరుగైన వైద్య సదుపాయం కోసం సురక్షితమైన వాతావరణానికి బదిలీ చేయాలని ఆమె జైలు పరిపాలన అధికారులను అభ్యర్థించారు. ఈ విషయంలో అధికారులు సత్వర చర్యలు తీసుకుంటారని ఆమె కుటుంబం ఆశిస్తోంది.

పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
ఏ మార్గాన్ని అనుసరించాలి?
జైలు చీకటి కొట్లలో కేకలేస్తున్న మానవ హక్కులు: యాతనలు, ఆకలి, క్రూరత్వాల భయంకర చిత్రం
పాట్నా జైలు నుంచి తోటి జర్నలిస్టులకు జర్నలిస్ట్ రూపేష్ విజ్ఞప్తి
ఆదివాసి యోధుడు ప్రయాగ్ మాంఝీ కి జోహార్లు!
ఓ జర్నలిస్టు వెల్లడించిన నిజం… పోలీసుల దుర్మార్గం… నక్సలైట్ల నిబద్దత, నిజాయితీ, జనం కోసం తృణప్రాయంగా ప్రాణాలిచ్చే తత్వం 